-
విష్ణుషట్పదీ స్తోత్రం
నారాయణ నారాయణ జయ గోవింద హరే |నారాయణ నారాయణ జయ గోపాల హరే ||
-
శ్రీ రామ
ఆపదం అపహర్థారమ్ దాతారం సర్వ సంపదం, లోకాభి రామం శ్రీ రామం భూయో భూయో నమామ్యహమ్I
-
శ్రీ సీతామాత
త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దు:ఖ: క్షయ కరోభవ
-
ఓం నమ:శివాయ:
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ , చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ I
-
శ్రీమాత్రే నమః
అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మాయమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
-
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు
పురుషోవిష్ణు రిత్యుక్తః శివోనానామతః స్మృతః I అవ్యక్తం తు ఉమాదేవీ శ్రీర్వా పద్మ నిభేక్షణా I తత్ సంయోగా దహంకారః స చ సేనాపతిరుహః I
పుణ్యక్షేత్రాలు లేబుల్తో ఉన్న పోస్ట్లను చూపుతోంది. అన్ని పోస్ట్లు చూపించు
సనాతన
సంప్రదాయంలో స్నానం అత్యంత ప్రధానమైన ఆచారం. భగవంతుడి విభూతిని సంతరించుకోవటానికి అత్యంత ప్రధానమైన ఉపకరణం. అందుకే స్నానం చేసే సమయంలో కొన్ని
నియమాలను పాటించాల్సి ఉంటుంది. పుష్కర స్నానానికి ఇంటి నుంచి బయలుదేరే
సమయంలో ‘సర్వదా సర్వదేదేశూ
పాపుత్వాం భువనేశ్వరీ మహామాయా జగత్ధాత్రీ సచ్చిదానంద
రూపిణీ’ అని అమ్మవారికి నమస్కారం
చేసి బయలుదేరాలి. పుష్కర స్నానం ఆచరించడానికి వెళ్తున్న మాకు ఎటువంటి ఆటంకాలు
కలిగించకుండా చూడు తల్లీ అనేది
ఈ ప్రార్థన ఉద్దేశం. ఇంటి నుంచి బయల్దేరేటప్పుడే
చిటికెడు మృత్తిక (మట్టి)ను ఓ
కాగితంలో చిన్న పొట్లం కట్టి
వెంట తీసుకెళ్లండి.
ఇక
నదిలోకి దిగిన తర్వాత వీలైతే
కూర్చోవాలి. నీళ్లు తీసుకొని, శిరస్సు మీద మూడు పర్యాయాలు..
పుండరీకాక్ష అంటూ చల్లుకోవాలి. ఆ తర్వాత సంకల్పం చెప్పుకుని ఆచమనం చేయాలి. ఇంటి నుంచి తెచ్చిన మృత్తికను చేతిలో ఉంచుకుని (మగ వారు ) , పసుపు కుంకుమ చేతిలో ఉంచుకుని (ఆడవారు ).
పిప్పలాదాత్సముత్పన్నే
కృత్యేలోక
భయంకరి
మృత్తికాంతేమయాదత్తా
మహారార్ధం
ప్రకల్పయ
అన్న
శ్లోకం చదివి ఆ మట్టిని / పసుపు కుంకుమ
నదిలో వదిలివేయాలి. ఆ తర్వాత నదిలోపలికి
ప్రవేశించి- ముక్కు చెవులు మూసుకుని (బొటనివేలు తో ముక్కు , పెద్ద వేలు / మద్య వేలు తో చెవులు ) మూడుసార్లు తల మునిగేటట్లు స్నానం
చేయాలి. పుష్కర స్నానం చేసే సమయంలో పక్కవారితో
మాట్లాడకూడదు. శ్రీమాత అనే నామస్మరణ చేస్తూ
గోదావరి స్నానం చేయాలి. గోదావరిని భ్రమరాంబగా, కనకదుర్గగా.. ఇలా 108 రూపాలతో కొలుస్తారు. ఈ నామాలను ఎటువంటి
దోషాలు లేకుండా జపం చేస్తూ స్నానం
చేస్తే చాలా మంచిది. ఇక
గోదావరికి చేసే పూజలో- గంధము,
అక్షతలు అనే రెండు ఉపకరణాలను
తప్పనిసరిగా వాడాలి. ఇంటి దగ్గర చందనం
అరగదీసి.. దానిని తమలపాకులో పెట్టుకొని స్నానం చేసే సమయంలో పట్టుకువెళ్తే
చాలా మంచిది. ఇదే విధంగా మంచి
బియ్యాన్ని తీసుకొని- దానిని స్నానానికి వెళ్తే ముందురోజు ఆవుపాలు, ఆవునేయి, పసుపులతో కలిపి ఉంచాలి. ఆ
అక్షతలను తీసుకువెళ్లి గోదావరికి సమర్పిస్తే ఆమె సంతోషిస్తుంది.
మన
సనాతన సంప్రదాయం ప్రకారం గోదావరిని భ్రమరాంభగా కొలుస్తారు. ఆదిగురువు శంకరులు భ్రమరాంభాష్టకంలో ఈ విషయాన్ని వెల్లడిస్తారు.
ఇక స్నానం పూర్తయిన తర్వాత దేవతలకు, పితృదేవతలకు తర్పణం ఇచ్చి, అర్ఘ్యం ఇవ్వాలి. ఇక్కడ పిండ ప్రదానం
చేసేవారు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి.
పిండప్రదానం చేసిన తర్వాత ఇంటికి
వచ్చే ముందు స్నానం చేసి
రావాలి. స్నానం చేసినప్పుడు నియమాలను పాటించటంతో పాటుగా.. కొన్ని పనులను చేయకూడదు. స్నానం చేసే సమయంలో ఎటువంటి
పరిస్థితుల్లోను నీటిని కాలితో కానీ చేతితో కాని
తన్నకూడదు. ఆటలు ఆడకూడదు. ఎటువంటి
పరిస్థితుల్లో-మలమూత్ర విసర్జన చేయకూడదు. దిగంబర స్నానం కూడా నిషిద్ధమే. వీటిన్నిటినీ
పాటిస్తూనే పుష్కర స్నానం చేయాలి.
ఇంకా చదవండి »
దేశం నలుమూలనుంచీ లక్షలాది
భారతీయులు శ్రద్ధావిశ్వాసాలతో యమునా జలాలను ఆరాధిస్తారు. ఈ నేపథ్యంలో సరియైన
రీతిలో పరిశీలిస్తే మన పూర్వీకుల ఔన్నత్యం అవగతమవుతుంది. పరమేశ్వరుడు ఎక్కడో అతీతంగా
లేడనీ, ప్రకృతిలో ప్రత్యణువులో
ప్రకాశిస్తున్నాడనీ, ఆ సత్యాన్ని
ఆవిష్కరించుకొని నిరంతరం ఆనందంగా, ప్రేమగా, స్వేచ్ఛగా, స్వచ్ఛంగా బతకమని బోధించడమే
సనాతన మతసారం.
ఏడాదికో నదికి పుష్కరం. ఆ
సమయంలో బృహస్పతి గ్రహ ప్రభాం, పవిత్ర పుష్కరుని దివ్యత్వం
ఆయా నదులలో ప్రవేశిస్తుందని మన శాస్త్రాల మాట. ఏ రాజకీయ సిద్ధాంతాలు, సంఘసేవోద్యమాలు చేయలేని పనిని మన సనాతన సంస్కృతి
సాధిస్తోమ్ది.
"ఈ దేశమంతా నాది" అనే
భావన సనాతన ధర్మంవల్ల కలుగుతోంది. దేశమంతా ప్రవహించే నదులనీ, పుణ్యతీర్థాలనీ స్మరించుకుంటాం. పుష్కరాలు, కుంభమేళాలు వంటి పుణ్యకాలాల్లో, పండుగల్లో దేశమంతా ఒక నదీతీరానికో, ఒక దివ్యక్షేత్రానికో చేరి జనశక్తిని ప్రకటిస్తుంది. ఈ
సమాగమంలో భాషల ఎల్లలు, ప్రాంతాల హద్దులు పనిచేయవు.
పైగా - భిన్నప్రాంతాల సంస్కృతుల పరస్పరావగాహన, సామరస్య స్ఫురణ వెల్లివిరుస్తుంది. అన్ని భాగాలలోని కళలను,
ఆచార వ్యవహారాలను ఒరికొకరు అందిపుచ్చుకుంటారు.
తమ పూర్వీకులను తలంచుకొని వివిధ ధార్మిక కర్మలను ఆచరించడం కూడా మనిషికి పూర్వతరాల
పట్ల వున్న కృతజ్ఞతనీ ధార్మికతనీ స్ఫురింపజేస్తుంది. ఈ విధంగా జాతీయ సమైక్యతను
సాధిమ్చడంలో సనాతన ధర్మం బలవత్తర పాత్రను పోషిస్తోంది.
ఈ దేశపు నదులన్నింటికీ
పురాణ కథలున్నాయి. వాటితో ఈ దేశవాసుల మనసులు మధురానుబంధంతో పెనవేసుకుపోయాయి. ఇవి
కేవలం నీటి ప్రవాహాలు కావు. జీవ స్వరూపాలు. వీటికి ఆత్మ వుంది. అది మన ఆత్మలను
పలకరిస్తుంది. మన పలకరింతలకు పులకరిస్తుంది. మనల్ని పోషిస్తుంది. లాలిస్తుంది. ఈ
ప్రాణ బంధాన్ని మరింత అవగాహన చేసుకొనే ధార్మికతను ప్రబోధిస్తే, ఈ మాతృమూర్తుల పట్ల ప్రజల బాధతను తెలియజేసిన వారమవుతాం.
దేవతా మూర్తుల్నీ, అమ్మనీ ఎంత ప్రేమగా, భద్రంగా పవిత్రంగా చూడాలో అలాగే ఈ నదులపట్ల బాధ్యతతో, గౌరవంతో, పవిత్రతతో ప్రవర్తించాలనే స్పృహ ప్రతివారికీ కలగాలి, కలిగించాలి. అప్పుడే నిజమైన పుష్కర స్నానఫలం లభిస్తుంది. ఈ దేశపు అత్యధిక ప్రజావాహిని ఈ జలవాహినులలో కలసి జలకమాడి పూజించే ఈ పర్వాలను మతపరమైన క్రియలుగా భావించడం పరమ మూర్ఖత్వం. ఈ దేశప్రజలు అనాదిగా ఈ నేలతో, ఈ నీటిలో పెట్టుకున్న సనాతన బామ్ధవ్యానికి చిహ్నాలివి. అంటే - ఇవి ఈ దేశపు మట్టిలో పుట్టిన సంస్కృతికి ఆలవాలాలు. సంస్కారానికి సంకేతాలు. ఈ అవగాహన పాలకులకీ, ప్రజలకీ అవసరం. ప్రజలంతా పాల్గొనే ఈ చోట ఇంతటి అవగాహన, విశాల దృక్పథం కలిగించడంలో వివేకవంతులు తగిన బాధ్యత వహించాలి. ప్రతినది ఒడ్డునా మహా సామ్రాజ్యాలు, ఎన్నో నాగరికతలు, కళా సంస్కృతులు విలసిల్లిన ఘన చరిత్రలున్నాయి.
దేవతా మూర్తుల్నీ, అమ్మనీ ఎంత ప్రేమగా, భద్రంగా పవిత్రంగా చూడాలో అలాగే ఈ నదులపట్ల బాధ్యతతో, గౌరవంతో, పవిత్రతతో ప్రవర్తించాలనే స్పృహ ప్రతివారికీ కలగాలి, కలిగించాలి. అప్పుడే నిజమైన పుష్కర స్నానఫలం లభిస్తుంది. ఈ దేశపు అత్యధిక ప్రజావాహిని ఈ జలవాహినులలో కలసి జలకమాడి పూజించే ఈ పర్వాలను మతపరమైన క్రియలుగా భావించడం పరమ మూర్ఖత్వం. ఈ దేశప్రజలు అనాదిగా ఈ నేలతో, ఈ నీటిలో పెట్టుకున్న సనాతన బామ్ధవ్యానికి చిహ్నాలివి. అంటే - ఇవి ఈ దేశపు మట్టిలో పుట్టిన సంస్కృతికి ఆలవాలాలు. సంస్కారానికి సంకేతాలు. ఈ అవగాహన పాలకులకీ, ప్రజలకీ అవసరం. ప్రజలంతా పాల్గొనే ఈ చోట ఇంతటి అవగాహన, విశాల దృక్పథం కలిగించడంలో వివేకవంతులు తగిన బాధ్యత వహించాలి. ప్రతినది ఒడ్డునా మహా సామ్రాజ్యాలు, ఎన్నో నాగరికతలు, కళా సంస్కృతులు విలసిల్లిన ఘన చరిత్రలున్నాయి.
ఆ చరిత్రలు మిగిల్చిన
అద్భుత వారసత్వ సంపదలున్నాయి. వాటిని స్మరించడానికి, కరదీపికలుగా గ్రహించడానికి, తరువాతి తరాలకు అందించడానికి ఇంత చక్కని పర్వ వేళలను
ఏర్పరచారేమో మహర్షులు. ఒక్క మంచి పనితో, వేలాది
సత్ప్రయోజనాలను సాధింపజేసే ఇలాంటి ఉత్సవాలు, వేడుకలు ప్రజలందరి హృదయాలను ఒకే సూత్రంతో ఏకీకృతం చేసే
అద్భుత సాధనాలు.
ఇంకా చదవండి »
ఆదికాలం నుంచి ఆంధ్రప్రదేశ్ లోని 'సింహాచలం'
ఒక ప్రసిద్ధమైన వైష్ణవ పుణ్యక్షేత్రం. కైలాసంగా పిలవబడే ఈ
పుణ్యక్షేత్రం సముద్రమట్టానికి 1500 అడుగుల ఎత్తున, విశాఖ
పట్టణానికి ఉత్తరాన 10 మైళ్ళ దూరంలో ఉంది. ఈ ప్రదేశం అధికభాగం అడవులు,
కొండలతో నిండి ఉంటుంది. ఈ కొండల సముదాయం నీటిధారలతో, సన్నని కాలువలతో కూడివుంది ఇందులో ముక్యమైనది ఈశాన్యంలో ఉన్న హనుమంత ధార. మరికొన్ని
ముఖ్యమైన ధారలు సీతమ్మ ధార, సింహాచలధార, మాధవధార,
ఇందులో సింహాచల ధార అన్నిటికన్నా పెద్దది. సింహాచలం అంటే 'సింహం
యొక్క కొండ' అని అర్థం. ఇది విష్ణువు నాలుగవ అవతారమైన
నరసింహుని కొండగా భావించబడుతోంది. "సర్వం విష్ణు మయం జగత్'' అంతటా
పరమేశ్వరుడు ఉన్నాడు అనడానికి ప్రతీకగా నరసింహ అవతారం మనకి నిదర్శనంగా కనబడుతుంది.
ఈ ఆలయ ప్రధాన దేవత శ్రీవరాహ నరసింహస్వామి. యాదగిరిగుట్టలో యోగ నరసింహుడిగా,
వేదాద్రిలో లక్ష్మీనరసింహుడుగా, నరసింహస్వామి
వారిని అనేక రూపాలతో భక్తులు ఆరాధిస్తారు. దశావతారాలలో విడి అవతారాలైన వరాహ,
నరసింహ అవతారాలు రెండూ కలిసి వరాహనరసింహునిగా కనిపించడం ఈ క్షేత్రం
యొక్క ప్రత్యేకత. వరాహ ముఖం, మానవశరీరం, సింహతోకతో
కూడిన స్వామివారి శరీరం మరెక్కడా కనిపించదు. ఇక్కడి ప్రజలు స్వామివారిని
"సింహాద్రి అప్పన్న'' అని పిలుస్తారు.
బయటనుంచి ఈ ఆలయం ఒక కోటను తలపిస్తుంది. మిగతా
ఆలయాలకు విరుద్ధంగా ఈ ఆలయం పడమరముఖంగా ఉంటుంది. పడమర ముఖంగా ఉన్న మహాగోపురం నుండి
ఆలయంలోకి ప్రవేశిస్తే ప్రదక్షిణ చేసేందుకు వీలయిన మూడు ప్రాకారాలతో, అయిదు
ద్వారాలతో, నాట్య, ఆస్థాన, భోగ
మంటపాలతో ఆలయం విలసిల్లుతూ ఉంటుంది. సంతాన గోపాలయంత్రంపై ప్రతిష్టింపబడిన
కప్పస్తంభాన్ని కౌగిలించుకున్న దంపతులకు సంతాన సౌభాగ్యం కలుగుతుందని ఇక్కడివారి
విశ్వాసం. ఇక్కడ ఉత్సవమూర్తులు షడ్రూపులు. వాటినే షడ్బేరులు (ఆరు) అంటారు.
ఒక్కొక్క సేవకు ఒక్కొక్కరు. ఉత్సవమూర్తి గోవిందరాజులు, కౌతుక
మూర్తి మదనగోపాలుడు, శయనమూర్తి వేణుగోపాలుడు, స్నపన
(స్నానంచేసే మూర్తి), యోగానంద నరసింహుడు, బలిమూర్తి
సుదర్శన చక్ర పెరుమాళ్ ఇవన్నీ స్వామివారి విభిన్న రూపాల క్రిందే లెక్క. ఆయా
శరీరాలతో, ఆయా కైంకర్యాలను స్వామివారు స్వీకరిస్తూ
ఉంటారన్నమాట. మూల విరాట్టు శిలావిగ్రహం కాగా, మిగిలినవి
లోహమూర్తులు.
మూలవిరాట్టు :
మూలవిరాట్టు 'వరాహనరసింహ'
ప్రహ్లాద మందిరం మధ్యలో చందనపూతతో, లింగాకారంలో
దర్శనమిస్తాడు. ఇందులో స్వామి చుట్టూ ప్రదక్షిణ చేసే వీలుంది. ఏడాదిలో ఒక్క
అక్షయతదియ (వైశాఖశుద్ధ తృతీయ) రోజు మాత్రమే కొద్ది గంటలసేపు స్వామివారిపై ఉన్న
పూతను ఒలిచి, నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు
లభిస్తుంది. అప్పుడు త్రిభంగి భంగిమలో రెండుచేతులతో, వరాహ
ముఖంతో, నరుని శరీరంతో, సింహ
తోకతో స్వామివారు దర్శనమిస్తారు. మూలవరులకి ఇరువైపులా శ్రీదేవి, భూదేవి
ఉన్నారు. పద్మాసనంలో కూర్చుని, చేతిలో పద్మంతో అభయ వరద ముద్రలో ఉన్న చతుర్భుజ
తాయారు (లక్ష్మీ)కి, ఆండాళ్ సన్నిధులు ఉన్నాయి. ఆళ్వారులకు ఈ ఆలయంలో
గౌరవస్థానం కల్పించబడింది. ఇక్కడ భగవద్రామానుజులు, మణవాళ
మహాముని, విష్వక్సేన సన్నిధులు కూడా ఉన్నాయి. వారి జన్మ నక్షత్రాలలో
విశేషమైన పూజలు నిర్వహించబడతాయి. రామానుజ కూటం అనే వంటశాల ఆలయంలో ఉంది. వైశాఖ,
జ్యేష్ఠ మంటపాలలో విశేష పూజలు జరుగుతాయి. ప్రతి ఏటా చైత్రమాసంలో
స్వామివారి కళ్యాణం జరిపించడానికి ప్రత్యేకమైన కళ్యాణమండపం కూడా ఉంది. ఈ ఆలయానికి
రెండు పుష్కరిణిలు ఉన్నాయి. ఒకటి స్వామి పుష్కరిణి, మరొకటి
వరాహ పుష్కరిణి. ఇది కొండ కింద భాగంలో ఉంది. విశేషమైన పండుగ ఉత్సవాలలో స్వామికి ఈ
పుష్కరిణిలో స్నానం చేయిస్తారు. కొండ క్రింద ఉన్న రెండు ఉద్యానవనాల్లో స్వామి
పండుగ సమయాలలో ఊరేగిస్తారు. 'గంగధార'కు వెళ్ళే దారిలో శ్రీత్రిపురాంతక,
త్రిపురసుందరి ఆలయం ఉంది. శ్రీత్రిపురాంతక స్వామి ఇక్కడి
క్షేత్రపాలకుడు. గంగధార ప్రక్కన సీతారాముల గుడిని కూడా దర్శించుకోవచ్చు. గుడికి
వెళ్ళే మార్గంలో శ్రీకాశీ విశ్వేశ్వర, అన్నపూర్ణదేవీల సన్నిధి ఉంది.
హనుమంతునికి కూడా ప్రత్యేకమైన ఆలయం ఉంది.
దక్షిణ భారతదేశంలో గల చాలా ఆలయాలవలెనే ఈ ఆలయానికి
కూడా ప్రత్యేకమైన స్థల పురాణం ఉంది. ఈ స్థల పురాణం 32
అధ్యాయాలుగా విభజింపబడింది. తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించడానికి విష్ణుమూర్తి ఈ
కొండపై దర్శనమిస్తాడు. పురాణాల కథనం ప్రకారం, ఇది
త్రేతాయుగానికి చెందినది. మునులను అవమానించిన కారణంగా విష్ణుమూర్తి ద్వార పాలకులైన
జయ, విజయలు కశ్యప మహామునికి కుమారులుగా హిరణ్యకశిప, హిరణ్యాక్షులుగా
జన్మిస్తారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడు భూమిని బంధించి సమస్త ప్రాణులను
హింసిస్తుండగా విష్ణుమూర్తి వరాహ రూపంలో అతన్ని సంహరించి భూమిని రక్షించాడు.
సోదరుని మరణవార్తతో హిరణ్యకశిపుడు క్రోధుడై దేవతలను, ఋషులను,
హరిభాక్తులను హింసిస్తుండగా శ్రీమహావిష్ణువు తన సేవకుల్లో ఒకరైన
సుముఖున్ని హిరణ్యకశిపునికి కుమారుడిగా జన్మించమని ఆదేశించగా, అతడు
ప్రహ్లాడునిగా జన్మించి, చిన్నతనంనుండే విష్ణుభక్తుడు అయ్యాడు. ఇది సహించక
హిరణ్యకశిపుడు అనేక విధాలుగా అతన్ని మార్చడానికి ప్రయత్నించి విఫలుడై తన సేవకులతో
ప్రహ్లాదున్ని సముద్రంలో పడవేసి, అతని మీద ఒక పర్వతాన్ని వేయవలసిందిగా
ఆజ్ఞాపించాడు.
అప్పుడు సేవకులు సింహగిరి పర్వతాన్ని
ప్రహ్లాదునిపై వేయగా స్వామి వచ్చి రక్షిస్తాడు. ఆ సింహగిరే నేటి సింహాచలంగా
రూపాంతరం చెందింది. ప్రహ్లాదుని కోరికపై హిరణ్యాక్ష, హిరణ్యకశిపులని
వధించిన అవతారాలైన వరాహ, నారసింహ రూపాలతో కలిసిన రూపంగా స్వామి ఇక్కడ
వెలిశాడు. భక్తితో ప్రహ్లాదుడు స్వామికోసం ఇక్కడ ఒక ఆలయం కట్టించి వరాహనృసింహ
స్వామిని పూజించినట్టు పురాణ కథనం. కృతయుగం చివరిలో ఈ ఆలయం నిరాదరణకు గురై కొంత
భాగం భూమిలో కప్పబడిపోయింది. తరువాతి యుగంలో చంద్రవంశ రాజు వురూరవుడు ఈ ఆలయాన్ని
పునరుద్ధరించాడు. ప్రహ్లాదుని కథ విష్ణుపురాణంలోను, భాగవతంలోను
ప్రస్తావించబడింది. సింహాచలం ప్రహ్లాదుని రక్షించిన క్షేత్రంగాను, అహోబిలం
హిరణ్యకశిపుని వధించిన తరువాత వెలసిన క్షేత్రంగాను పురాణ కథనం.
ఆలయంలో స్వామివారి ప్రధానోత్సవాలు :
ఆగమ శాస్త్రం మరియు శిష్టాచార సాంప్రదాయం ప్రకారం
ఆలయ ఉత్సవాలు చాలా ఉన్నాయి. కల్యాణోత్సవం, చందనోత్సవం, ధనుర్మాస
ఉత్సవం, వారోత్సవం, మాసోత్సవం
జరుపుతారు. చందనయాత్ర వీటిల్లో అతి ముఖ్యమైనది. ఈ ఉత్సవానికి దేశం నలుమూలలనుండి
భక్తులు వస్తారు. వైశాఖ మాసంలోని అక్షయతృతీయ రోజు ఈ ఉత్సవం చేస్తారు. ఇది
శ్రీమహావిష్ణువుకి ప్రీతికరమైన ఉత్సవంగా భావిస్తారు. ఈ రోజు స్వామికి చందనం
సమర్పించినవారికి, దర్శించినవారికి మోక్షం, ఆనందం
కలుగుతాయి. స్వామివారి చందనం తెల్లవారుఝామున తీసి పన్నెండు గంటల నిజరూప దర్శనం
తరువాత సాయంత్రం మళ్ళీ చందనపూత వేస్తారు. పన్నెండు మణుగుల చందనం స్వామివారికి మూడు
సార్లుగా వేస్తారు. అవి నరసింహ జయన్తి, ఆషాడ శుద్ధపూర్ణిమ, జ్యేష్ఠ
శుద్ధ పూర్టిమ.
ఈ ఆలయం కట్టడం విభిన్నంగాను వివిధ పద్ధతుల
మిళితంగాను ఉంటుంది. ఈ ఆలయంలో ఉన్న స్తంభాలు శిల్పకళా శోభితాలు. స్తంభాల మీద
రకరకాల నరసింహ మూర్తులను ధ్యాన శ్లోక వర్ణనల ఆధారంగా మలిచారు. శ్రీవరాహ స్వామికి,
శ్రీనరసిహునికి విడివిడిగా అనేక ఆలయాలు ఉన్నప్పటికీ ఈ రెండు ఒకటిగా
కలిసి ప్రధాన దైవంగా ఆరాధించబడే స్థలం సింహాచలం ఒక్కటే. రెండూ స్వామివారి
ఉగ్రరూపాలు అవడం చేత చందనంతో కప్పబడి ఉంచారనే అభిప్రాయం ఉంది.
ఇంకా చదవండి »
‘‘కుందాభనుందరతనుః పరిపూర్ణచంద్ర,
బింబానుకారి వదనో ద్విభుజస్ర్తినేత్రః
శాన్తస్ర్తిభంగి లలితః క్షితిగుప్తపాదః, సింహాచలే
జయంతి దేవవరో నృసింహః’’
శ్రీ సింహాచల క్షేత్రంలో వెలసిన శ్రీవరాహలక్ష్మీ
నృసింహస్వామి చందనోత్సవం. సంవత్సరానికి ఒక్కరోజున అంటే ఈ వైశాఖ శుద్ధ తదియ నాడు
మాత్రమే ఆ స్వామి నిజరూప దర్శనం లభిస్తుంది. సంవత్సరమంతా చందన లేపనంతో ఉండే స్వామి
ఈ ఒక్కరోజు మాత్రం నిజరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. ఆ నిజరూప దర్శనం కోసం దేశం
నలుమూల నుంచి ఎందరో భక్తులు వస్తారు. ఆ సింహాచలేశుని చందన యాత్రకి సంబంధించి
మరిన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఈ చందన యాత్ర వెనుక, విష్ణుమూర్తి
నారసింహావతారం ధరించటం వెనుక ఓ కథ చెబుతారు. రాక్షణ రాజైన హిరణ్యకశిపుడు
భ్రహ్మకోసం తపస్సు చేసి ఏ విధంగానూ తనకి మృత్యువు రాకుండా వరం పొందుతాడు. ఆ
వరగర్వంతో లోకాలన్నింటినీ హింసించడం మొదలుపెడతాడు. అతని ఆగడాలను భరించటం కష్టమైన
సమయంలో ముల్లోకవాసులు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. అప్పుడు వారిని హిరణ్యకశిపుడు
పెట్టే బాధలనుంచి రక్షించటానికి, బ్రహ్మ ఇచ్చిన వరాలకు భంగం కలగకుండా నరుడి దేహం,
సింహపు తలతో నరసింహావతార మెత్తుతాడు విష్ణుమూర్తి. ఆ రూపంతో
హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. ఆ సంహారం మహోగ్రంగా సాగుతుంది.
ఆ తరువాత ఆ ఉగ్రం వెంటనే శాతించదు. అప్పుడు
బ్రహ్మాది దేవతలు భక్తుడైన ప్రహ్లాదునికి ఓ సలహా ఇస్తారు. బ్రహ్మదేవునికి ఓ విషయం
గుర్తుకు వస్తుంది. శ్రీచందన వృక్షానికి ఉగ్రత, ఉష్ణం,
తాపం తగ్గించే శక్తి వుంది. కాబట్టి ఆ స్వామి ఉగ్రాన్ని శ్రీ చందన
లేపనంతో శాంతింప చేయమని ప్రహ్లాదునికి సలహా ఇస్తాడు బ్రహ్మ. ఆ మాటను అనుసరించి
ప్రహ్లాదుడు చందనం తెప్పించాడు. ఆ పరిమళంలోని చలువ పరిసరాలలో ప్రసరించగానే ఆ
ఉగ్రమూర్తి శాంతించ సాగాడు. ఇక అప్పుడు ప్రహ్లాదుడు ఆ స్వామిని ప్రార్థిస్తూ చందనం
పూయటంతో పూర్తిగా శాంతించాడట ఆ ఉగ్రనరసింహుడు. ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని నరసింహ
రూపంలోనే ప్రస్తుతం సింహాచలంగా పిలుస్తున్న సింహగిరిపై ప్రతిష్టించాడని భక్తుల
నమ్మకం.
ప్రతీ ఏటా వైశాఖ శుద్ధ విదియనాడు రాత్రి ఆ
విగ్రహానికి ఉన్న పాతచందనం అంతా పూర్తిగా ఒలిచివేస్తారు. తదియనాడు స్వామికి సహస్ర
ఘటాభిషేకం, ఆ పైన విశేషపూజలు జరుపుతారు. ఈ ఒక్కరోజు భక్తులు
వరాహ, నారసింహ రూపంలో ఉన్న స్వామిని
దర్శించుకోగలుగుతారు. తిరిగి స్వామివారి చందన లేపనంతో చందనోత్సవం పూర్తవుతుంది.
వచ్చే సంవత్సరం చందనోత్సవం లోపు నాలుగుసార్లు స్వామికి చందన లేపనం చేస్తారు.
దానిని కరాళ చందన ఉత్సవం అంటారు. సింహాచలం చూసి తీరవలసిన క్షేత్రం. సంపెంగి పూల
పరిమళాలతో, ప్రశాంతమైన వాతావరణంలో, ఎత్తైన
కొండపై ఉన్న ఈ ఆలయం పడమటి ముఖంగా ఉంటుంది. ఇలా ఉన్న ఆలయాన్ని దర్శించటం వల్ల విజయం
సిద్ధిస్తుందని చెబుతారు పెద్దలు. ఆ ప్రాంతవాసులు ఆపదలు తీర్చి ఆదుకునే 'అప్పన్న'గా
పిలుస్తారు. ఈ రోజంతా అక్కడ అప్పన్న నామం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఆ స్వామి
నిజరూప దర్శనం సకల పాప హరణమని భక్తుల నమ్మకం.
ఇంకా చదవండి »

పావన గంగాతీరంలో గంగకు
ఉపనదులైన వరుణ - అసి నదుల మధ్య ఒద్దికగా అమరియున్న, అమరధామమే బెనారస్, లేక వారణాశి లేక
కాశి. "అంతర్ నేత్రాలు తెరిచే వారణాశి 4000 సంవత్సరాల నాటిది". హైందవ సంస్కృతి ప్రచారంలో,
వైజ్ఞానికంగాను, చారిత్రకంగాను అనాది నుండి పేరెన్నిక గన్న పట్టణం, కాశీ మహా పుణ్యక్షేత్రము. ఉత్తరప్రదశ్లో ఉన్నది. గంగానదికి
ఆవలివైపు బెనారస్, వారణాశి అని, ఈవలివైపు కాశి అని పిలువబడుచున్నది. వరుణ ఘట్టమునకు వాసి
ఘట్టమునకు మధ్యనున్నది గనుక, దానికి వారణాశి అని పేరు
వచ్చినది.
"కాశ్యాంతు
మరణాన్ముక్తి" అను ఆర్యోక్తి ఉన్నది. కాశీలో మరణిస్తే ముక్తి తప్పక
లభిస్తుంది అని దీని అర్ధము. ఎటు చూచినా అయిదు క్రోసులున్న ఈ పట్టణంలో, ఏజీవి మరణించినా ఆ సమయమున కుడిచెవి పైకి ఉంటుంది. ఈశ్వరుడు
తారక మంత్రోపదేశము చేసి మోక్షము ప్రసాదిస్తాడు. ప్రళయకాలమందు కూడా, వారణాశికి నాశనము లేదట, ప్రళయకాలము సమీపించు సమయమున, సప్తరుషులు, తాము సురక్షితముగా ఉండు
ప్రదేశాన్ని చెప్పమని కోరగా, ప్రళయకాలములో కూడా వారణాశి
మునిగిపోకుండా త్రిశూలముతో గ్రుచ్చి ఎత్తి ఉంచుతాను, గనుక అచట సురక్షితముగా ఉండండి అని సెలవిచ్చినాడు. కాశీ
విశ్వనాధుడు, ఆవిముక్త వారణాశ్యాం,
త్రికంట విరాజితే అని సంకల్పం చేస్తారు భక్తులు.
ఒకప్పుడు వ్యాసుడు తన పదివేల శిష్యులతోను భిక్షాటనకు కాశీరాగా, అతనిని పరీక్ష చేయుటకు గాను, అన్నపూర్ణ విశ్వేశ్వరులు ఏడు దినములు భిక్ష లభించకుండా
చేసినారు. అంత కోపితుడై వ్యాసుడు కాశీని శపించబోవ అన్నపూర్ణాదేవి ముతైదువ రూపమున
ప్రత్యక్షమై భిక్ష పెట్టినాది. పిదప శంకరుడు వ్యాసుని కాశీ నుండి బహిష్కరించినాడు.
అప్పుడు వ్యాసుడు క్షమింపమని కోరగా, నన్ను
జూడవచ్చినవారు, నిన్ను కూడా దర్శిస్తారు.
నీవు రాత్రిపూట నన్ను సేవింపవచ్చును అని శంకరుడు సెలవిచ్చినాడట. గంగానది ఆవలి
భాగమున వ్యాసకాశి ఉన్నది. అచ్చట గంగ ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నది.
యిప్పటి ఈ మందిరం 1785లో అక్బరు చెల్లెలు అహల్యాభాయి గుడిని తిరిగి నిర్మించినది.
మందిర గోపురమునకు 22 మణుగుల బంగారపు రేకు
అమర్చినారు.
ఈ బంగారము పూర్వము రణజిత్
సింగు మహారాజుచే స్వామికి అర్పింపబడినది. తెల్లవారుజామున 4 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు విశ్వనాథుని ఆలయం తెరచి యుండును.
మణి కర్ణికా ఘట్టము:
గంగానదీ తీరమున 64 స్నాన ఘట్టములు కలవు, అన్నింటికంటే ప్రాముఖ్యమైనది మణికర్ణికాఘట్టము, యాత్రీకులు ఈ ఘట్టమున స్నానముచేసి, విశ్వేశ్వరుని దర్శించుతారు. ఈ ఘట్టమునందెల్లప్పుడు శవ
దహనములు జరుగుచుండును, పూర్వము మహావిష్ణవు ఇచట,
తన చక్రముతో ఒక తటాకమును త్రవ్వి, దాని తీరమున శ్రీ విశ్వనాధుని గూర్చి తపస్సు చేసెను,
శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమై, ఆ తటాకమును చూచి విఘ్ణ దేవుని తపమునకు మెచ్చుకొనుచు
తలయూచెను, అప్పుడు శివుని
కుడిచెవినిగల, మణికుండలముజారి, ఆతటాకమున బడెను కావున ఆతటాకమునకు చక్రతీర్థమను పేరు కలిగెను.
పిదప కొంత కాలమునకు, ఈ చక్రతీర్ధము మీదుగా నది
ప్రవహించినది.
పది దోషాలు పోగొట్టే పావన
గంగ:
ముఖ్యంగా "గంగకు"
దశహరా అని ఓ పేరు ప్రాచుర్యంలో ఉన్నది అంటే పదిరకాల దోషాలను పరిహరించేది అని
అర్ధం. సకల పాప నివారిణి, గంగానది స్నానం ఏడేడు జన్మల
పాపాలను పోగొట్టే శక్తి కలది.
హరిశ్చంద్ర ఘట్టము:
పూర్వము హరిశ్చంద్ర మహారాజు
వీరబాహువునకు, సేవకుడై అచటనే కాటికాపరిగా
నుండెను. కాని ఇచట మణికర్ణికా ఘట్టములోవలె శవదహన సంస్కారములంతగా జరుగుటలేదు.
కాలభైరవ ఆలయం:
విశ్వేశ్వర దర్శనమువలెనే,
కాలభైరవ దర్శనంకూడ ముఖ్యం, గదోలియా జంక్షన్ నుండి మైలు దూరము ఉండును పూర్వము బ్రహ్మా
అన్నింటికి మూలమగు పరబ్రహ్మము నేనే అను అహంకారముతో, పరమేశ్వరినికూడ దూరాలపములాడెను, అప్పుడు పరమేశ్వరుని తేజమునుండి కాలబైరవుడు, ఉద్భవించి, తన వాడిగోళ్ళతో బ్రహ్మయుక్క
5 వ తల ఊడబెరికెను, అంత ఆతల కాల భైరవుని చేతినంటుకొనిపోయెను. భైరవుడా శిరముతో
లోకములన్నియు తురుగుచు కాశీ క్షేత్రమును ప్రవేశించగానే బహ్మహత్య పాతకమంతరించి
తనచేతినంటియున్న బ్రహ్మకపాలము భూమిపై బడెను. అది మొదలు, కాల భైరవుడు కాశీయందే వశించియుండెను.
ఇంకా చదవండి »
సౌరాష్ట్రదేశే విశదేతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకలావతంసం
భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రప్రద్యే
శ్రీశైల శృంగే విబుధాతింసంగే తులాద్రితుంగే పి ముదావసంతం
త మర్జునం మల్లిక పూర్వమేకం నమామి సంసార సముద్ర సేతుం
అవంతికాయం విహాతావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం
అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాల మహాసురేశం
కావెరికా నర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ
సదైవ మాంధాతృపురే వసంతమోంకార మీశం శివమేకమీడే
పూర్వోత్తరే ప్రజ్జ్వలికా నిధానే సదా వసంతం గిరిజాసమేతం
సురాసురాధిత పాదపద్మం శ్రీవైద్యనాథం తం మహం నమామి
యామ్యే సదంగే నగరేతి రమ్యే విభూషి తాంగం వివిధైశ్చభోగైః
సద్భక్తిముక్తి ప్రదమీశ మేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే
మహాద్రిపార్శ్వే చ తటేరమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః
సురాసురైర్యక్ష మహోరగాద్వైః కేదారమీశం శివమేకమీడే
సహ్యద్రిశీర్షే విమలే వసంతం గోదావరీతీర పవిత్ర దేశే
యద్దర్శనా త్పాతకమాశునాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే
సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్యసేతుం విశిఖై రసంఖ్యైః
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి
యం ఢాకినీ శాకినికా సమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తిహితం నమామి
సానంద మానంద వనే వసంత మాననందకందం హతపాపబృందం
వారాణసీనాథ మనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే
ఇలాపురే రమ్యవిశాలకేస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యం
వందే మహోదారతర స్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే
జ్యోతిర్మయ ద్వాదశాలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ
స్తోత్రం పఠిత్వామనుజోతి భక్త్యాఫ్లం తదాలోక్య నిజం భజేచ్ఛ
జ్యోతిస్వరూపుడైన మహేశుడు ఈ పవిత్ర భారతావనిలో పన్నెండుచోట్ల జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగుదిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. సముద్రపు ఒడ్డున రెండు (బంగాళాఖాతతీరంలో రామేశ్వరలింగం, అరేబియా సముద్రతీరాన సోమనాథలింగం) పర్వత శిఖరాలలో నాలుగు (శ్రీశైలంలో మల్లిఖార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథలింగం) మైదాన ప్రదేశాలలో మూడు (దారుకావనంలో నాగేశ్వరలింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్ణేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం) నదుల ఒడ్డున మూడు (గోదావరీతీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదాతీరానా ఓంకారేశ్వరుడు, గంగానదీతీరాన విశ్వేశ్వరుడు). ఇలా మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాలలింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాలలింగము.
తైత్తీరీయోపనిషత్తుననుసరించి 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారము 8. పృథ్వి 9. జలము 10.తేజస్సు 11. వాయువు 12. ఆకాశం – ఈ పన్నెండు తత్త్వాలే పన్నెండు జ్యోతిర్లింగాలు.
ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి. ఖాట్మండులోని పశుపతినాథలింగం ఈ పన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది. ఈ జ్యోతిర్లింగాలలొ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క మహిమ ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుటమవుతుంటాయి. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంతకోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దలవాక్కు.
1. శ్రీ సోమనాథ జ్యోతిర్లింగం
సౌరాష్ట్రదేశే విశదేతి రమ్యే, జ్యోతిర్మయం చంద్రకలవతంసం
భక్తిప్రదానాయ క్రుపావతీర్థం, తం సోమనాథం శరణం ప్రపద్యే
స్వామి సోమనాథునిగా వెలసిన కథ స్కాంద పురాణంలో ఉంది.
బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్షప్రజాపతికి అశ్విని నుంచి రేవతి వరకు 27 కుమార్తెలున్నారు. తన కుమార్తెలను చంద్రునికి ఇచ్చి ఘనంగ వివాహం జరిపించాడు దక్షుడు. అయితే చంద్రుడు రోహిణిని మాత్రం అనురాగంతో చూస్తూ, మిగిలినవారిని అలక్ష్యం చేయసాగాడు. మిగిలినవారు తండ్రితో ఈ విషయాన్నీ మొరపెట్టుకోగా, దక్షుడు అల్లుడైన చంద్రుడిని మందలిస్తాడు. అయినప్పటికీ, చంద్రుని ప్రవర్తనలో మార్పురాకపోవడంతో, క్షయరోగగ్రస్తుడవు కమ్మని చంద్రుని శపిస్తాడు దక్షుడు. ఫలితంగా చంద్రుడు క్షీణించసాగాడు. చంద్రకాంతి లేకపోవడంతో ఔషధాలు, పుష్పాలు ఫలించలేదు. ఈ పరిస్థితిని చూసిన సమస్తలోకవాసులు, తమ కష్టాలు తీరేమార్గం చూపమని బ్రహ్మ దేవుని ప్రార్థించారు. బ్రహ్మ ఆదేశాన్ననుసరించి ప్రభాసక్షేత్రంలో మహామృత్యుంజయ మంత్రానుష్ఠానంగా శంకరుని ఆరాధించిన చంద్రుడు, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించగా, శంకరుడు ప్రత్యక్షమై, చంద్రుని రోగ విముక్తుని గావించి, కృష్ణపక్షంలో చంద్రకళలు రోజు రోజుకీ తగ్గుతాయనీ, శుక్లపక్షంలో దిన మొక కళ చొప్పున పెరుగుతుందని అనుగ్రహించాడు. ఆనాటి నుండి చంద్రుని కోరిక మేర, అతని కీర్తిదిశదిశలా వ్యాపించేందుకై చంద్రుని పేరుతో సోమనాథునిగా, కుష్టు వంటి మహా రోగాలను తగ్గించే సోమనాథ్ జ్యోతిర్లింగరూపునిగా పార్వతీదేవిసమేతంగా వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.
2. శ్రీ మల్లిఖార్జున జ్యోతిర్లింగం
శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే, శేషాద్రి శృంగేపి సదావసంతం
తమర్జునం మల్లికపూర్వ మేనం, నమామి సంసార సముద్రసేతుం
శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి కోపోద్రిక్తుడై తల్లిదండ్రులను వదలి, క్రౌంచపర్వతానికి చేరుకోగా, కుమారుని వదలి ఉండలేని పార్వతీపరమేశ్వరులు ఈ ప్రాంతంలోనే ఆగిపోయారని పురాణ కథనం. అందుకే "శ్రీశైల శిఖరాన్ని దర్శించుకుంటే పునర్జన్మ ఉండద"ని అంటారు. అలాగే పర్వతుడనే ఋషి తపఃఫలంగా పరమశివుడు ఇక్కడ లింగరూపంలో ఆవిర్భవించాడని మరోకథనం.
కాశ్యాంతు మరణాన్ముక్తిః స్మరణా దరుణాచలే
దర్శనాదేవ శ్రీశైలే పునర్జన్మ న విద్యతే
కాశీ క్షేత్రంలో మరణం, అరుణాచలంలో భగవన్నామస్మరణం, శ్రీశైలంలో లింగ దర్శనం ముక్తిదాయకాలు. కృతయుగంలో హిరణ్యకశిపుడు, త్రేతాయుగంలో రావణ సంహారానంతరం శ్రీరామచంద్రుడు, ద్వాపరయుగంలో అరణ్యవాసానంతరం పాండవులు, శ్రీశైలానికి వచ్చి భ్రమరాంబ సమేత మల్లిఖార్జునస్వామివారిని దర్శించుకున్నట్లు పురాణ కథనం. సీతారాముల రామసహస్రలింగం, సీతాసహస్రలింగాలను ప్రతిష్టించినట్లు ప్రసిద్ధి. ఈ కలియుగంలో ఆదిశంకరాచార్య, ఆచార్యనాగార్జునుడు, కృష్ణదేవరాయలు, ఛత్రపతి శివాజీ వంటివారెందరో స్వామిని దర్శించుకుని పూజలు జరిపించారు.
3. శ్రీ మహాకాళేశ్వర జ్యోతిర్లింగం
విహితావతారం, ముక్తిప్రదానాయచ సజ్జనానాం
అకాల మ్రుత్యోహ పరిరక్షనార్థం, వందే మహాకాల మహం సురేశం
పరమేశ్వరునికి స్మశానమంటే అత్యంత ఇష్టం. ఈ భూమిపైనున్న సిద్ధక్షేత్రాలలో నైమిశారణ్యం – పుష్కరం – కురుక్షేత్రం ముఖ్యమైనవి. కురుక్షేత్రం కంటే పదిరెట్లు కాశీ పుణ్యప్రదమైనది. కాశీ కంటే మహాకాలవనం పదిరెట్లు గొప్పది. తీర్థాలలో అత్యుత్తమైనది ప్రభాసం – శ్రీశైలం – దారుకావనం. వీటన్నికంటే మహాకాలవనం గొప్పది. ఎందుకంటే, స్మశానం – ఎడారి – పాలంపీఠం – అరణ్యం అంటూ ఐదు ఒకేచోట ఉన్న ప్రదేశం ఉజ్జయిని. పూర్వం వేదప్రియుడనే శివభక్తునికి దేవ ప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే నలుగురుకుమారులుండేవారు. ఈ నలుగురు కూడా శివభక్తులే. ఇదిలా ఉండగా, రత్నమాల పర్వతంపై నివసిస్తున్నా దూషణాసురుడనే రాక్షసుడు, వీరి పూజలకు ఆటంకాన్ని కలిగిస్తూ, అందరినీ హింసిస్తూండేవాడు. ఆ రాక్షసుని బాధలను తట్టుకోలేని అన్నదమ్ములు పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజించాగా, శివుడు మహాకాలుడై ఆవిర్భవించి, దూషణాసురుని,అతని సైన్యాన్ని భస్మం చెసాడు. అప్పట్నుంచి ఉజ్జయినీ నగరంలో విలసిల్లుతున్న మహాకాలేశ్వరుడు త్రిభువన లింగాలలో ప్రసిద్ధునిగా వెలుగొందుతున్నాడు.
4. శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగం
కావేరికా నర్మదయోహ పవిత్రే, సమాగమే సజ్జనతారనాయ
సదివ మాదాత్రుపురే వసంత, మొన్కారమీశం శివమేకామీడే
ఒకసారి వింధ్యపర్వతం తనకంటే గొప్పవారేవారూ లేరని విర్రవీగుచుండగా, నీకంటే మేరుపర్వతం గొప్పదని నారదమహర్షి చెప్పగా, కుపితుడై, ఓంకార క్షేత్రానికెళ్ళి శివదేవుని పార్థివలింగాన్ని భక్తితోపూజిస్తూ తపస్సు చేసాడు. శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకొమ్మనగా, వింధ్యుడు ‘స్వకార్యాన్ని సాధించుకునే శక్తిని ప్రాదించమని’ వేడుకున్నాడు. శివుడు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పుడు సమస్త దేవతలంతా స్వామివారిని ఓంకారేశ్వరంలో కొలువై ఉండమని ప్రార్థించారు. వారి కోరికను మన్నించిన స్వామి ప్రణవాకారంలో ఓంకారేశ్వరునిగా కొలువైయ్యాడు. ఇదిలా ఉండగా, శివుని నుంచి వరాన్నిపొందిన వింధ్యుడు, వరగర్వంతో ఎంతో ఎత్తుకు పెరిగి సూర్యచంద్రుల గమనానికి కూడా అడ్డుతగలసాగాడు. వింధ్యుని చేష్ట వలన సమస్తలోకాలు అంధకారంలొ తల్లడిల్లాయి. అప్పుడు దేవతల మొరలను ఆలకించిన పరమేశ్వరుడు వింధ్యుని గర్వమణచమని అగస్త్యమునిని పురమాయించాడు. అగస్త్యుని రాకను గమనించిన వింధ్యుడు మర్యాద పూర్వకంగా తన ఎత్తును తగ్గించి గౌరవించగా, తాను తిరిగి వచ్చేంతవరకు ఎత్తు పెరగకుండా ఉండమని దక్షిణాదికి వెళ్ళి మరల ఉత్తరాదికి వెళ్ళలేదు అగస్త్యుడు. ఫలితంగా వింధ్యుడు ఎత్తు పెరలేదు.
5. శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం
పూర్వోత్తరే పారలికాభిదానే, సదాశివం తం గిరిజాసమేతం
సురాసురారాదిత పాదపద్మం, శ్రీ వైద్యనాథం సతతం నమామి
వైద్యానాథ జ్యోతిర్లింగ విషయంలో అనేక భేధాభిప్రాయాలున్నాయి. మహారాష్ట్ర పర్లీ గ్రామంలోనిదే అసలైన జ్యోతిర్లింగమని, గంగా ఖేడలోనిలింగం, పంజాబ్ కీరగ్రామం లోని లింగం, హిమాచల్ ప్రదేశ్ లోని పఠాన్ కోట్ కు సమీపంలోని లింగం, కర్ణాటకలోని గోకర్ణ లింగం…ఇవన్నీ శివుని ఆత్మలింగాలేనన్న వాదన బలంగా ఉంది. అయితే జార్ఘండ్ వైద్యనాథంలో వెలసినదే అసలైన జ్యోతిర్లింగమని విజ్ఞుల వాదన. పూర్వం రావణాసురుడు కఠోరనియమాలతో, ఒక చెట్టుకింద అగ్ని గుండాన్ని ఏర్పరచి, పార్థివలింగాన్ని, ప్రతిష్టించి, శివపంచాక్షరీమంత్రంతో, హవన కార్యక్రమంతో నిష్ఠతో ప్రార్థించగా,శివుడు రావణుని కోరికననుసరించి తన ఆత్మలింగాన్ని ప్రసాదించాడు. అయితే ఆ లింగాన్ని భూమికి తాకించిన వెంటనే అక్కడే స్థిరపడుతుందని హెచ్చరించాడు. ఆత్మలింగంతో లంకానగరాంకి తిరుగు ప్రయాణమైన రావణుడు సంధ్యావందనం చేసేందుకు ఒక పశువుల కాపరికి (దేవతల కోరికపై వినాయకుడు ఈ వేషాన్ని ధరించాడు) లింగాన్ని ఇవ్వగా, ఆ కాపరి ఆత్మలింగాన్ని కిందపెడతాడు. ఫలితంగా ఆ లింగం అక్కడే స్థిరపడుతుంది. రవణుడు ఎంతగా ఆత్మలింగాన్ని పెకలించి లంకానగరానికి తీసుకెళదామని ప్రయత్నించినప్పటికీ ఫలితం ఉండదు. వైధ్యనాథ్ దేవాలయంలో ఒక విశేషం ఉంది. సాధారణంగా శివాలయ మందిర శిఖరంపై త్రిశూలం ఉంటుంది కానీ, ఈ ఆలయ మందిర శిఖరంపై పంచశూలం ఉంది. మరి ఏ ఇతర జ్యోతిర్లింగ ఆలయాలలో ఇలాంటి అమరిక లేదు. పంచాక్షరీమంత్రంగా కలిగిన పంచముఖ శివునకు పంచప్రాణాలు అంతర్నిహితంగా కలిగిన శివతత్త్వమే ఇందులోని గూఢార్థం.
6. శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం
అమర్తసంజ్నే నగరేచ రంయే, విభూశితంగం వివిధైశ్చ భోగైహి
సాధ్భుక్తి ముక్తిప్రదమీశ మేకం, శ్రీ నాగానాతం శరణం ప్రపద్యే
పశ్చిమ సముద్ర తీరాన, దారుకుడనే రాక్షసుడు, ‘దారుక’ అనే తన భార్యతో కలిసి ప్రజలను చిత్రహింసలు గురిచేయసాగాడు. యజ్ఞయాగాదులను నాశనం చేస్తూ, ముని జనులను హింసించసాగారు. వీరి హింసను తట్టుకోలేని ఋషులు ఔర్వమహర్షికి విన్న వించుకున్నారు. ఔర్వమహర్షి ఆ రాక్షస దంపతులను సతీసమేతంగా మరణించునట్లుగా శపించాడు. ఆ మునిశాపం భూమి పైనే పనిచేస్తుంది. కనుక, రాక్షదంపతులు సముద్రమధ్యంలో నివాసమేర్పరుచుకుని సముద్రయానం చేశేవారిని పీడించసాగారు. ఇలా కనబడిన ప్రయాణీకులందరి ధనవస్తువులను అపహరిస్తూ చెరసాలలో బంధించసాగారు. అలా బంధింపబడినవారిలో సుప్రియుడోకడు. ఇతడు పరమ శివభక్తుడు. రాక్షసబాధలను తట్టుకోలేక సుప్రియుడు ఆర్తనాదం చేయగా, దివ్యతేజః పుంజము కళ్ళు మిరిమిట్లు గొలుపునట్లు ప్రకాశించింది. ఆ కాంతికి దారుకునితోపటు సమస్త రాక్షసులు నేలకొరిగారు. అక్కడ పరమశివుడు నాగరూపమై జ్యోతిర్లింగమైవెలిసాడు. ఈ స్వామికి దర్శించి, సేవించుకున్నవారికి శాశ్వత పుణ్యలోకవాసం సిద్ధిస్తుందని ప్రతీతి.
7. శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం
మహాద్రిపార్శ్వేచ తటే రామంతం, అమ్పూజ్యమానం సతతం మునీన్ద్రైహి
సురాసురైర్యక్ష మహోరగాద్యైహి కేదారమీశం శివమేకమీడే
ఒకప్పుడు బదరికావనంలోని నరనారాయణులు అరీంత్యంత నిష్ఠాగరిష్ఠులై తపస్సు చేయసాగారు. వారు కేదారక్షేత్రానికెళ్ళి మందాకినిలో స్నానం చేస్తూ, పార్థివలింగాన్ని ప్రతిష్టించి పూజ చేయసాగారు. వారి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మనగా, జ్యోతిర్లింగ రూపంలో వెలసి, జనులను గర్భవాసనరకమునుంచి తొలగించి ముక్తిని ప్రసాదించమని ప్రార్థించారు. ఈ క్షేత్రం అత్యంత ప్రాచీనమైనది. నరనారాయణులు, పంచపాండవులు, ఉపమాన్యుమహర్షి, ఆదిశంకరులవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించుకున్నట్లు ఆధారాలున్నాయి. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఏడవదిగా ప్రసిద్ధి పొందిన ఈ కేదారేశ్వరలింగం హిమాలయాలపై సముద్రమట్టానికి 11,760 అడుగుల ఎత్తులో ఉంది. కేదారేశ్వర జ్యోతిర్లింగం లింగాకారంగాకాక పట్టక రూపంలో ఉంటుంది. స్వామిని భక్తులు తాకి అభిషేకాలు చేస్తుంటారు. వైశాఖ శుద్ధ పాడ్యమి మొదలు ఆశ్వయుజ బహుళ చతుర్దశి వరకు ఆరుమాసాలు మాత్రమే ఆలయ తెరచి ఉంటుంది. దీపావళి రోజునస్వామికి నేటితోవెలిగించిన దివ్యజ్యోతి ఆరుమాసాల తరువాత తెరచినప్పటికీ వెలుగుతూకనిపిస్తుంది. ఆరునెలల పాటూ ఆలయం మూసి ఉన్న సమయంలో కొండదిగువన ఉర్విమఠంలో స్వామి కొలువై భక్తులకు దర్శన మిస్తుంటాడు. ఇక్కడ స్వామి అర్చనకై బిల్వ దళాలు దొరకనందున రుద్రప్రయాగ నుండి బ్రహ్మకమలాలను తెప్పించి పూజ చేస్తారు. ఇక్కడ అమ్మవారైన కేదారగౌరి ఆలయానికి దక్షిణం వైపు సింహాద్వారముంది. ఆలయ సభామంటపంలో నంది, పాండవులు, ద్రౌపది, కుంతి, శ్రీకృష్ణ భగవానుని విగ్రహాలున్నాయి. దేవాలయం పైభాగంలో కనిపించే మూడు శిఖరాలు త్రిశూలాన్ని తలపిస్తాయి. దేవాలయానికి ఎనిమిది దిక్కులలో రేతకుండం, శివకుండం, భృగుకుండం, రక్తకుండం, వహ్ని కుండం, బ్రహ్మతీర్థం, హంసకుండం, ఉదకకుండం అంటూ అష్టతీర్థాలున్నాయి. స్వామికి అభిషేకం చేసేందుకు ఇక్కడ గంగనీరు దొరకదు. కాబట్టి, భక్తులు హరిద్వార్, రుద్రప్రయాగ వంటి చోట్ల నుండి సీసాలలో గంగను పట్టుకెళ్ళి స్వామికి అభిషేకం చేయిస్తుంటారు.
8. శ్రీ త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగం
సింహాద్రి పార్శ్వేషి తటే ర మంతం , గోదావరీ తీర పవిత్ర దేశే
యద్దర్శనాత్పాతక జాతనాశః , ప్రజాయతే త్రయంబక మీశమీడే
ఈ క్షేత్రాన్ని త్రిసంధ్యాక్షేత్రమని కూడా పిలుస్తుంటారు. త్ర్యంబకేశ్వరుడు స్వయంభువుడు. అమ్మవారు త్ర్యంబకేశ్వరి. స్వామివారి ఆకృతి విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ పానవట్టం మధ్యలో లింగం ఉండదు. ఆ స్థానంలో రుబ్బురోలు లోపలిభాగంవలె గుంటతో లోతుగా ఉంటుంది. పరమశివుడు తిమూర్త్యాత్మకంగా, త్రిగుణాత్మకమన్నట్లు మూడు భాగాలుగా ఉంటుంది. వనవాసంలోనున్న శ్రీరామచంద్రులవారు సీతా, లక్ష్మణ సేమేతంగా పంచవటిలో పర్ణశాలను నిర్మించుకుని ఉంటుండగా, లంకేశ్వరుని సోదరి శూర్పణక శ్రీరాముని కామించాగా, అందుకు తగిన ప్రాయశ్చిత్తంగా లక్ష్మణుడు ఆమె ముక్కుచెవులను కోసి, ఇంటిదారి పట్టించాడు. శూర్పణఖ ముక్కు (నాసిక) కోసిన ప్రాంతమే నేడు ‘నాసిక్’గా పిలువబడుతోంది. ఇక్కడే గోదావరి పుట్టింది. ఇక్కడ బ్రహ్మగిరి అనే పర్వతం ఉంది. ఈ పర్వత శిఖరాగ్రాన గౌతమమహర్షి అహల్యసమేతంగా తపస్సు చేస్తున్న సమయం. జనహితం కోరి, గౌతమ ముని ద్వారా దివి నుంచి గంగను భూమికి రప్పించాలని నిర్ణయించిన మునులు అందుకు తగిన పథకాన్ని రచించారు. గౌతమమహర్షి తన ఆశ్రమంలో వరిపైరును సాగుచేస్తున్నాడు. ఆ వరి పైరు పైకి దర్భతో సృష్టించిన ఆవుదూడలను పంపించారు ఆ మునులు. తపస్సులో నున్న గౌతమ మహర్షి ఒక దర్భతో వాటిని తోలగా, దర్భ తాకినంతనే అవి చనిపోయాయి. మునుల పన్నాగం ఫలించింది. గోహత్యాపాతకం నుంచి బయటపడాలంటే గంగను భూమికి రప్పించి, ప్రాయశ్చిత్తంగా స్నానం చేయమన్నారు. వెయ్యేళ్ళు శివుని ప్రార్థించి గంగను భూమికి రప్పించాడు గౌతమ మహర్షి. గౌతమ మునీంద్రుల తపస్సువలన భూమికి తీసుకురాబడి నందున కారణంగా ‘గౌతమీనది’ అని, గోవు ప్రాణం వదిలిన ప్రదేశం నుంచి ప్రవహించిన కారణంగా ‘గోదావరి’ అని ప్రఖ్యాతి చెందింది. ఈ పుణ్య గోదావరీ నది దీనజనోద్ధరణ నిమిత్తమై దారణా, ప్రవరా, అజంతా, ఎల్లోరా గుహలను దాటుకుంటూ ప్రాణహిత, చంద్రావతీ, శబరిప్రాంతాలలో ప్రవహిస్తూ, దక్షిణ వాహినిగా మారి సుమారు 900 కి.మీ. ప్రయాణం చేసి మహరాష్ట్రంలో కోటిపల్లి దగ్గర సాగరుని చేరుకుంటుంది. గౌతమీనది పుట్టిన త్ర్యంబకంలో స్వయంభువునిగా వెలసిన స్వామి, భక్తులను తన కరుణాపూరిత దృక్కులతో కాపాడుతున్నాడు.
9. శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం
శ్రీ తామ్రామపర్నీ జలరాశియోగే, నిబధ్యసేతుం నిషి బిల్వపత్రైహి
శ్రీ రామచంద్రేన సమర్చితం , తం రామేశ్వరాఖ్యం సతతం నామామి
రానణాసురుని వధించిన శ్రీరామచంద్రుడు సీత,లక్ష్మణ హనుమత్సమేతంగా పుష్పక విమానంలో అయోధ్యానగరానికి తిరిగి వస్తూ, గంధమాదవ పర్వతంపై కాసేపు విమానాన్ని ఆపాడు. అక్కడున్న మునివరులను బ్రహ్మవంశానికి చెందిన రావణుని చంపిన పాపాన్నుండి బయటపడే మార్గాన్ని చెప్పమని అడుగుతాడు. అప్పుడు ఆ మహర్షులు, శివలింగాన్ని ప్రతిష్టించి, పూజించడం కంటే ఉత్తమమైన మార్గం లేదని చెబుతారు. శ్రీరాముడు శివలింగాన్నొకటి తీసుకురమ్మని హనుమను పురమాయించగా, శివలింగాన్ని తెచ్చేందుకు కైలాసానికి బయలుదేరుతాడు ఆంజనేయుడు. అయితే శివలింగాన్ని ప్రతిష్టించేందుకు ముహూర్తం సమీస్తున్న కొలదీ హనుమ రాక ఆలస్యమైంది. వేరే మార్గం లేక మునివరుల సలహాననుసరించి సీతచే సైకత లింగాన్ని (ఇసుకలింగాన్ని) ప్రతిష్టింపజేస్తాడు శ్రీరాముడు. ఈలోపు కైలాసం నుంచి శివలింగంతో తిరిగి వచ్చిన హనుమంతుడు, శివలింగ ప్రతిష్ట జరిగిందని తెలుసుకొని పరిపరి విధాలుగా చింతిస్తాడు. ఆంజనేయుని బాధను గమనించిన శ్రీరాముడు సైకతలింగాన్ని తొలగించి, రాజతాచలంనుంచి తను తీసుకువచ్చిన లింగాన్ని ప్రతిష్టంచమని చెబుతాడు. రాముని మాటలను విన్న ఆంజనేయుడు ఉత్సాహముతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ఎన్నో విధాలుగా ప్రయత్నించి విఫలుడవుతాడు. చివరకు తోకతో లింగాన్ని పెకిలించడానికి ప్రయత్నిస్తాడు. ఆంజనేయుని అవస్థలను గమనించిన శ్రీరామచంద్రుడు, సుమూహుర్త బలం, మంత్రబలం సైకత లింగానికి మహత్యాన్ని కలిగించాయని, కాబట్టి కైలాసం నుంచి తీసుకువచ్చిన లింగాన్ని సైకత లింగం పక్కన ప్రత్రిష్టించమని చెప్పాడు. అలా శ్రీరాముడు ప్రతిష్టించిన లింగం రామేశ్వరలింగమని, హనుమంతుడు ప్రతిష్టించిన లింగం హనుమదీశ్వరలింగమని పూజలందుకొంటున్నాయి. రామేశ్వరలింగాన్ని పూజించినవారికి బ్రహ్మహత్యాది దోషాలు తొలగిపోతాయి. కాశీయాత్ర చేసినవారు గంగాజలంతో రామేశ్వరలింగాన్ని అభిషేకిస్తే ఈశ్వరానుగ్రహం కలుగు తుందని ఋషివాక్కు, సమస్త ఐశ్వర్యసిద్ధి కలుగుతుంది.
10. శ్రీ భీమశంకర జ్యోతిర్లింగం
యో డాకిని శాకినికా సమాజే, నిషేవ్యమానం పిశితాశానైశ్చ
సదైవ భీమాది పద ప్రసిద్ధం, తం శంకరం భక్తహితం నామామి
త్రేతాయుగంలో భీమాసురుడనే రాక్షసుడు సహ్యాద్రిపై తల్లి కర్కటితో కలిసి జీవిస్తూ, ప్రజలను పీడిస్తూండేవాడు. కర్కటి, పుష్కసి – కర్కటుల కూతురు. లేక లేక పుట్టిన కూతుర్ని అత్యంత గారాబంగా పెంచసాగారు ఆ రాక్షసదంపతులు. యుక్తవయస్కురాలైన కర్కటిని విరాధునికి ఇచ్చి పెండ్లి చెసారు. ఆ విరాధుడు, శ్రీరామునిటొ జరిగిన యుద్ధంలో మరణించగా, మరలా కర్కటి తల్లిదండ్రులను ఆశ్రయించింది. ఒకరోజు అగస్త్యుని శిష్యుడైన సుతీక్షణుడు భీమానదిలో స్నానం చేస్తుండగా, కర్కటి తల్లిదండ్రులు అతనిని కబళీంచేందుకు ప్రయత్నించి, అ ముని శాపానికి గురై భస్మమయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన కర్కటి అనాథగా ఆ మిగిలింది. అనాథగా సహ్యపర్వతంపై తిరుగుతున్న కర్కటిని చూసి, మోహావేశుడైన రావణుని సోదరుడు కుంభకర్ణుడు, ఆమెను బలాత్కరించి, లంకా నగరానికి వెళ్ళిపోయాడు. ఫలితంగా కర్కటి గర్భనతై భీమాసురునికి జన్మనిచ్చింది. తన తల్లి కథను విన్న భీమాసురుడు, దీనంతాటికి కారకుడు రామావతారం ధరించిన విష్ణువేనని, విష్ణువుపై తన పగను తీర్చుకోవాలని, వేయి సంవత్సరాలపాటు బ్రహ్మ గురించి తపస్సుచేసి వరాలను పొందాడు. ఎల్లలోకవాసులను గడగడలాడించిన భీమాసురుడు కామరూప దేశాధిపతి సుదక్షిణుని ఓడించి కారాగృహంలో బంధించాడు.అతని భార్య సుదక్షిణాదేవిని కూడ బంధిస్తాడు. కారాగారంలో సంకెళ్ళతో బంధింపబడినప్పటికీ ఆ దంపతులు, మానస గంగాస్నానం చేస్తూ, ఇసుకలింగాన్ని చేసి ఆరాద్ హించసాగారు. వారి పూజలను చూసిన భీమాసురుడు ఈ లింగం మిమ్ములను రక్షిస్తుందా అంటూ తన కరవాలాన్ని విసురుతాడు. రాక్షసుని కత్తి పార్థివలింగాన్ని తాకినంతనే కోటి సూర్యప్రభలతో స్వామి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, త్రిశూలంతో రాక్షస సంహారం గావించాడు. సకలలోకవాసులు సంతోషించారు. అప్పట్నుంచి స్వామి లోకకళ్యాణార్థం అక్కడనే ఉంటూ భక్తజనా వళిని కరుణిస్తున్నాడు. ఎందరో భక్తుల కోరికలను ఈడేరుస్తున్నాడు.
11. శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం
సానంద మానంధవనే వసంత , మానంధకంధం హతపాప బృందం
వారానసీనాథ మనాతనాతం, శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే
ఈ సృష్టికి ముందునుంచే కాశీపురం పరమ పవిత్రమై విరాజిల్లుతోంది. ఇక్కడ పరమశివుడు సగుణరూపాన్ని ధరించాడు. ఆ స్వరూపం శివశక్తి సమ్మేళనం. స్త్రీ, పురుష రూపాలకు భిన్నంగా ఉన్న ఆ రూపం ప్రకృతి,పురుషులు ఉదయించారు. పరమాత్మ తన నుండి తేజాన్ని వెలువరించి ఐదుక్రోసులమేరగల ఒక మహాపట్టణాన్ని ప్రకృతి పురుషులు తపస్సు చేయడానికి నిర్మించారు. అదే కాశి పట్టణం. పరమాత్మ అదేశానుసారం పురుషుడు సృష్టి నిర్మాణ సామార్థ్యాన్ని పొందేందుకు ఘోర తపస్సు చేసాడు. పరమపురుషుడైన శ్రీమహావిష్ణువు తపస్సు చేస్తుండగా, ఆ తపస్సు వేడికి అతని శరీరం నుండి నీరు కాలువలై ప్రవహించసాగాయి. ఆ జల ప్రదేశాన్ని చూసి ఆది నారాయణుడు ఆశ్చర్యచకితుడై తల ఊపాడు. ఆ ఊపుకు మణులతో కూడిన చెవి కమ్మ ఊడి ఒకచోట పడింది. ఆ చెవి పోగు ఊడి పడిన స్థలమే ‘మణికర్ణి’గా ప్రసిద్ధమైంది. అనంతమైన జలరాశినుండి కాశీపట్టణాన్ని పరమశివుడు తన శూలాగ్రంతో ధరించి కాపాడాడు. జాలం పైభాగంలో యోగనిద్రాపరవశుడైయున్ననారాయణుని నాభికమలం నుండి బ్రహ్మ ఉదయించి, శివాజ్ఞను అనుసరించి సృష్టి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు. ముందుగా బ్రహ్మ పంచాశత్కోటి యోజన పరిమితమగు బ్రహ్మాండాన్ని సృజించి, నాలుగు వైపులా పద్నాలుగు భువనాలను నిర్మించాడు. ఆ బ్రహ్మాండం మజ్జిగలో వెన్నముద్ద వలె తేలియాడసాగింది. ఐరావతాదులతో బ్రహ్మాండం సుస్థిరంగా నిలిచి ఉంది. ఈ బ్రహ్మాండంలో సగం మధ్య భాగం, మిగిలిన సగభాగంలో సగం ఊర్థ్వభాగం, ఇక మిగిలిఉన్న పాతికభాగం అథోలోకమని చెప్పబడుతోంది. అప్పుడు దేవతలంతా పరమశివుని ప్రార్థించి, భూలోక వాసులను కాపాడేందుకు ఇక్కడే శాశ్వతంగా ఉండమని విన్నవించుకున్నారు. వారి మొరలను ఆలించిన పరమశివుడు విశ్వేశ్వరనామంతో జ్యోతిర్లింగమై కాశీ పట్టణంలో వెలసాడు.
ఇంకా చదవండి »
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)







