దేవి నవరాత్రుల పూజ ఏ రోజు ఎలా చేయాలి


తొమ్మిది దినములు వసంత రుతువులోను, శరదృతువు లోను ఆ పరదేవతను పూజించడము నవరాత్రి పూజ అనబడును. చైత్ర మాసమునందును, ఆశ్వీజమాసమునందును శుక్ల పక్షములో పాడ్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మను ఆరాధించాలి. ఈ పూజ చేసే వ్యక్తి తొలినాటి అమావాస్యనాడు పూజకు కావలసిన పదార్ధములను సమకూర్చుకోవాలి.  ఆనాడు ఏక భుక్తం చెయ్యాలి.  ఎచ్చు తక్కువలు లేని సమతల మైన ప్రదేశములో పదారు మూరల ప్రమాణముగా ఒక మండపము నిర్మించుకొని, బంకమన్ను, ఆవు పేడ కలిపి అలికి ముగ్గులు పెట్టి దాని నడుమ నాలుగు మూరలు వైశాల్యం, ఒక మూర ఎత్తు వుండే వేదిక ఏర్పరచాలి. దానికి పైన చాందనీ తోరణాలు కట్టాలి. ఆ రాత్రి శ్రీవిద్యోపాసకులను, వేద వేత్తలను, నియమపరులైన బ్రాహ్మణులను సగౌరవముగా తన ఇంటికి ఆహ్వానించాలి.

మర్నాడు వేకువ జామునే దగ్గరగా వుండే నదిలో గాని, చెరువులో గాని, ఇంటి పెరటిలో వున్న నూతిలో గాని స్నానం, సంధ్య, గాయత్రి జపం చేసి, బ్రాహ్మణులకు యధావిధిగా సపర్యలు చేసి నూతన వస్త్రములు, నగలు సమర్పించాలి. జగజ్జనని మంత్ర జపానికి యోగ్యులైన విప్రులు తొమ్మిది మందిని గాని, ఐదుగురు గాని, ముగ్గురు గాని, చివరకు ఒక్కడైనా వుండాలి. అలాగే పారాయణకి తగిన వాడు ఒకడు వుండాలి.

స్వస్తి వాచకముతో దేవి పూజ ఆరంభించాలి. మొదట చెప్పిన వేదిక యందు పట్టు బట్ట పరచిన సింహాసనం నెలకొల్పి, దాని మీద చతుర్భుజ యైన, సింహవాహిని యైన దేవి యొక్క ప్రతిమను గాని, మట్టితో చేసిన విగ్రహము గాని, తుదకు పటము గాని స్థాపించాలి. విగ్రహము లభించని పక్షమున నవాక్షర సహితమైన యంత్రమును గాని స్థాపించి దాని ప్రక్కన మేడి, మర్రి, రావి, జువ్వి, మామిడి చిగుళ్ళతో వైదిక సూక్త పరిష్కృతమైన పుణ్యజల పూర్ణము అయిన కలశము వుంచి ఆ యంత్రముతో సహా దానిని పూజించాలి.

ఈ పూజ హస్తా నక్షత్రముతో కలసిన పాడ్యమి నాడు మొదలు పెట్టడము చాలా మంచిది అని పెద్దలు అందురు.  పగలంతా ఉపవాసము వుండి రాత్రి మాత్రమే పూజ ముగిశాక భోజనము చేస్తాను అని గాని, లేక పూర్తిగా తొమ్మిది రోజులు ఉపవాసం చేసి ఈ పూజ చేస్తాను తల్లి ! అనుగ్రహించు అని పీఠము ముందు నియమము బల్కి పూజ ఆరంభించ వలెను.

మల్లె, మాలతి, సంపెంగ, మందారము, కదంబం మొదలైన పువ్వులతో, మంచి గంధం, అగరు, కర్పూరము, మారేడు పత్రీ, అర్ఘ్యం, పాద్యం, మొదలైన షోడశోపచారములతో, కొబ్బరి, అరటి, నారింజ, దానిమ్మ, పనస, మొదలైన ఫలాలతో, భక్ష్య, భోజ్య, లేహ్య, పానీయాలతో, అన్నపాయసాలతో, ధూప దీపాలతో, స్తోత్రాలతో, అష్టోత్తరశతనామావళిలతో, లలితా సహస్ర నామావళితో, నమస్కృతులతో అమ్మను ఘన౦గా  పూజించి ఆనందపరచ వలెను. ఇలా తొమ్మిది రోజులు చేసిన వారు సాంసారిక జీవితమును సుఖ సంతోషములతో గడుపుతారు, ఎలాంటి బాధలకూ లోనుకారు.  పూజ యధావిధిగా చేసి యధాశక్తిగా అన్నదానం శ్రద్దా భక్తులతో చెయ్యాలి.

పూజ చేసే వ్యక్తి ఈ తొమ్మిది రోజులు నేలపై పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి. క్రొత్త బట్టలు, నగలు ఇచ్చి కుమారీ పూజ చెయ్యాలి.

రెండు సంవత్సరాల వయసుది కుమారి, మూడేల్లది త్రిమూర్తి, నాల్గేల్లది కళ్యాణి, ఐదు సంవత్సరాలది రోహిణి, ఆరెండ్లది  కాళి, ఏడేండ్లది చండిక, అష్ట వర్ష శాంభవి, నవ వర్ష దుర్గ, దశాబ్ద సుభద్రఆపై వయసుగల కన్యకలు పూజార్హులు కారు. కుమారి పూజవల్ల దారిద్ర్య దు:ఖాలు పోతాయి. త్రిమూర్తి పూజ దీర్ఘాయువును, ధర్మార్ధ కామ ఫలమును ఇస్తుంది, కళ్యాణి పూజ వల్ల విద్య, రాజ భోగాలు కలుగుతాయి, కాళీ పూజ పగను మట్టి పెడుతుంది, చండికా పూజ సంపత్కరి, శాంభవి పూజ రాజ్య పూజమైన ధీశక్తిని సమకూర్చుతుంది. దుర్గ ఎలాటి క్లిష్టములైన కార్యాలను సాధిస్తుంది. సుభద్ర అభీష్ట ఫలదాయిని. రోహిణి పూజ రోగములను పారద్రోలుతుంది.

కుమారి పూజ శ్రీరస్తు అని ఆరంభించాలి లేదా శ్రీ మంత్రముతోగాని, బీజ మంత్రముతోగాని మొదలు పెట్టాలి. అవలక్షణముల గల కన్యలు, రోగాలతో వున్న కన్యలు  ఈ పూజకు పనికి రారు.  ఈ పద్ధతిని అనుసరించి శ్రద్ధాభక్తులతో యధాశక్తిగా నవ రాత్రి పూజ చేయడం సర్వ శ్రేయస్కరం. శక్తి చాలనివాడు కనీసం అష్టమి నాడైనా అంబ పూజ చేస్తే మేలు కలుగుతుంది. తొమ్మిది దినాలు ఉపవాసం ఉండలేని వాడు సప్తమి, అష్టమి, నవమి యీ మూడు దినములు ఉపవాసం వుండి అమ్మ పూజ చేస్తే అమ్మ కరుణిస్తుంది.

శ్రీ లలితా పూజ.

ఏ యజ్ఞమైనా సరే, ద్రవ్య శుద్ధి, క్రియా శుద్ధి, మంత్ర శుద్ధి లేకపోతే పూర్ణ ఫలము రాదు. అధర్మ మార్గమున సంపాదించిన ధనముతో చేసిన యజ్ఞం పారలౌకిక సౌఖ్యానికి బంధకం అవుతుంది.

పూర్వము ధర్మరాజు చేసిన రాజసూయ యాగం నెల తిరగకుండానే వారిని సర్వభ్రష్టులను చేసినది. కారణం ఆ యజ్ఞానికి వారు సంపాదించిన ధనం అన్యాయ మర్గాన సంపాదించిన అవడం వల్లనే.

పాండవులు పడిన కష్టాలు ఎవ్వరూ పడలేదు. మయాజూదముతో సర్వ నాశనం. ద్రౌపదికి అవమానం, అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఇలా ఎన్నో కష్టాలు పడ్డారు. ఆ యగామునకు వారు సమకూర్చుకొన్న డబ్బు నిష్కారణముగా ఎందరో రాజులను చంపి, సంపాదించినది. దాని ఫలం వారు అనుభవించినారు.

ధర్మమర్గాన సామగ్రి సమకూర్చోని యజ్ఞం చేసినా యజ్ఞం చేడిపోయిందంటే అది మంత్ర శుద్ధి లేదని గ్రహించాలి. యజ్ఞ నిర్వహణకు వచ్చిన ఋత్విజులలో దోషము వున్నది అని గ్రహించాలి. కర్తను, ద్రవ్యమును, మంత్రమును బట్టి దేనివల్ల లోపము వుంటే దాని ఫలితముగా కర్మకి దోషం పట్టుతుంది.  చేసే యజ్ఞము, దానిని చేయించే బ్రహ్మ, దానికి సమకూర్చిన వస్తువులు శాస్త్ర సమ్మతముగా వుండాలి. వీటిలో ఏది విపరీతమైనా కర్మ సత్ఫలితమును ఇవ్వజాలదు.

శ్రీదేవి మంత్రమును దీక్షతో జపించే శ్రీదేవీ ఉపాసకుల, పుణ్యాత్ముల పాద స్పర్శతో పాపుల వల్ల సంక్రమించే పాపాలు పటాపంచలవుతాయి. తన భక్తుల స్పర్శవల్లనూ, దర్శనము వల్లనూ జలము, స్థలము రెండూ పవిత్రములవుతాయి. వారు మెట్టిన నేల పుణ్యక్షేత్రమూ, వారు చేపట్టిన నీరు పుణ్య తీర్ధమూ అవుతుంది. వారి ఆగమనముతో కష్టములు దూరమై, పాప విముక్తులౌతారు. వారి ఇంట నుంచి అలక్ష్మీ దూరమౌతుంది.

సప్తమి, అష్టమి, నవమి ఈ మూడు దినములు దేవి పూజ చేసిన వారికి, నవరాత్రి పూజలు జరిపిన వారికి ఫలం పరదేవతానుగ్రహం వల్ల కలుగుతుంది. నవరాత్రి పూజ చక్కగా చేసిన వారికి ఆ పర దేవత దీర్ఘాయువును, విద్యా కీర్తి, వైభవములను, సర్వ శుభములను అనుగ్రహిస్తుంది. ఈ పూజకు సాటిగా చెప్పదగిన పూజ మరొకటి లేదు.  ఈ జన్మలో నవరాత్రి పూజ చేయని వారు మరు జన్మలో దరిద్రులు, సంతతి లేనివారు, రోగులు, దుష్టులు, కష్టజీవులు, వితంతువులు  అవుతారు. వేయి మాటలేల ఘోర పాపాలు చేసినవాడు కూడా దేవీ నవరాత్ర వ్రతం చేసినట్లైతే సర్వ పాప విముక్తుడు అవుతాడు.

పూర్వం శ్రీరాముడు వనవాసములో తన భార్యను ఎడబాసి సుగ్రీవుని సహాయముతో ఈ దేవీ పూజావ్రతం చేసి విజయదశమి నాడే యుద్ధమును ప్రారంభించి, రావణున్ని సంహరించి, సీతను తెచ్చుకొన్నాడు.

పూర్వము సుశీలుడు అనే వైశ్యుడు శ్రీదేవి మంత్రమును ఉపాసించి, యధాశక్తిగా దేవీ నవరాత్రులు తొమ్మిది సంవత్సరములు చేసినాడు. తొమ్మిదవ యేట అష్టమి నాడు అర్ధ రాత్రియందు దేవి ప్రత్యక్షమై వారలు అనుగ్రహించినది.

పరదేవతకు పంచామృతములతో స్నాన మొనరించవలెను. మంచి చెరుకు రసముతో నిండిన నూరు కలశములతో శ్రీదేవిని అభిషేకించినవాడు తిరిగి జన్మించడు. జగదంబికను మంచి మామిడి పండ్ల రసముతో స్నానము చేయించినను, వేదపారాయణము చేయుచు చెరుకు రసముతో స్నానము చేయించినను, అట్టి భక్తుని యింటిని లక్ష్మీ, సరస్వతులెన్నడును వదలి పెట్టరు. ఎవడు వేద పారాయణ చేయుచు ద్రాక్ష రసముతో సకుటుంబముగా మహేశ్వరి నభిషేకించునో అతడు మహారాజు అగును. అగరు, కుంకుమ పువ్వు, కస్తూరి కప్పురములతో కలసిన నీటితో శ్రీసూక్తముతో దేవిని అభిషేకించిన అతని నూరు జన్మల పాపరాసులు భస్మరాసులగును. ఇలా పాలతో, తేనెతో, పెరుగుతో, నెయ్యితో శ్రీచక్రమును అభిషేకించి, మారేడు దళములతో మాయా బీజ సహిత భువనేశ్వరీ మంత్రముతో పూజించిన వాడి ప్రారబ్ద కర్మ మంతయు నశించును.

పాడ్యమి నాడు శ్రీదేవికి నేయి నైవేద్యమొసగి బ్రాహ్మణునకు దానమిచ్చిన వాడు ఆరోగ్యవంతుడగును. విదియనాడు పంచదారతో దేవిని పూజించి విప్రునకు పంచదార దాన మిచ్చినవాడు పెక్కు ఏండ్లు బ్రతుకును. తదియ నాడు పాలు నైవేద్యము పెట్టి , దానము చేసినవాడు సర్వ దుఖములనుండి విముక్తుడగును. చవతినాడు అపూపములు దానము చేసిన వాడికి విఘ్నములు తోలుగును. పంచమినాడు అరటి పండ్లు దానము చేసిన వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ యగును, షష్టినాడు కమ్మని జుంటి తేనే సమర్పించి దానము చేసినవాడు మదన సుందరుడగును. సప్తమినాడు శ్రీదేవికి గుడ నైవేద్యము చేసి దానము చేసినవాడు శోక రహితుడగును. అష్టమినాడు కొబ్బరికాయ నివేదన చేసి దానము చేసినవాడికి తాపత్రయములుండవు. నవమినాడు శ్రీ జగదంబకు పేలాలు నివేదించి దానము చేసిన వానికి పై లోకములలో సౌఖ్యములు గల్గును.

౧. పాడ్యమినాడు ...... శ్రీ బాలాత్రిపుర సుందరీ పూజ.
౨. విదియ ....             శ్రీ గాయత్రి
౩.  తదియ .....           శ్రీ మహాలక్ష్మి
౪. చవతి   .....           శ్రీ అన్నపూర్ణ
౫. పంచమి ......         శ్రీ లలిత
౬.  షష్టి      .......        శ్రీ శాకంబరి          
౭. సప్తమి    .....         శ్రీ సరస్వతి.
౮. అష్టమి   ......         శ్రీ దుర్గా దేవి
౯. నవమి   ......         శ్రీ చండిక / మహిషాసుర మర్ధిని.
౧౦. దశమి  .....          శ్రీ రాజరాజేశ్వరి
  

ఇలా తొమ్మిది రోజులు గాని, లేదా చివర మూడు రోజులు సప్తమినుంచి గానీ లేదా చివర అష్టమి, నవమి నాడు అయినా సరే శ్రీ దుర్గా దేవిని పూజించవలెను.  పూజకు అశక్తుడు అయినవాడు కనీసము రోజూ     శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమునైనా  చదువ వలెను.       శ్రీచక్ర పూజ, శ్రీ జపము చేయలేనివాడు తప్పక

శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమును యధాశక్తిగా పఠించవలెను.