తెలుసుకోవాల్సిన ‘‘తెలుగు సాహిత్య చరిత్ర’’


హితం కూర్చేదే సాహిత్యం! హితం అంటే ఏమిటి? అన్న ప్రశ్నతోపాటే ఎవరికి అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. దానికి సమాధానంగా మన పూర్వీకులు ‘‘విశ్వశ్రేయః కావ్యమ్‌’’ అన్నారు. అంటే ప్రపంచానికి, సమాజానికి మేలు చేకూర్చేదన్నమాట. సమాజం లేదా ప్రపంచం పెద్ద జన సమూహం కావచ్చు... లేదా చిన్నదైనా కావచ్చు. ఇకమేలుఅంటే... గురజాడ అన్నట్లు గట్టిమేల్‌’ ఏదైనా కావచ్చు. ప్రాచీనుల దృష్టిలో ఉన్నట్లు పారమార్థిక చింతన కలిగించవచ్చు, లేదా సామాజిక చింతన రగిలించవచ్చు. సమాజ తీరుతెన్నుల్ని అభివర్ణించేది కావచ్చు. లోతుపాతుల్ని వెలికి తీసి వాటిని అధిగమించాల్సిన అవసరాన్ని గుర్తు చేయవచ్చు. అన్యాయాలను, అక్రమాలను తెలుపుతూ వాటిని ఎదుర్కోగల చైతన్యాన్నివ్వచ్చు. ‘బహు జనహితాయఅన్నట్లు సమాజంలో ఉన్న అధిక సంఖ్యాకులకు హితం కలిగించేదిగా ఉండవచ్చు. సాహిత్యం లిఖితరూపంలోనో, మౌఖిక రూపంలోనో దేనిలోనైనా ఉండవచ్చు. అలాగే సాహిత్యం ప్రక్రియ రూపంలోనైనా అంటే పాట, గేయం, పద్యకవిత, వచన కవిత, కథ, నవల, వ్యాసం, వచనాలు... ఇలా ప్రక్రియలోనైనా ఉండవచ్చు. కృష్ణమాచార్యులు వచనాల ద్వారా అన్నమయ్య కృతుల ద్వారా, త్యాగయ్య కీర్తనల ద్వారా, నన్నయ్య పద్యకవిత్వం ద్వారా, శ్రీశ్రీ గేయాల ద్వారా, కుందుర్తి వచన కవితద్వారా, ఆత్రేయ చిత్రగీతాల ద్వారా, గురజాడ నాటకం ద్వారా పానుగంటి సాక్షి వ్యాసాల ద్వారా ఉన్నవ నవల ద్వారా, రావిశాస్త్రి కథల ద్వారా... ఇలా పలు ప్రక్రియల ద్వారా వారంతా ప్రజలను చైతన్యపరచినవారే. ఉత్తేజితుల్ని చేసినవారే.

అంటే ఇంత విస్తృతమైన సాహిత్య స్వరూపాన్ని, కొండని అద్దంలో చూపించేలా... అప్పుడప్పుడూ సాహిత్య చరిత్రకారులు సాహిత్య చరిత్రను ఆయా కాలాల వారికి పరిచయం చేస్తూనే ఉన్నారు. పద్దెనిమిది, పందొమ్మిదో శతాబ్దాల్లో సాహిత్య చరిత్రను ఎంతో మంది నమోదు చేశారు. ఇరవయ్యో శతాబ్దంలో పింగళి లక్ష్మీకాంతం, ఆరుద్ర, జి.నాగయ్య, కె.రామ్మోహనరాయ్‌, ద్వా.నా.శాస్త్రి, ­టుకూరి లక్ష్మీ కాంతమ్మ వంటి వారు చేసిన కృషి ఎంతో ప్రశంసనీయం. ప్రస్తుతం డా. ద్వా.నా.శాస్త్రి రాసిన ‘‘తెలుగు సాహిత్య చరిత్ర నన్నయ నుండి నేటి వరకు...’’ బృహద్గ్రంధం గురించి చూద్దాం.

సాధారణ చరిత్రకారుడికీ, సాహిత్య చరిత్రకారుడికీ ఎంతో తేడా వుంది. సాహిత్య చరిత్రకారుడికి చరిత్రతోపాటు సాహిత్య పరిణామ క్రమం కూడా అర్థం కావాలి. ఆయా యుగాల్లో వెలసిన రాజులు వ్యవస్థలతోపాటు కవులు, శాసనాలు, ఉద్యమాలపట్ల అవగాహన ఉండాలి. ఆశ్రమాల నుంచి రాజాశ్రయాల మీదుగా సంస్థాలను అల్లుకొని- ఎదిగిన సాహిత్యం ఆత్మానుభవంలోనికి ఎలా ఒదిగింది, స్వతంత్ర ప్రతిపత్తిని ఎలా చేరుకొందో క్రమం బాగా తెలిసి ఉండాలి.

భాషపై పట్టుండాలి. సంస్కృతం అర్థం కావాలి. కావ్యాల్ని వ్యాఖ్యానించగలగాలి. కనీసం ప్రాచీనుల వ్యాఖ్యానాలనైనా చదివి ఉండాలి. నన్నయ్య నుంచి నేటి వరకు ఎదిగిన తెలుగు భాష, సాహిత్యంలో మూల కృతులు, అనువాదాలు, అనుసరలు వంటి వాటి పట్ల సరైన అవగాహన ఉండాలి. మన ఇటీవలి తెలుగు సాహిత్య చరిత్రకారుల్లో ఒక్క ఆరుద్ర మాత్రం బోధనేతర రంగంనుంచి వచ్చిన వారు కాగా మిగిలిన వారంతా కళాశాలల్లోనో, విశ్వవిద్యాలయాల్లోనో తెలుగు భాషా సాహిత్యాలు చదివి చరిత్ర రాసినవారే. ద్వానాశాస్త్రి కోవకు చెందిన చరిత్రకారుడే.

తెలుగు సాహిత్య చరిత్రసాహిత్య విద్యార్థులకు రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఉపయోగపడేలా రూపొందించినట్లు రచయిత ప్రకటించనట్లుగానే ఇది విస్తృత అధ్యయనం చేయాలనుకొనే వారికన్నా సాహిత్య విద్యార్థులకే బాగా ఉపయోగపడుతుంది. అలాగే సామాన్య పాఠకుల అవసరాలకు కూడా సరిపోతుంది. ఇంతకీ చరిత్ర గ్రంథాన్ని శాస్త్రి ఎలా ప్రారంభించి కొనసాగించారు? అంటే- ఇందులో ప్రధానంగా రెండు విభాగాలున్నాయి- 1) ప్రాచీన సాహిత్యం, 2) ఆధునిక సాహిత్యం. చివర్లో అనుబంధం అని కొన్ని చేర్చారు.

ప్రాచీన సాహిత్యంలో సాహిత్యం అంటే ఏమిటో పరిచయం చేశారు. నన్నయ, శివకవులు, తిక్కన, ఎర్రన, నాచన సోమన, రామాయణ కవులు, శ్రీనాధుడు, పోతన, పిల్లలమర్రి పినవీరభద్రుడు, శ్రీకృష్ణ దేవరాయలు, అల్లసాని పెద్దన, నంది తిమ్మన, ధూర్జటి, తెనాలి రామకృష్ణుడు, రామరాజభూషణుడు, పింగళి సూరన, రఘునాధనాయకుడు, చేమకూర వేంకట కవి, కంకంటి పాపరాజు... ఇలా... కవుల పేర్లతో అధ్యాయాలను విభజించారు. ఉదాహరణకి నన్నయ గురించి ఏం రాశారో చూద్దాం- అందులో ముందు నన్నయ పరిచయం, నన్నయ ఆదికవా? కాదా? మహాభారత వైశిష్ట్యం, నన్నయ- భారతరచన, భారతావతారిక, నన్నయ ఆంధ్రీకరణ విధానం, నన్నయ కవితారీతులు... ఇలా విశ్లేషించారు. అన్ని టిట్లోనూ సంక్షిప్తత బాగా కనిపిస్తుంది. ప్రాచీన కవుల గురించి పరిచయం చేసే సందర్భంలో ఆనాటి సామాజిక, రాజకీయ శక్తుల ప్రాబల్యం గురించి అంతగా ప్రస్తావన లేదు. ఇందులో అవసరమని రచయిత భావించినట్లు తోస్తుంది.

ద్వా.నా.శాస్త్రి తన రచనకి పూర్వుల చరిత్ర గ్రంథాలతో పాటు, ఆయా కవులు, గ్రంథాలు, ప్రక్రియలపై చేసిన పరిశోధనా గ్రంథాలను బాగా ఉపయోగించుకొన్నట్లు తెలుస్తుంది. ఇందులో ప్రాచీనులు, ఆధునిక రచయితల పట్ల ఆయా కాలాల్లో విమర్శకులు, పరిశోధకులు వెలిబుచ్చిన అభిప్రాయాలకు, వ్యాఖ్యలకు శాస్త్రి ఎక్కువ ప్రాధాన్యమిచ్చారు. గ్రంథం చదివితే ఎవరికైనా నన్నయనుంచి నేటి వరకు పలు ప్రక్రియల్లో రాణించిన వారు, వారి కావ్యాలు తదితరాల గురించి తెలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే ద్వా.నా. శాస్త్రి సహజంగానే సంప్రదాయవాది. కవిత్వంపట్ల చూపినంత మొగ్గు వచన ప్రక్రియలైన కథ, నవల, నాటకాల పట్ల చూపలేదనే భావం కలుగుతుంది. పుల్లాభొట్ల వెంకటేశ్వర్లు వంటి రచయితలు తెలుగు నవలా సాహిత్యంపై డెబ్బయిల వరకే ద్వానాశాస్త్రి రాసిన తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో ముప్పాతిక భాగం అంత పరిశోధన గ్రంథం రాశారు.

ద్వా.నా.శాస్త్రి తెలుగు నవల, స్వరూప స్వభావాలు, నవలల వర్గీకరణ, నవలా సాహిత్య పరిశీలనకు ముప్పై పేజీలు మాత్రమే కేటాయించడం గమనార్హం. అలాగే తెలుగు నాటకాలకు కూడా పాతిక పేజీలకన్నా ఎక్కువ కేటాయించకపోవడం నిజం. ఆధునిక సాహిత్యంలో కవలకిచ్చిన ప్రాధాన్యం వచన రచయితలకు దక్కలేదు. ఇదో లోపమనే అనిపిస్తుంది. దేవులపల్లి, విశ్వనాధ, జాషువా, త్రిపురనేని, తిలక్‌, దాశరధి, కుందుర్తి, ఆరుద్రలతోపాటు గుడిపాటి వెంకటచలం సరితూగరా? వారవందరికీ ప్రత్యేక అధ్యాయాలు కేటాయించినపుడు చలం వంటి వచన రచయిత పట్ల చిన్నచూపు దేనికని? ఇది అనాదిగా విశ్వవిద్యాలయాచార్యులు ప్రదర్శిస్తోన్న వివక్షే! వారికి సాహిత్యమంటే కవిత్వమే తప్ప ఇతరాలు కావు

దీనికి ద్వా.నా.శాస్త్రి కొంతమేరకు మినహాయింపు కాదని తెలుస్తోంది. అలా అని వచన రచయితలను పూర్తిగా విస్మరించారని కాదు. వారికివ్వాల్సిన ప్రాధాన్యం ఇవ్వలేదు. అలాగే దిగంబర, విప్లవ నయాగరా, చేతనావర్త, అనుభూతి కవులను ప్రత్యేకించి పేర్కొన్న ద్వా.నా.శాస్త్రి ఎందుకనో పైగంబర కవులను విస్మరించారు. మూడో ముద్రణ అయిన ప్రస్తుత కావ్యంలో అనుబంధాలు చేరి అందులో కవితా, కవితా, కథాసాగర్‌, ముస్లింవాద, నానీలు, బి.సి. కవిత్వం, ఆధునికోత్తరవాదం, ప్రాంతీయ వాదాలకు చోటిచ్చారు. ‘సాహిత్య సంస్థల్లో రజతరంజని, విశ్వకవిత, అమ్మ, మా ­రు, మంచికథ వంటి ప్రచురణలు అందించా ఆచార్య సి.నారాయణరెడ్డి, గోపీ, చేరా వంటి వారి చేత విశ్వవిద్యాలయం చేసినంత కృషిని చేసిన సంస్థగా మన్నన పొందినరంజనిసంస్థను కానీ, దాని ప్రచురణలు కానీ నామమాత్రంగా పేర్కొనలేదు! అలాగే ఆకాశ వాణి ఎలక్ట్రానిక్మీడియా చేసిన సాహితీ సేవకు ప్రత్యేకించి కొన్ని అధ్యాయాలు కేటాయించాల్సిన అవసరముంది. ఏది ఏమైనా ‘‘తెలుగు సాహిత్య చరిత్ర’’ అందరూ చదవదగిన గ్రంథం.

(తెలుగు సాహిత్య చరిత్ర; డా. ద్వా.నా.శాస్త్రి; ప్రతిభ పబ్లికేషన్స్‌; పుటలు: 804; వెల రూ.260/-)