ధర్మరాజు

కుంతీ పాండురాజుల అగ్రనందనుడు, యమధర్మరాజు అంశమున జన్మించినవాడు. జూదవ్యసనానికి బలియై భార్యా తమ్ములతో అష్టకష్టాలనుభవించాడు. సమతాగుణశోభితుడు, అజాతశత్రుడు.

శ్రీకృష్ణుడు కర్ణునకు జన్మరహస్యం చాటుగా తెలిపి పాండవపక్షం చేరి పాండవ సామా్రజ్యానికి అభిషిక్తుడవు కమ్మనగా కర్ణుడు
ధర్మపుత్రుడు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహింపడు. కాని అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా పుడమినంతటికి రాజై పాలించుట న్యాయం కదా అని అంటాడు. ఎంత మధుర సత్యభావన. ధన్యజీవి కర్ణుడు.

కుంతీ పాండురాజుల అగ్రనందనుడు, యమధర్మరాజు అంశమున జన్మించినవాడు. మానవస్వభావమందలి శ్రేష్ఠగుణమైన సమత (Balanced Mind) అంటే మనోనిగ్రహానికి కట్టుబడి ఆదర్శంగా జీవించిన ఒకే ఒక వ్యక్తి మనకు ఆంధ్రమహాభారతంలో కన్పిస్తాడు. సమతాగుణశోభితుడిని సమాజము అశక్తుడుగా భావిస్తుంది. అట్టివారిలో ప్రథముడు ధర్మరాజు.

పాండవుల ఉన్నతిని చూచి అసూయపడి, వారిని ద్వేషించి చాటుమాటుగా చంప ప్రయత్నించి, రాజ్యపదవి నందుకొనదలచిన వ్యక్తి దుర్యోధనుడు.

కౌరవుల అసూయాక్రోధములు ఓర్పుతో సహించి దూరదృష్టితో, బలనైపుణ్యముతో వారు కల్పించిన ప్రమాదములన్నింటిని తప్పించుకొని, సమతను కోల్పోకుండా, సాధ్యమైనంతవరకు హింసకు తొలగి, అర్హతలను, వ్యక్తిత్వమును శ్రమించి పెంచుకొని, అందరి అభిమానమును, గౌరవమును పొంది, యౌవరాజ్యపదవి నందుకొని ఎదిగిన వ్యక్తి ధర్మరాజు. ఎట్టకేలకు ఇతని ఎదుగును సహింపలేకయే కౌరవులు క్రూరకృత్యములకు పాల్పడినారు.

లాక్షాగృహ దహనసమయమున విదురుని తోడ్పాటుతో లక్కయింట భస్మము కాకుండా, తమ్ములతో, తల్లితో బయటపడినాడు. దీనికి తోడు, భీముని బలము బక, హిడింబుల ప్రమాదమును తప్పించినది. అర్జునుని అస్త్రవిద్యా నైపుణ్యము పాంచాలిని గెలిచి తెచ్చినది. శ్రీకృష్ణుని ప్రాపు, అదృష్టము నందించినది.

ఆంబికేయుడు అర్ధరాజ్యమిచ్చినను అంగీకరించి స్వీకరించినాడు. అభివృద్ధి చెందిన హస్తినను వదలి అరణ్యప్రాంతమైన ఖాండవప్రస్థమునకు పోయినాడు. తమ శక్తిసామర్థ్యములు నిరూపించుకొని, ఆనాటి రాజలోకమున తమ ఔన్నత్యమును స్థాపించుకొనవలసిన అవసరమును దర్శించినాడు. శ్రీకృష్ణుని సాయముతో, నలువురు తమ్ముల శక్తిసామర్థ్యములతో, తన వ్యవహారదక్షతతో, అనతికాలంలోనే నేల నాలుగు చెరగులు జయించి సార్వభౌమయోగ్యమైన రాజసూయ మహాయాగమును చేసినాడు. ఆనాటి రాజలోకమున తన ఔన్నత్యమును స్థాపించుకొన్నాడు. మున్ముందు కురుసార్వభౌముడితడె యని చెప్పకుండా సూచించినాడు. కౌరవులను ప్రాభవహీనుల గావించినాడు.

ధర్మజుని ద్యూతవ్యసనము కౌరవులకనుకూలించినది. కష్టపడి ఆర్జించుకొన్న రాజ్యసంపదనంతను ఒక్కపెట్టున జూదములో ఒడ్డి ఓడిపోయినాడు. వ్యసనపరత అంతటితో ఆగక, తమ్ములను, తన్ను, కట్టుకున్న భార్యను ఒడ్డి ఓడిపోయినాడు. 13 ఏండ్లు అరణ్య-అజ్ఞాతవాసములను సహనంతో గడిపాడు.

వ్యసనపరతను దారుణఫలితములననుభవించిన భార్య, తమ్ములు గూడ సహించినారు. సమతాశోభితుడైన ధర్మజుని ధీరోదాత్త వ్యక్తిత్వమట్టిది. అరణ్యవాసమును మహర్షుల అనుగ్రహ సంపాదనకు, దివ్యాస్త్రసాధనకు అద్భుతముగా వాడుకొన్నాడు.

ఘోషయాత్రలో దుర్యోధనుడు గంధర్వుల చేత చిక్కినప్పుడు, దుర్యోధనుని అమాత్యుల ప్రార్థనపై భీమార్జునులను పంపి, దుర్యోధనుని బంధవిముక్తుని చేసి, "ఎన్నడూ నిట్టి సాహసములింక నొనర్పకు"మని బుద్ధి చెప్పి పంపినాడు. వాని తేజోవధ గావించినాడు. దుర్యోధనుని ప్రాయోపవేశానికి పురికొల్పుటయే ధర్మజుని సమత సాధించిన విజయం!

అట్లే ద్రౌపదిని బలాత్కరించిన సైంధవుని, భీముడు చంపబోవ, సమత అడ్డు తగిలినది. ఆడపడుచు పసుపుకుంకుమలను తలచి సైంధవుని ప్రాణాలతో విడిపించి, పుణ్యము కట్టుకొన్నది.

యక్షప్రశ్నల సమయంలో ప్రత్యేకించి నకులుని బ్రతికించుటలోని ఔచిత్యం, ధర్మదేవతయైన సమవర్తే శ్లాఘించాల్సి వచ్చింది.

ధర్మరాజు ప్రదర్శించిన ప్రాజ్ఞత, దూరదృష్టి, మాట నేర్పరితనం, సహనం మున్నగు గుణములు అజ్ఞాతవాససమయంలో తమ్ముల, పెద్దల, ప్రజల అభిమానములను పొందినవి.

పాండవుల బలాధిక్యాన్ని తలచి భయపడు తండ్రితో దుర్యోధనుడు, తాను భీముని పడగొట్టగలనని ఇంత "ఎరిగి వెఱచి గాదె యేనూళ్లు నైనను తమకు చాలుననియె ధర్మసుతుడు" అని పలికినాడు. సమతాగుణశోభితుడైన ధర్మజుని అసమర్థుడుగా ఎంచాడు, దుర్యోధనుడు. దాని పర్యవసానం అందరకు తెలిసినదే. శ్రీకృష్ణరాయబారము విఫలమై మహాభారతసంగ్రామము నిర్ణాయకమైనది.

పాండవుల వైపు రాదలచి కౌరవుల వైపు వత్తునని, మాట యిచ్చిన మామ శల్యునితో, ఇట్లేల చేసితిరని అడుగక, మీకు కర్ణసారథ్యంబు అవశ్యంబు, గాన సమరసమయంబున నిరాకరించి పలికి, కర్ణు చిత్తంబునకుం గలంగ బుట్టించి పార్థు రక్షింపవలయునని ప్రార్థించినాడు ధర్మజుడు. ఇక్కడ మనకు ధర్మజుని రాజనీతి, ప్రాజ్ఞత, దూరదృష్టి, మాట నేర్పరితనం గోచరిస్తాయి.

ఉభయసైన్యములు సమరసిద్ధములై కురుక్షేత్రమున మోహరించియున్న సమయమున ధర్మజుడు కవచమును విడిచి, ఆయుధముల నావల బెట్టి, రథము దిగి కరములు మొగిడ్చి, పాదచారియై శత్రుపక్షసేనాపతియైన శాంతనవుని సమీపించి, ఆయన పాదాలకు నమస్కరించి, "అనఘ నీ కెదిర్చి యని సేయువాడనై మున్ననుజ్ఞ గొనగ నిన్ను గాన నెమ్మి వచ్చినాడ, నీ చేత దీవెన వడసి చనిన నేను బగఱ గెలుతు".

పుణ్యపురుషుడవైన భీష్మపితామహా! నీవు అన్నివిధాల పెద్దవాడవు. పూజనీయుడవు. దురదృష్టవశాత్తు నిన్ను యుద్ధంలో ఎదిరించవలసిన అవసరం ఏర్పడింది మాకు. అయితే ముందుగా నీ అనుమతిని అర్థించి నీ దీవెనలు పొంది తదుపరి యుద్ధం చేయాలని నేను నీ దగ్గరకు ప్రాంజలినై వచ్చాను. నీ ఆశీర్వచనం లభిస్తే నేను శత్రువులను జయించగలను.

ఇది ధర్మరాజు శీలానికి గీటురాయి. పరాక్రమప్రాభవాలలో ధర్మరాజు కంటే అతడి తమ్ములే అధికులు. అయితే శక్తిసామరా్థ్యల కంటే సౌశీల్యమే గొప్పదని అజాతశత్రువైన ధర్మరాజు మహాభారతంలో ప్రదర్శించి జీవిస్తున్నాడు.

దానికి భీష్ముడు సంతసించి, నీకు నా ఆశీస్సులు. నీవు శత్రువులను జయిస్తావని దీవిస్తూ వరం కోరుకొమ్మన్నాడు. దానికి ధర్మరాజు వెంటనే "నిన్ను పోర గెలుచు విధము బోధింపు" మన్నాడు. మహానుభావా, భీష్మపితామహా! నిన్ను యుద్ధంలో మేము గెలిచే ఉపాయం దయచేసి చెప్పుమన్నాడు. (అంటే ధర్మజుడు కోరేది భీష్ముని మరణం). మందహాసంతో తాతగారు ధర్మరాజుతో నన్ను జయించే ఉపాయం చెప్పటానికి ఇది తగిన సమయం కాదని, "క్రమ్మరంగ ఏతెంచెదు గాక"- నీవు మరల నన్ను సందర్శించుమని చెప్పాడు. పిదప ధర్మరాజు ద్రోణుడు, కృపుడు, శల్యుల వద్దకు వెళ్లి, వారి పాదాలకు నమస్కారాలు చేసి, ఆశీర్వాదాలు పొందాడు.

వధోపాయం తెలుపమని అడుగగా ద్రోణుడు, ఎంతో నమ్మదగినవాడు నా గుండె భరించలేని కీడు మాట వినిపిస్తే -అస్త్రసనా్న్యసం చేస్తానన్నాడు

భీష్ముడు యుద్ధం చేసేటప్పుడు తాను యుద్ధం చేయనని ప్రతినబూనిన కర్ణుని, ప్రేక్షకుడుగా యుద్ధభూమిలో చూచిన శ్రీకృష్ణుడు, కర్ణా, భీష్ముడు మరణించే వరకు నీవు సరదాగా పాండవపక్షంలో చేరి యుద్ధం చేయవచ్చు గదా అనిపిలవటం అత్యాశ్చర్యకర సన్నివేశం. సన్నివేశంలో ధర్మరాజు చూపిన సమయజ్ఞత, వచోనైపుణ్యం, గురుభక్తి, తాతగారిపై గల అభిమానం, గౌరవం అసామాన్యాలు, ఆదర్శనీయాలు. సమత (దమము) ఎంత శక్తివంతమైనదో సన్నివేశంలో మనం గుర్తిస్తాము. యుద్దారంభముననే భీష్మద్రోణుల హృదయముల జయించినది. తరువాత సవ్యసాచి సాధించిన విజయము శారీరికమే. ధర్మజుని మాట నేర్పు తొమ్మిదవ నాటి రాత్రి భీష్ముని శిబిరమున...

"అకట తండ్రి సచ్చినంత నుండియు, మమ్ము నరసి, బ్రోచినట్టి, యనుగు తాత జంప మది దలంచు, తెంపు సూచితె, రాజధర్మ మింత క్రూరకర్మ మగునె" -అయ్యయ్యో! తండ్రి చనిపోయింది మొదలు మమ్ములను ఎంతో గారాబంగా చూచుకొంటూ వచ్చినవాడు, మాకు చాలా ప్రియమైనవాడు అయిన తాతగారినే చంపాలనే తలంపు మనస్సులో పుట్టడం చూశావా? రాజధర్మం ఇంత ఘోరమైనదా? అని ఒకవైపు బాధను వ్యక్తీకరిస్తూ తాతను-

"చిచ్చఱ కన్ను మూసికొని చేతి త్రిశూలము డాచి లీలమై
వచ్చిన రుద్రు చందమున వ్రాలుదు వీ వని లోన నోర్వగా
వచ్చునె నిన్ను నెట్టి మగవారికి? నీకృప నాశ్రయింపగా
వచ్చితి మెవ్విధిన్ గెలువవచ్చు మహాత్మా? ఎఱుగ జెప్పవే!"

మహానుభావా! భీష్మా! మూడో కన్ను మూసికొని చేతిలో ఉండే త్రిశూలాన్ని దాచిపెట్టి విలాసంగా యుద్ధం చేయడానికి వచ్చిన ఎంత ధీరుడైనా, శూరుడైనా నిన్నెదిరించగలడా? మేము నీ దయకు పాత్రులం కావటానికే వచ్చాము. నిన్ను విధంగానైతే గెల్వవచ్చునో మాకు తెలియజేయాలి.

వధోపాయవిషయం తెలుసుకుని కార్యసాధకుడయ్యాడు అజాతశత్రువైన ధర్మరాజు. యుద్ధభూమిలో పరోక్షముగ అస్త్రగురుని ప్రాణము తీసినది గూడ ధర్మజుని మాట బలమే. పరిస్థితుల ప్రాబల్యముచే శ్రీకృష్ణుని నిర్బంధముచే అశ్వత్థామ చచ్చెనని బిగ్గరగా పలికి కుంజరమని మెల్లగా అన్నాడు. అది అబద్ధము కాని నిజము; నిజము కాని అబద్ధము. దాని దెబ్బకు అస్త్రగురుడంతటివాడు నేల కూలాడు. జీవితంలో ఎవ్వరైన ఆడక ఆడక ఆడిన అబద్ధమునకు అంత బలము! అది ఎంతవారినైన నమ్మించగలదు.

చివరకు ద్వైపాయనహ్రదము నుండి దుర్యోధనుని వెలికి రప్పించుటలో ధర్మజుడు ప్రదర్శించిన వాక్చతురత అసమానము!

"తెంపు చేసి మామీద నుఱుకుట నీకు ధాత నిర్మించిన పరమధర్మంబు, పురుషుండవైతేని దీని ననుష్ఠింపు మనిన"-

సాహసంతో మామీదికి యుద్ధానికి దూకటమే బ్రహ్మ నీకు నిర్ణయించిన ధర్మం. దీనిని ఆచరింపుము. మగటిమి కలవాడవైతే దీనిని చేయుము - అని గుండెలో సూది గ్రుచ్చినట్లు పలికి ధర్మరాజు, గదాయుద్ధమున నేనొక్కరుండనే "కొనియెద నీదు ప్రాణము లకుంఠిత బాహు విలాసభాసినై" అన్నాడు

ధర్మరాజేంటి గదతో యుద్ధం చేసే సమర్థుడా అనుకుంటూ పెనుబాము బుసకొట్టే చందాన మడుగు వెడలి బయటకు వచ్చాడు దుర్యోధనుడు. తుదకు భీముని చేతిలో మరణించాడు. ధర్మజుని మాటనేర్పు దుర్యోధనుని మడుగు నుండి బయటకు లాగి చంపించినది.

చివరకు పొలికలనిలో పుత్రశోకార్తయైన గాంధారీదేవి శాపమును తప్పించుకొన్న ధర్మజుని మాట నేర్పు, పరేంగితజ్ఞత అద్వితీయములు.

"క్రోధపరుషాక్షరముల నమ్మహారా జెచ్చటనున్నా"డని గాంధారి పలుకగనే ఆమె మనస్సెరిగిన ధర్మరాజు-

"భయకంపితగాత్రుం డగుచు, జేతులు మొగిచి, సవినయంబుగా, మెత్తని మాటల, నిదె వచ్చి దేవీ యేను పాండవాగ్రజుండ, ననుచు జేరంబోయి నీ పుత్రుల జంపించిన పాపాత్ముని క్రూరచిత్తు, బరివాదార్హున్ శాపంబున బొలియింపుము, భూపాలక వల్లభాభిపూజిత చరణా!"

కొడుకులు, మనమళ్లు క్రూరంగా చంపబడ్డారన్న వ్యథతో మిక్కిలిగా పీడించబడిన మనస్సు కలిగిన గాంధారి కోపంతోనూ, కాఠిన్యంతోనూ నిండిన కరకు ధ్వనితో ఎక్కడ మహారాజు అని అడుగగా, ధర్మరాజు భయపడి గడగడ వణుకుతూ, చేతులు ముడిచి నమస్కరించి వినయంతో నెమ్మదిగా, అమ్మా ఇదిగో నేను ధర్మరాజును వచ్చాను, చూడుము అంటూ ఆమెను సమీపించి, నానా రాజుల చేత ఆరాధింపబడే చరణసీమ కల్గిన మహారాణీ గాంధారీదేవి! నీ కొడుకులను చంపించిన పాపాత్ముడను నేను, అతి కఠిన చిత్తుడను, నిందించటానికి అన్నివిధాలా తగినవాడిని, అట్లాంటి నన్ను నీ శాపంతో చంపివేయుము- అంటూ ఆమె పాదాలపై వ్రాలాడు. ఇక తల్లి ఏమని శపించగలదు? అందుచేతనే ఆమె ఒక్క నిట్టూర్పు విడిచి ఊరుకున్నది.

మహాభారతయుద్ధానంతరము ధర్మజుని సమత చెదరినది. శ్రీకృష్ణుడతని మానసిక సంక్షోభమును మాన్పుటకు, చెదరిన సమతను చక్కదిద్దుటకు, ధర్మసామా్రజ్యపాలనాదక్షుని చేయుటకు అంపశయ్యపై నున్న భీష్ముని విజ్ఞాన సంపదనంతను సంక్రమింపజేసినాడు.

శ్రీకృష్ణరాయబారము విఫలమైన తరువాత, ఏకాంతంలో కర్ణునితో జన్మరహస్యం తెలిపి శ్రీకృష్ణుడు పాండవపక్షం చేరి పాండవ సామా్రజ్యానికి అభిషిక్తుడవు కమ్మన్నప్పుడు, కర్ణుడు పలికిన మాటలు...

"ధర్మతనయుండు తాను నా తమ్ముడగుట యెఱిగె నేనియు సామా్రజ్య మేల పూను?
నట్టి ధార్మికు డాధి పత్యంబు జేయవలవదే శాశ్వతంబుగ వసుధ కెల్ల?"

ధర్మపుత్రుడు నాకు తమ్ముడని తాను తెలుసుకుంటే భూమండలాధిపత్యం వహించడు. కాని అట్లాంటి ధర్మాత్ముడు శాశ్వతంగా పుడమి కంతటికీ రాజై పాలించటం న్యాయం కదా!


కృష్ణా! ధర్మజుడు యుద్ధయజ్ఞం చేసినపుడు ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మావంటి వారంతా ఉత్తమగతులు పొందుతా" రన్న దృఢనిశ్చయాన్ని, రాగల రోజుల్లో జరుగబోయే పరిణామాన్ని కర్ణుడు చక్కగా ఊహించాడనవచ్చు. ధన్యజీవులు అన్నదమ్ములైన కర్ణధర్మజులు!