హయగ్రీవ నామం


హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం

నరం ముంచంతి పాపాని దరిద్ర మివయోషితః
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోవదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్న కన్యా ప్రవాహవత్
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతేచ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః!!
ఫలశ్రుతిః
శ్లోకత్రయమిదం దివ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజయతి ప్రోక్తం పఠతాం సంపదప్రదం!!

హయగ్రీవ హయగ్రీవ అనే శబ్దాన్ని పలికితే చాలు అట్టి మానవుని పాపాలన్నీ తొలగి అతని దరిద్రం తొలగుతుంది. హయగ్రీవ హయగ్రీవ అని పలికితే చాలు నిస్సందేహంగా గంగాదేవి ప్రవాహంలా చువు వస్తుంది. అంటే సర్వవిద్యలూ వస్తాయన్నమాట. హయగ్రీవ హయగ్రీవ అనే ధ్వనిని వింటే చాలు వైకుంఠంయొక్క తలుపులు తెరుచుకుంటాయి. అంటే వైకుంఠలోక ప్రాప్తి కలుగుతుంది. హయగ్రీవుని పదములతో మిళితమైన ఈ మూడు శ్లోకములు దివ్యమైనవి. ఎవరైతే వాటిని స్మరిస్తారో వారికి సంపదలు కలుగుతాయి.

బ్రహ్మదేవుని దివ్య వరప్రభావంతో బలగర్వితుడైన రాక్షసుడు హయగ్రీవుడు. సాధుసజ్జన హింసతో తన రాక్షస నైజాన్ని రోజురోజుకూ రెట్టింపు చేస్తున్న సమయంలో దేవతలంతా త్రిశక్తులను, త్రిమూర్తులను శరణువేడారు. ఆ సమయంలో మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అదీ ఓ రాక్షస సంహారానంతరం ఓ వింటిపై తలవాల్చి. దేవతలు నిద్రలేపగా హడావుడిగా లేచిన ఆయన తలకు వింటినారి తగిలి తెగిపడిపోయింది. దేవతలంతా జరిగిన దానికి చింతిస్తుండగా బ్రహ్మదేవుని సలహాపై ఓ అశ్వంతలను విష్ణువు శరీరానికి అతికిస్తారు. అశ్వాన్ని సంస్కృతంలో హయంఅంటారు. అందువల్ల విష్ణుమూర్తి హయగ్రీవునిగా ఖ్యాతిగాంచాడు. ఆయన దేవతలకు అభయం ఇచ్చి హయగ్రీవుని హతమార్చాడు. అయితే ఆయన ఆ సమయంలో ఎంతో ఉగ్రత్వంతో ఉండగా, ఆయనను శాంతింపజేయడానికి పార్వతీదేవి వచ్చింది. ఆమె "హయగ్రీవా! నిన్ను ఆరాధించిన వారికి సర్వవిద్యలూ కరతలామలకం కాగలవు." అని ఆయనకు ఓదివ్యశక్తిని ప్రసాదించింది. దాంతో ఆయన ఆగ్రహంనుండి పూర్తిగా ఉపశమనం పొందాడు. పిల్లలు మారాం చేస్తుంటే వారికి ఏదోలా నచ్చజెప్పినట్లే స్వామివారి ఆగ్రహాన్ని ఉపశమింపజేయడానికి సాక్షాత్తూ ఆ ఆదిపరాశక్తి రూపాంశయైన పార్వతీదేవి ఈ విద్యాశక్తి స్వామివారిి అందించిందన్నమాట. అష్టకష్టాలు పెట్టిన రాక్షసుని ఎలా సంహరించాలో తెలియక తల్లడిల్లిన ముక్కోటి దేవతలను ఊరడించి స్వామివారు తనదైన బాణిలో ఆ అసురుని సంహరించడం అత్యంత విజ్ఞానదాయకమైన అంశం. సమస్య పరిష్కారం కావడమంటే అది జ్ఞానానికి ప్రతీకయే కదా! అలా జ్ఞానానికి ప్రతీకగా ప్రాదుర్భవించిన హయగ్రీవమూర్తి స్తుతి చేసినవారికి సర్వవిద్యాబుద్ధులూ లభిస్తాయన్నమాట.

విద్య ఉన్నచోట అడగకుండానే అష్టలక్ష్ములూ కొలువై ఉంటారు. అంటే మానవజీవితానికి సర్వసుఖాలు అందినట్లే. హయగ్రీవుడు ఆవిర్భవించిన శ్రావణ పౌర్ణమినాడైనా హయగ్రీవ స్తుతిని చేసిన వారికి జ్ఞానం, సకల సంపదలు చేరువ అవుతాయి. పిల్లలు నిత్యం హయగ్రీవ స్తుతి చేస్తుంటే ఇక వారికి విద్యలో ఎదురుండదు. చక్కని సత్ఫలితాలు తథ్యం.

మంత్రశాస్త్రం ఏం చెబుతోందంటే...ఉపాసనాపరంగా మానవ, జంతు ఆకృతులు కలగలిసిన దేవతలు శీఘ్ర అనుగ్రహప్రదాతలు. అటువంటి దైవాల్లో శ్రీ హయగ్రీవ స్వామివారు ఒకరు. హయగ్రీవుని భక్తి శ్రద్ధలతో ఉపాసించిన వారికి సర్వవిద్యలూ కరలామలకమవడమే కాక, సర్వ సంపదలు లభించడం తథ్యం.

విశుద్ధ విజ్ఞాన ఘన స్వరూపం! విజ్ఞాన విశ్రాణన బద్ధదీక్షమ్!
దయానిధిం దేవభృతాం శరణ్యం! దేవం హయగ్రీవమహం ప్రపద్యే!!