పోతన పద్యం

తెలివి యొకింత లేనియెడ దృప్తుడనై కరిభంగి సర్వమున్
దెలిసితినంచు గర్వితమతిన్ విహరించితి దొల్లి, యిప్పు డు
జ్జ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలి నై
తెలియనివాడనై మెలగితిం గతమయ్యె నితాంతగర్వముల్


లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, ప్రాణంబులున్
ఠావుల్ దప్పెను, మూర్ఛవచ్చె, తనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
నీవే తప్ప ఇతఃపరంబెరుగ మన్నింపందగున్ దీనునిన్
రావే యీశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!

గజేంద్రుడెవడు? నేనెవరిని? పద్యాన్ని ఎలుగెత్తి చదివితే ఎందుకు నా గుండె ద్రవిస్తుంది? అది నా బాధేనా అన్న అనుభూతి ఎందువల్ల? ఇదంతా అలోచిస్తే చాలా విచిత్రంగా తోస్తుంది!

గజేంద్రుడు మొసలితో కొన్ని వేల యేళ్ళు యుద్ధం చేసాడట, ఇది సాధ్యమేనా? కాదు. అవును, ప్రతీకాత్మకంగా.

కష్టాలొచ్చినప్పుడు, ఒక నెల రోజులైనా, కొన్ని వేల సంవత్సరాల్లా గడవడం సాధరణ విషయమే. సమయంలో దేవుడి మీద నమ్మకం ఉన్నవారు (కొందరు లేనివారు కూడా కలిగించుకొని) ఇలా కుయ్యి పెట్టడం కుడా తెలిసిన విషయమే. పై అవస్థ దీనికి ప్రతీక.


మరొక రకంగా ఆలోచిస్తే, సమస్త మానవ జాతీ వేన వేల సంవత్సరాలుగా ఎదో ఒక సంఘర్షణ పడుతూనే ఉంది. అలాటి ఒకానొక సందర్భంలో దేవుడనే ఒక నమ్మకంపై ఆధారపడాల్సిన సన్నివేశం తటస్థించింది. పై అవస్థ దీనికి కూడా ప్రతీకే!