శ్రీమన్నారాయణీయం - సప్తమ స్కంధము, తాత్పర్యము

  

ఇరువది నాలుగవ దశకము - ప్రహ్లాద చరితము 
హిరణ్యాక్షే పోత్రీప్రవరవపుషా దేవ భవతా
హతే శోకక్రోధగ్లపితఘృతిరేతస్య సహజః |
హిరణ్యప్రారంభః కశిపురమరారాతిసదసి
ప్రతిజ్ఞామాతేనే తవ కిల వధార్థం మురరిపో || ౨౪-౧||

నారాయణా! యజ్ఞ వరాహరూపమును ధరించి నీవు హిరణ్యాక్షుని వధించితివి. అందువలన అతని సోదరుడైన హిరణ్యకశిపునకు విపరీతమైన దుఃఖము, కోపము కలుగగా పరమాత్మవగు నిన్ను వధింతునని రాక్షసులందరూ ఉన్న మహా సభలో అతడు ప్రతిజ్ఞ చేసెను. 

విధాతారం ఘోరం స ఖలు తపసిత్వా నచిరతః
పురః సాక్షాత్కుర్వన్సురనరమృగాద్యైరనిధనమ్ |
వరం లబ్ధ్వా దృప్తో జగదిహ భవన్నాయకమిదం
పరిక్షుందన్నింద్రాదహరత దివం త్వామగణయన్ || ౨౪-౨||

హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసెను. బ్రహ్మ ప్రత్యక్షమై అతడు కోరుకున్నట్లు దేవతలు, మానవులు, మృగములు మొదలగు వాని చేత చావు లేకుండునట్లువరమొసగెను . ఇట్లు దుర్లభమైన వరమును పొంది గర్వముతో హిరణ్యకశిపుడు నీవు నాయకుడిగా ఉన్న ఈ భువనములన్నిటినీ బాధలకు గురిచేయుచు నిన్ను కూడా లెక్క చేయక ఇంద్రుని నుండి స్వర్గాదిపత్యమును లాగు కొనెను.  

నిహంతుం త్వాం భూయస్తవ పదమవాప్తస్య చ రిపోః
బహిర్దృష్టేరంతర్దధిథ హృదయే సూక్ష్మవపుషా |
నదన్నుచ్చైస్తత్రాప్యఖిలభువనాంతే చ మృగయన్
భియా యాతం మత్వా స ఖలు జితకాశీ నివవృతే || ౨౪-౩||

ప్రభూ! పిమ్మట హిరణ్యకశిపుడు నిన్ను చంపదలచి చతుర్దశ భువనములను వెదకియు, నీ ఉనికిని కనుగొనలేక పోయెను. అప్పుడు నీయెడ శత్రుభావము వహించి యున్న హిరణ్యకశిపుని హృదయమందు నీవు సూక్ష్మ రూపమున ప్రవేశించి యుంటివి. నీవుఎచ్చటను కనబడనందున భయముచే పారిపోయితివని తలచి ఆ రాక్షసుడు తాను అజేయుడనను గర్వముతో వికటాట్టహాసము చేయుచు వెనుకకు మరలెను.  

తతోఽస్య ప్రహ్లాదః సమజని సుతో గర్భవసతౌ
మునేర్వీణాపాణేరధిగతభబద్భక్తిమహిమా |
స వై జాత్యా దైత్యః శిశురపి సమేత్య త్వయి రతిం
గతస్త్వద్భక్తానాం వరద పరమోదాహరణతామ్ || ౨౪-౪||

వరదా! గురువాయుపురాధీశా! ఆ హిరణ్యకశిపునకు ప్రహ్లాదుడను కుమారుడు కలిగెను. అతడు తల్లి గర్భమున ఉన్నప్పుడే నారదముని వలన నీ భక్తి మహిమను కనుగొనెను. దైత్య వంశములో పుట్టినప్పటికినీ ప్రహ్లాదుడు నీ భక్త శిఖామణియై బాల్యమునుండి ఖ్యాతి వహించెను.

సురారీణాం హాస్యం తవ చరణదాస్యం నిజసుతే
స దృష్ట్వా దుష్టాత్మా గురుభిరశిశిక్షచ్చిరమముమ్ |
గురుప్రోక్తం చాసావిదమిదమభద్రాయ దృఢమి-
త్యపాకుర్వన్ సర్వం తవ చరణభక్త్యైవ వవృధే || ౨౪-౫||

దుర్మార్గుడైన హిరణ్యకశిపుడు తన పుత్రుడు నీ భక్తుడు అయితే రాక్షసుల మధ్య అది అపహాస్యమగునని తలచి అతనిని విద్యాభ్యాసము కొరకు తన గురువుల వద్దకు పంపించెను. ప్రహ్లాదుడు తనకు గురువులు బోధించునది శ్రేయస్కరమైన విద్య కాదని భావించి నీ పాద పద్మముల సేవయే అన్నిటి కన్నా మిన్న అని తలంచెను. 

అధీతేషు శ్రేష్ఠం కిమితి పరిపృష్టేఽథ తనయే
భవద్భక్తిం వర్యామభిగదతి పర్యాకులధృతిః |
గురుభ్యో రోషిత్వా సహజమతిరస్యోత్యభివిదన్
వధిపాయానస్మిన్ వ్యతత్నుత భవత్పాదశరణే || ౨౪-౬||

ప్రహ్లాదుడు కొంతకాలము విద్యాభ్యాసము చేసిన తరువాత అతడు నేర్చుకున్న విద్య తెలిసికొన దలచి హిరణ్యకశిపుడు అతనిని తన వద్దకు రప్పించు కొనెను. హిరణ్యకశిపుడు పుత్రునితో నీవు నేర్చుకున్న విద్యలలో ఉత్తమమైనదిగా ఏది తోచినది? అని అడిగెను. అప్పుడు పరమ భక్త శిఖామణి యైన ప్రహ్లాదుడు శ్రీహరి సేవయే అన్నిటి కన్నా మిన్న అనిచెప్పెను . అప్పుడు హిరణ్యకశిపుడు కోపముతో గురువులను ప్రశ్నించగా వారు 'అది అతనికి సహజముగా కలిగిన బుద్ధి' అని చెప్పిరి. అప్పుడు హిరణ్యకశిపుడు నీపై కోపముతో ఆ ప్రహ్లాదుని చంపుటకు ఎన్నోవిధముల ప్రయత్నించెను. 

స శూలైరావిద్ధః సుబహు మథితో దిగ్గజగణైః
మహాసర్పైర్దష్టోఽప్యనశనగరాహారవిధుతః |
గిరీంద్రావక్షిప్తోఽప్యహహ పరమాత్మన్నయి విభో
త్వయి న్యస్తాత్మత్వాత్ కిమపి న నిపీడామభజత || ౨౪-౭||

దేవా! ఆ రాక్షసులు ప్రహ్లాదుని శూలములతో పొడిచిరి, మదించిన ఏనుగులతో తొక్కిన్చిరి, మహా సర్పములచే కరిపించిరి, తిండి లేక మాడ్చిరి, విషాహారమును పెట్టిరి.  ఎత్తైన ప్రదేశముల నుండి అగాధములలోకి నెట్టిరి. ఇన్ని బాధలు పెట్టినను, ప్రహ్లాదుని మనసు నీపై లగ్నమై ఉండుటచేత, నీ మహిమ వలన అతనికి ఏ బాధ కలుగ లేదు. ఇది యెంత ఆశ్చర్యకరము. 

తతః శంకావిష్టః స పునరతిదుష్టోఽస్య జనకో
గురూక్త్యా తద్గేహ కిల వరుణపాశైస్తమరుణత్ |
గురోశ్చాసాన్నిధ్యే స పునరనుగాన్ దైత్యతనయాన్
భవద్భక్తేస్తత్త్వం పరమపి విజ్ఞానమశిషత్ || ౨౪-౮||

ఈ విధముగా దండములన్ని విఫలమగుటచే హిరణ్యకశిపునికి అనుమానము వచ్చెను. అందువలన గురువు ఆశ్రమములోనే ప్రహ్లాదుని వరుణ పాశములచే బంధించెను. అయినను, గురువు దగ్గర లేనప్పుడు ఇతర దైత్య కుమారులకు పరమ విజ్ఞానమైన నీ తత్త్వమును ఉపదేశించెను. 

పితా శృణ్వన్ బాలప్రకరమఖిలం త్వత్స్తుతిపరం
రుషాంధః ప్రాహైనం కులహతక కస్తే బలమితి |
బలం మే వైకుంఠస్తవ చ జగతాం చాపి స బలం
స ఏవ త్రైలోక్యం సకలమితి ధీరోఽయమగదీత్ || ౨౪-౯||

తన కుమారుడు దైత్యపుత్రులకు నీ భక్తిజ్ఞానమును బోధించిన విషయము తెలిసిన హిరణ్యకశిపుడు 'ఓరీ దైత్యుల శత్రువా! నీకు ఇంత బలము ఎక్కడినుంచి వచ్చింది' అని గద్దించాడు. అప్పుడు ప్రహ్లాదుడు 'వైకుంఠ నాథుడు అయిన శ్రీ హరి నాకు, నీకే కాదు ఈ జగత్తు మొత్తానికి బలమైన వాడు. అతడే సమస్త లోక స్వరూపుడు' అని చెప్పెను. 

అరే క్వాసౌ క్వాసౌ సకలజగదాత్మా హరిరితి
ప్రభింతే స్మ స్తంభం చలితకరవాళో దితిసుతః |
అతః పశ్చాద్విష్ణో న హి వదితుమీశోఽస్మి సహసా
కృపాత్మన్ విశ్వాత్మన్ పవనపురవాసిన్ మృడయ మామ్ || ౨౪-౧౦||

అప్పుడు హిరణ్యకశిపుడు 'ఆ హరి ఎక్కడ - ఇక్కడ అక్కడా దానిలోనా దీనిలోనాఅని కోపావేశముతో తన కరవాలముతో ఒక స్థంభమును దూసెను. అప్పుడు ఏమి జరిగినదో వర్ణింప అలవి కాదు. ఓ ప్రభు! కృపాకరా! గురువాయురప్పా! నా బాధలను తొలగించి నాకు ఆనందము కలుగ చేయుము.
 
ఇరువది ఐదవ దశకము - శ్రీ నృశింహావతార వర్ణనము

స్తంభే ఘట్టయతో హిరణ్యకశిపోః కర్ణౌ సమాచూర్ణయన్
నాధూర్ణజ్జగదందకుండకుహరో ఘోరస్తవాభూద్రవః |
శ్రుత్వా యం కిల దైత్యరాజహృదయే పూర్వం కదాప్యశ్రుతం
కంపః కశ్చన సఫ్పపాత చలితోఽప్యంభోజభూర్విష్టరాత్ || ౨౫-౧||

ప్రభూ! హిరణ్యకశిపుడు స్థంభముపై కొట్టగానే భయంకర ధ్వనితో దానినుండి నీవు ఆవిర్భవించితివి. ఆ శబ్దమునకు చెవులు బద్దలు అయ్యెను. బ్రహ్మాండమంతా గిర్రున తిరిగినట్లాయెను. ఆ ధ్వనిని వినగానే హిరణ్యకశిపుని హృదయము కంపించెను. పద్మము నందు ఆసీనుడైన బ్రహ్మ కూడా ఆ భీకర ధ్వనికి చలించి పోయెను.

దైత్యే దిక్షు విసృష్టచక్షుషి మహాసంరంభిణీ స్తంభతః
సంభూతం న మృగాత్మకం న మనుజాకారం వపుస్తే విభో |
కిం కిం భీషణమేతదద్భుతమితి వ్యుద్భ్రాంతచిత్తేఽసురే
విస్ఫూర్జద్ధవలోగ్రరోమవికసద్వర్ష్మా సమాజృంభథాః || ౨౫-౨||

భయంకరమైన ఆ ఫెళఫెళ ధ్వనులకు హడలిపోయి హిరణ్యకశిపుడు అన్ని దిక్కులు చూచు చుండగా అంతులేని తేజస్సులను విరజిమ్ముతూ స్తంభము నుండి నీవు ఆవిర్భవించితివి. అప్పుడు నీవు పూర్తిగా సింహము గానీ మానవుడు గానీ గాక నరసింహ రూపుడవై యుంటివి. అంతట ఆ రాక్షస రాజు మిక్కిలి విభ్రాంతుడై 'భయంకరముగా, అద్భుతముగా ఉన్న ఈ రూపము ఏమిటి? ఏమిటి?' అని వణికి పోసాగెను. అంతట అతని ధైర్యము సడలి పోయెను. అప్పుడు నీవు తెల్లని నీ జూలును విదుల్చుచు విరాడ్రూపముతో విజృంభించితివి. 

తప్తస్వర్ణసవర్ణఘూర్ణదతిరూక్షాక్షం సటాకేసర-
ప్రోత్కంపప్రనికుంబితాంబరమహో జీయాత్తవేదం వపుః |
వ్యాత్తవ్యాప్తమహాదరీసఖముఖం ఖద్గోగ్రవల్గన్మహా-
జిహ్వానిర్గమదృశ్యమానసుమహాదంష్ట్రాయుగోడ్డామరమ్ || ౨౫-౩||

ప్రభూ! నీ నరసింహ రూపమున కనుగ్రుడ్లు పుటం పెట్టిన బంగారము వలె పచ్చగా ఉండి మహా భయంకరముగా తిరుగుచున్నవి. జూలు నిక్క పొడుచుకుని ఆకాశమంతా వ్యాపించియున్నది. నీ నోరు చాల భయంకరమైన గుహవలె ఒప్పుచున్నది. నోటినుండి బయటకు వచ్చి అటు ఇటు కదులుచున్న నాలుక కత్తివలె భయంకరముగా నున్నది, భీకరమైన కోరలతో విలసిల్లు చున్నది.  అట్టి నీ నరసింహ రూపమునకు జయమగు గాక. 

ఉత్సర్పద్వలిభంగభీషుణహనుం హ్రస్వస్థవీయస్తర-
గ్రీవం పీవరదోశ్శతోద్గతనఖకౄరాంశుదూరోల్బణమ్ |
వ్యోమోల్లంఘిఘనాఘనోపమఘనప్రధ్వాననిర్ధావిత-
స్పర్ధాలుప్రకరం నమామి భవతస్తన్నారసింహం వపుః || ౨౫-౪||

స్వామీ! నీవు అట్టహాసము చేసినప్పుడు నీ చెక్కిళ్ళు ముడుతలు పడుచున్నవి. నీ కంఠ భాగము పొట్టిగా దృఢమైనది. బాగుగా పుష్టి గలిగి యున్న నీ హస్తముల యొక్క గోళ్ళు మిక్కిలి వాడిగా మహా భయంకరముగా నున్నవి. నీ శరీరము ఆకాశమును అంటుకొనునట్లు చాల ఎత్తుగా నున్నది. నీ అట్టహాసము భయంకరమైన మేఘ గర్జన వలె ఉండి శత్రువులను తరిమి తరిమి కొట్టుచున్నది. ప్రభూ! అట్టి నీ నృసిమ రూపమునకు నేను భక్తితో నమస్కరింతును. 

నూనం విష్ణురయం నిహన్మ్యముమితి భ్రామ్యద్గదాభీషణం
దైత్యేంద్రం సముపాద్రవంతమధృథా దోర్భ్యాం పృథుభ్యామముమ్ |
వీరో నిర్గళితోఽథ ఖడ్గఫలకౌ గృహ్ణన్విచిత్రశ్రమాన్
వ్యావృణ్వన్పునరాపపాత భువనగ్రాసోద్యతం త్వామహో || ౨౫-౫||

దేవా! అంతట హిరణ్యకశిపుడు 'నిజముగా ఇతడే విష్ణువు. ఇతనిని నేను సంహరించెదను' అని పలుకుచు, గదను భయంకరముగా తిప్పుచు నీ మీదికి విజృంభించెను. అప్పుడు నీవు బలమైన నీ బాహువులతో ఒడుపు చూపి ఆ రాక్షసుని పట్టుకొంటివి. కానీ ఆ దుర్మార్గుడు నీ బాహు బంధములనుండి తప్పించుకొని, ఖడ్గమును, దలును చేబూని, చిత్రవిచిత్రములుగా తిరుగుచుండెను. పిమ్మట సమస్త లోకములను మ్రింగ బోవుచున్నట్లు మహా భయంకరముగా నున్న నీపైకి అతడు విరచుకొని పడెను. 

భ్రామ్యంతం దితిజాధమం పునరపి ప్రోద్గృహ్య దోర్భ్యాం జవాత్
ద్వారేఽథోరుయుగే నిపాత్య నఖరాన్వ్యుత్ఖాయ వక్షోభువి |
నిర్భిందన్నధిగర్భనిర్భరగళద్రక్తాంబు బద్ధోత్సవం
పాయం పాయముదైరయో బహుజగత్సంహారిసింహారవాన్ || ౨౫-౬||

రాక్షసాధముడైన హిరణ్యకశిపుడు కత్తిని విచిత్రముగా త్రిప్పుచున్నను  నీవు అతని గట్టిగా పట్టుకొని సభాద్వారము దగ్గర కడప మీద నీ తొడలపై చేర్చుకుని, నీ వాడియైన గోళ్ళతో గ్రుచ్చి అతని వక్షస్థలమును చీల్చితివి. అతని కడుపులో నుండి వచుచున్న వేడి రక్తముతో ఆనందముతో త్రాగి సమస్త లోకములను సంహరించు చున్నట్లు మిక్కిలి భయంకర సింహనాదము చేసితివి.

త్యక్త్వా తం హతమాశు రక్తలహరీసిక్తోన్నమద్వర్ష్మణి
ప్రత్యుత్పత్య సమస్తదైత్యపటలీం చాఖాద్యమానే త్వయి |
భ్రామ్యద్భూమి వికంపితాంబుధికులం వ్యాలోలశైలోత్కరం
ప్రోత్సర్పత్ఖచరం చరాచరమహో దుఃస్థామవస్థాం దధౌ || ౨౫-౭

స్వామీ! నీవు ఆ రాక్షసుని చంపి, అతనిని వదిలి పెట్టి రక్తపు మడుగులో తడిసి యున్న నీవు చెంగున ముందుకు దూకి, మిగిలిన రాక్షసులను చంపి తినుచున్నప్పుడు భూమిఅంతా గుండ్రముగా తిరిగి పోయినది. సముద్రములు అల్లకల్లోలము అయినవి. మహా పర్వతములు కడలి పోయినవి. ఆకాశమున నున్న నక్షత్రములు అటు ఇటు చెల్లా చెదురు అయిపోయినవి. ఈ విధముగా చరాచర ప్రపంచము దురవస్థకు గురైనది.

తావన్మాంసవపాకరాళవపుషం ఘోరాంత్రమాలాధరం
త్వాం మధ్యేసభమిద్ధరోషముషితం దుర్వారగుర్వారవమ్ |
అభ్యేతుం న శశక కోఽపి భువనే దూరే స్థితా భీరవః
సర్వే శర్వవిరించవాసవముఖాః ప్రత్యేకమస్తోషత || ౨౫-౮||

స్వామీ! నీవు హిరణ్యకశిపుని సంహరించి, అతని మాంసము, వాప మొదలైన వాటిచే మహా భయంకరముగా నుంటివి. ఆ దుష్ట రాక్షసుని ప్రేగులను మెడలో ధరించి మిక్కిలి కోపముతో గర్జిన్చుచు సభామధ్యమున కూర్చుంటివి. అట్టి నీ ఆకారమును చూచి ఎవ్వరును నీ దగ్గరకు వచ్చుటకు సాహసము చేయలేక పోయిరి. బ్రహ్మ, శంకరుడు, దేవేంద్రుడు, మొదలైన దేవతలు కూడా భయముతో చాల దూరముననే ఉండిపోయి నిన్ను వేరువేరుగా స్తుతించ సాగిరి.

భూయోఽప్యక్షతరోషధామ్ని భవతి బ్రహ్మాజ్ఞయా బాలకే
ప్రహ్లాదే పదయోర్నమత్యపభయే కారుణ్యభారాకులః |
శాంతస్త్వం కరమస్య మూర్ధ్ని సమధాః స్తోత్రైరథోద్నాయత-
స్తస్యాకామధియోఽపి తేనిథ వరం లోకాయ చానుగ్రహమ్ || ౨౫-౯||

దేవతలందరూ విడివిడిగా నిన్ను స్తుతించినను నీ కోపము చల్లారలేదు. అప్పుడు బ్రహ్మ దేవుని ప్రేరణతో బాలుడైన ప్రహ్లాదుడు నిర్భయముగా నీ పాదములకు నమస్కరించెను. అంతట పరమ దయాళువైన నీవు శాంతించి ప్రహ్లాదుని శిరస్సుపై మంగళకరమైన నీ హస్తమును ఉంచితివి. అప్పుడా ప్రహ్లాదుడు నిన్ను అనేక విధముల స్తుతించెను. అతనికిఎట్టి కోరికలు లేకున్నను లోకములను అనుగ్రహించుటకై అతనికి వరములను ఇచ్చితివి. 

ఏవం నాటితరౌద్రచేష్టిత విభో శ్రీతాపనీయాభిధ-
శ్రుత్యంతస్ఫుటగీతసర్వమహిమన్నత్యంతశుద్ధాకృతే |
తత్తాదృఙ్నిఖిలోత్తరం పునరహో కస్త్వాం పరో లంఘయేత్
ప్రహ్లాదప్రియ హే మరుత్పురపతే సర్వామయాత్పాహి మామ్ || ౨౫-౧౦||


ప్రభూ! నీవు సహజముగా పరమ శాంతుడ వైనను ఈ విధముగా క్రోధమును ప్రదర్శించితివి. నీ గొప్పతనమంతా శ్రీతాపనీయోపనిషత్తునందు చక్కగా నిరూపించబడెను.   నీవు మిక్కిలి పరిశుద్ధమైన ఆకారము కలవాడవు. అందరికంటేను ఉన్నతమైన వాడవు. నిన్ను అధిగమించు వారు లేరు. ప్రహ్లాద ప్రియా! గురువాయురప్పా! దయతో నా సమస్త రోగములనునివారింపుము.