జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం - వాతాపి, ఇల్వ

చాలా ఏళ్ల క్రితం మన దేశమంతా అరణ్యాలతో నిండి వుండేది. ఒక చోట నుండి మరొక చోటికి ప్రయాణం చెయ్యడమంటే చాలా కష్టంగా వుండేది. ఎందుచేతనంటే ఆ అరణ్యాలు రాక్షసులకు, క్రూరజంతువులకు నిలయంగా వుండేవి.

దక్షిణ హిందూ దేశంలోని అడవుల్లో అన్నదమ్ములైన వాతాపి, ఇల్వలుడు, అనే ఇద్దరు భయంకరులైన రాక్షసులు నివసిస్తూ ఉండేవారు. వీరు మనుష్యులను చంపి తింటుండేవారు. ఆ చంపి తినే పద్ధతి కూడా చాలా చిత్రంగా ఉండేది. ఇల్వలుడు బ్రాహ్మణ రూపం ధరించి ఆ అడవి వెంబడి వెళ్ళే ప్రయాణికులని, తన ఇంటికి వచ్చి ఆతిధ్యం స్వీకరించమని వినయంగా అడిగేవాడు.

పాపం వాళ్ళు... ఇల్వలుడి మాటలు నమ్మి అతని ఇంటికి వెళ్ళేవారు. వాళ్ళని స్నానం చేసి విశ్రాంతి తీసుకోమని చెప్పి వంట చేయడానికని ఇల్వలుడు వంటింట్లో దూరేవాడు. అక్కడ వాతాపిని చంపి ముక్కలు చేసి ఆ మాంసంతో వంటకాలు చేసేవాడు. వంట అయిపోయాకా అతిధుల్ని పిలిచి స్వయంగా వడ్డించేవాడు.

ఇల్వలుడు వడ్డించిన పదార్ధాలన్నీ బాటసారులు సుష్టిగా తినేవారు. భోజనం పూర్తి చేసి వాళ్ళు పీటమీద నుంచి లేవబోయే సమయానికి ఇల్వలుడు వాళ్ళముందు నిలబడి, "తాపీ! ఓ వాతాపీ! రా! త్వరగా బయటికి రా" అని పిలిచేవాడు. అతిధుల కడుపులో మాంసరూపంలొ వున్న వాతాపి ఈ పిలుపు వినగానే మళ్ళీ ప్రాణం పోసుకుని వాళ్ళ పొట్టలు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. పాపం...! ఆ అతిధులు పొట్ట పగిలి చనిపోయేవారు. అప్పుడు అన్నదమ్ములిద్దరూ చనిపోయిన అతిధుల మాంసాన్ని లొట్టలేసుకుంటూ తినేవారు.

చాలాకాలం వరకు ఈ మోసాన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కొన్నాళ్ళకు ఈ రహస్యం బయటకు పొక్కింది. అప్పుడు ఆ అరణ్యాలలో వుండే మునులంతా అగస్త్యమహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు. అగస్త్యమహర్షి గొప్ప పండితుడు, జ్ఞాని. చాలా మంత్రశక్తులు, ఉండేవి ఆయనకు. మహాసముద్రాలను, పర్వతాలను కూడా శాసించగలిగే వాడు. అగస్త్యడు వెంటనే ఇల్వలుడు, వాతాపి ఉండే ప్రదేశానికి బయలుదేరాడు.
మహర్షిని చూడగానే ఇల్వలుడు యధాప్రకారం బ్రాహ్మణ రూపంలో ఎదురు వెళ్ళి ఆ రోజుకు తన అతిధిగా వుండమని కోరాడు. అగస్త్యుడు వెంటనే అంగీకరించాడు. ఇల్వలుడు ఇల్లు చేరగానే వినయంగా చేతులు కట్టుకుని, " మహాత్మా! తమరు స్నానం చేసి జపం చేసుకుంటూ వుండండి. నేను క్షణంలో వంట చేస్తాను" అన్నాడు. తరువాత వంటింట్లోకి వెళ్ళి ఎప్పటిలాగే వాతాపిని చంపి ఆ మాంసంతో వంటకాలు చేశాడు.

తర్వాత ఇల్వలుడు మహర్షిని విందుకు పిలిచాడు. కొసరి కొసరి తను వండిన వంటకాలన్నీ వడ్డించాడు. తను ఏం తింటున్నదీ మహర్షికి తెలియకపోతే కదా..! ఆనందంగా భోజనం చేసి ఎడం చేత్తో పొట్టమీద రాసుకుంటూ మెల్లగా "జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం" అనుకున్నాడు. అది ఇల్వలుడికి వినపడలేదు.

మహర్షి చెయ్యి కడుక్కోడానికి లేచి నిలబడగానే ఇల్వలుడు " వాతాపీ..! ఓ వాతాపీ...! బయటకు రా...!" అని గట్టిగా పిలిచాడు. కాని ఎంతసేపటికీ వాతాపి బయటకు రాలేదు. ఇల్వలుడికి భయం వేసింది. 
కుతో నిష్క్రమితుం శక్తిర్ మయా జీర్ణస్య రక్షసః భ్రాతుః తే మేష రూపస్య గతస్య యమ సాదనం ||

" నీ తమ్ముడిని జీర్ణం చేసుకొని యమలోకానికి పంపించేసానురా " అని అగస్త్య మహర్షి ఇల్వలుడితో అన్నారు.
ఆగ్రహించిన ఇల్వలుడు ఘోరమైన రూపాన్ని దాల్చి అగస్త్య మహర్షి మీద పడ్డాడు. అప్పుడు అగస్త్యుడు ఒక హుంకారం చేసేసరికి ఆ ఇల్వలుడు బూడిదై పడిపోయాడు. ఆ వాతాపిని, ఇల్వలుడిని అగస్త్య మహర్షి సంహరించిన ప్రదేశమే ఈ అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం లక్ష్మణా " అని రాముడు అన్నాడు. 

పిల్లలకి తిన్నతరువాత పడే పాట 

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం
గుర్రం తిన్న గుగ్గెళ్ళు జీర్ణం
ఏనుగు తిన్న వెలక్కాయ జీర్ణం
అబ్బాయి(అమ్మాయి) తాగిన ఉగ్గుపాలు జీర్ణం
నందిలాగ కూర్చొని తాబేలులాగా పాకి

లేడిలాగా లేచి కుందేలులా బాబు(పాప) పరిగెత్తాలి