శివరాత్రి నాడు పూజించే శివలింగం


శివరాత్రి నాడు మనం పూజించే శివలింగంయొక్క తత్త్వం ఏ కొద్దిపాటి తెలుసుకుని అర్చించినా అమోఘమైన ఫలితాలు ఉంటాయి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన శివలింగ తత్త్వంలోని కొన్ని విశేషాలు.. ఈ మధ్యనే విడుదలైన `శివఙ్ఞానం అనే పుస్తకమునుండి..

సృష్టి స్థితి లయలను నిర్వహించే పరమేశ్వర చైతన్యాన్ని బహు విధాలుగా భావించి, అర్చించి అనుగ్రహ బలాన్ని పొందే విధానాలను వేదాది శాస్త్రాల ద్వారా మన సనాతన ధర్మం విస్తృతంగా సాధించింది. అందులో శివలింగారాధన ఒకటి.

`లింగ ' శబ్దానికి అద్భుత శాస్త్రార్థాలున్నాయి. స్థూలంగా ఆరాధనలో లింగం అనే మాటకు మూర్తి అని అర్థం చెప్పవచ్చు. మనం కంటితో చూడలేని భగవంతుని ఏదో ఒక బింబంగా గ్రహించి, శాస్త్ర పద్ధతుల ద్వారా ప్రతిష్ఠ, ఆవాహన వంటి ప్రక్రియలతో ఆరాధించడం సంప్రదాయం. అలా అరాధింపబడే బింబాన్ని లింగం అనడం శాస్త్రార్థం.

పాండురంగని విగ్రహాన్ని స్తుతిస్తూ `పరబ్రహ్మ లింగం భజే పాండురంగం" అని కీర్తించారు ఆది శంకరులు. విష్ణు విగ్రహాన్ని పరబ్రహ్మ లింగం అనడం గమనించాల్సిన విషయం. ఇలాగే సాలగ్రామ శిలని విష్ణు లింగంగా, నర్మద బాణశిల శివలింగంగా, శోణశిల గణేశలింగంగా, సువర్ణముఖీ నదిలో లభించే ధాతువు/శ్రీ చక్రం శక్తి లింగంగా భావించవచ్చు.

అయితే శివునికి ప్రత్యేకించి శివలింగం అని, ప్రతి ఆలయంలోనూ లింగారాధనగా..విగ్రహాలు కాకుండా.. పూజించడంలో ప్రత్యేకత ఏమిటి?

దీని గురించి శివ పురాణాదులలో, శైవాగమాలలో వివరణ ఉంది. వాటిని మాత్రమే గ్రహించాలి. కొన్ని శివేతర గ్రంథాలలో జొప్పించిన కల్పనలను గ్రహించి, హైందవ ద్వేషులు వాటిని ప్రచారం చేయడం శోచనీయం. అలాంటి అవాకులూ, చెవాకులు వల్ల విదేశీ కుతూహలశీలురు శివలింగం గురించి నీచాభిప్రాయాలని వెలిబుచ్చారు కూడా. కానీ ఆ రోజుల్లో స్వామీ వివేకానంద దానికి గట్టి సమాధానమిచ్చారు. యఙ్ఞంలో యూపస్తంభమే శివ లింగంగా భావించవచ్చు... అని చెప్పడం వారి సమాధానాలలో ఒకటి. మన శాస్త్రాల హృదయం ప్రకారం శివలింగ తత్త్వమేమిటో శోధిస్తే ఆశ్చర్యకరమైన మహా విఙ్ఞానాంశాలు గోచరిస్తున్నాయి.

లీనం చేసుకునేదే లింగం: చరాచర జగతి ఎవరియందు కలిగి, పెరిగి, తిరిగి లీనమవుతుందో అదే లింగం. ఆ లీనం వల్లనే సృష్టికి శక్తి, ఉనికి, మనుగడ లభిస్తున్నాయి.

ఆ ఈశ్వరుడు ఆకారాది రహితునిగా భావిస్తూ, ఒక సంకేతంగా గ్రహిస్తే.. ఆద్యంతరహితమైన జ్యోతి స్వరూపానికి ప్రతీకయే లింగం. అందుకే జ్యోతిర్లింగం అన్నారు.

మనలోని ఐదు ఙ్ఞానేంద్రియాలూ, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు, జీవుడు.. వెరసి పన్నెండు స్థానాలలో ఒకే ఈశ్వర చైతన్యం ఉన్నది. ఆ ఈశ్వర జ్యోతియే ఆ పన్నెండు చోట్ల ఉన్నదనే ఎరుకయే .. పన్నెండు జ్యోతిర్లింగాలను మనలో దర్శించడం. అప్పుడు మన అణువణువూ శివమయమనే భావన నిలచి `శివోహ ' మనే సత్యాన్ని స్థిర పరచుకోగలం.

యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.

ఒక దీపజ్యోతిని వెలిగించితే, అది అన్ని దిక్కుల కాంతిని ప్రసరిస్తున్న లింగాకృతిగానే దర్శనమిస్తుంది. అదే ఆకారాతీతమైన చైతన్య జ్యోతిర్లింగం

యోగపరంగా..దేహంలోని మూలాధారం నుండి, సహస్రారం వరకు ఉన్న సుషుమ్నా నాడిలోని శక్తి ప్రవాహం ఒక కాంతిమయ స్తంభంగా దర్శిస్తే అదే అగ్నిమయమైన శివలింగంగా గ్రహించగలం. ఇదే శ్రీ చక్రంలోని బిందు స్థానం. ఈ బిందువునే పైకి లాగినట్లు ఒక నిలువు గీత (స్తంభాకృతి)గా సాగుతుంది. అదే శివుడు ప్రథమంగా అగ్నిస్తంభాకృతి కలిగిన లింగంగా వ్యక్తమయ్యాడనే పురాణ కథలోని దర్శనం.

`లోకం లింగాత్మకం ఙ్ఞాత్వా అర్చయేత్ శివలింగకం' అని ఆగమం చెప్పింది. లోకమంతా లింగాత్మకమని తెలిసి శివలింగారాధన చేయాలి ' అని తాత్పర్యం. లింగ గర్భం జగత్సర్వం.. జగమంతా లింగంలోనే ఉంది. విచిత్రమేమిటంటే..కొద్ది ఏళ్ళ క్రితం విదేశాలకు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థలు ఈ సమస్త విశ్వానికి సంబంధించి ఉపగ్రహాల సహాయంతో గ్రహించిన విఙ్ఞానాన్ని అనుసరించి ఒక చిత్రాన్ని ఆవిష్కరించారు. అద్భుతం..అది మన వేద విఙ్ఞానం వర్ణించినట్లు ఒక గోళా(అండా)కృతిలో ఉన్న కాంతిపుంజ మధ్యంలో సమస్త గ్రహ నక్షత్రాదులన్నీ ఇమిడి ఉన్నాయి. ఈ దృశ్యాన్ని యుగాల క్రితం తపశ్శక్తితో గ్రహించి, లింగాకృతిని సంభావించి, విశ్వచైతన్య శక్తితో వ్యక్తి చైతన్యాన్ని అనుసంధానించే ప్రక్రియను లింగార్చనగా, లింగ ధ్యానంగా ఆవిష్కరించిన మన మహర్షుల పాదాలకు నమోవాకాలు.