ప్రదక్షిణ దేని గురించి చేస్తారు? ఇక్కడ ఏ మంత్రాలు ఉపయోగిస్తారు? ఎన్నిసార్లు ప్రదక్షిణం చేయాలి?


ప్రదక్షిణ చేయడం వల్ల పాప పరిహారం అవుతుంది. దేవాలయాలకు వెళితే గుడి చుట్టూ తిరగడంప్రదక్షిణం. మామూలుగా ఇంట్లో దేవతారాధన చేస్తే చేయవలసింది ఆత్మప్రదక్షిణం’. తనంత తాను దక్షిణం (కుడి) వైపునుండి తిరగడం, మనలో ఉన్న పరమాత్మను దర్శించేందుకు అది ఒక విధానం. గుడిలో ఆత్మ ప్రదక్షిణ పనికిరాదు.

గుడిని నిర్మించిన ఆగమ శాస్త్రానుసారం గుడి నలువైపులా వివిధ దేవతాశక్తులు ప్రతిష్ఠించపడి ఉంటాయి. గుడిచుట్టూ తిరగడం వల్ల ఆ దేవతా శక్తుల అనుగ్రహ దృష్టి మనపై పడుతుంది. అంతేకాక - గుడిలోని ప్రధానదైవం - దీపంవలె విశ్వతోముఖుడు. అంటే అన్నివైపులా చూడగలిగేవాడు. ఆ స్వామిని అన్నివైపులనుండి నమస్కరించడం కూడా ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం.

సాధారణంగా దేాలయంలో ముమ్మార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడుల ప్రకారం 11, 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది శ్లోకాలను చదువుకోవలి.

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే!!
పాపోయం పాప కర్మాహం పాపాత్మా పాపసంభవః!
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల!!
అన్యధాశరణం నాస్తి త్వమేవ శరణం మమ!
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వర!!

శక్తి దేవాలయాలకు వెళ్ళినప్పుడు పై శ్లోకాలలో దేవకు బదులుగా దేవి; శరణాగత వత్సలకు బదులుగా శరణాగత వత్సలే; మహేశ్వరకు బదులుగా మహేశ్వరి అని మార్చి చదువుకోవాలి.

ఈ శబ్దాలు ఏ శక్తి దేవతకైనా సరిపోతాయి. అలాగే దేవ, మహేశ్వర మొదలైన శబ్దాలు విష్ణువుకైనా, శివునకైనా, ఇతర దైవానికైనా చెప్పవచ్చు.