మాఘపురాణం - 7వ అధ్యాయం
మృగ శృంగుడు యముని గూర్చి వ్రతమాచరించుట
ఆవిధంగా ఏనుగునకు శాపవిమోచనమైన తరువాత మరల మృగశృంగుడు
కావేరీ నదిలో దిగి అకాల మృత్యువు వాతబడిన అ అముగ్గురు కన్యలను బ్రతికించు నిమిత్తం
యమధర్మ రాజును గురించి తపస్సు చేయ నారంభించినాడు. నిశ్చల మనస్సుతో తదేక దీక్షతో యముని గూర్చి ధ్యానించుచుండగా
మృగశృంగుని కఠోరదీక్షకు యముడు సంతసించి ప్రత్యక్షమయి – “మృగశృంగా నీ కఠోరదీక్షకు, పరోపకార పరాయణతకు నేనెంతయు సంతసించితిని. ణా గురించి ఇంత
దీక్షతో ఎవ్వరూ తపమాచరించి ఉండలేదు. నీకేమి కావలయునో కోరుకొనుము. నీ యభీష్టం
నెరవేర్చెదను” అని యముడు పలికెను.
ఆ పలుకులు విని మృగశృంగుడు కన్నులు తెరచి చూడగా యముడు తన
ఎదుట నిలబడియున్నాడు. వెంటనే చేతులు జోడించి “మహానుభావా! ఎంతటి తపశ్శాలురకైనను దర్శనమివ్వని మీరు నాబోటి
సామాన్యునికి మీ దర్శనమిచ్చుట నా పూర్వజన్మ సుకృతం తప్ప వేరుకాదు. అకాల మరణమునకు
పాల్పడిన ఆ ముగ్గురు కన్యలను బ్రతికించి నన్ను సంతృప్తుని జేయుడు” అని ప్రార్థించెను.
