గంగావతరణం - మొదటి భాగం

గంగేచ యమునెచైవ గోదావరి సరస్వతి.......అంటూ పూజ ప్రారంభంలో గంగా,యమున,గోదావరి,సరస్వతి,నర్మద,సింధు,కావేరి నదులను కలశంలోనికి ఆవాహన చేస్తాం.గంగకు చాలా పవిత్రమైనది. మహాభారతం అనుశాసనిక పర్వంలో ఒక మాట ఉంది. గంగా అంటే ఏమిటని అడగాలన్న, గంగావతరణం కధ వినాలన్నా, గంగావతరణం చెప్పాలన్నా, గంగను చూడాలన్నా, గంగాలో మునక వేయాలన్నా, గంగను త్రాగాలన్నా ఈ 6 పనులు చేయాలన్నా, శివానుగ్రహం ఉంటే తప్ప అది జరుగదు. ఎందుకంటే గంగావతరణం తెలుసుకున్నంత మాత్రం చేతనే కొన్ని వందల జన్మల సంచిత పాపం భస్మం అయిపోతుంది. అంత పరమ పవిత్రమైనది గంగ. సాంబశివుడి అనుగ్రహంతో ఈ పవిత్ర కుంభమేళ సమయంలో గంగ గురించి, గంగా ఎలా అవతరించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

శ్రీ రామాయణంలో బాలకాండలో శ్రీ రాముడు తాటక సంహారం చేశాక విశ్వమిత్రుడు, రామలక్ష్మణులు శొణా నది తీరం వెంబడి వెళ్తుండగా రాముడు గంగా ఎలా అవతరించిందో చెప్పమని మహర్షిని వేడుకున్నాడు. రాముడికి విశ్వమిత్ర మహర్షి గంగ ఎలా అవతరించిందో సంక్షిప్తంగా చెప్పినా, రాముడు సంతృప్తి చెందక మళ్ళీమళ్ళీ అడిగాడు. తనకు గంగావతరణ ఘట్టం సవివరంగా చెప్పమని ప్రార్ధించాడు శ్రీ రామచంద్రుడు. గంగా ఎలా అవతరించింది, గంగకు "త్రిపధగ" అనే పేరు ఎలా వచ్చిందో చెప్పమని విశ్వామిత్రుడి పాదాలు పట్టుకుని వేడుకోగా, రాముడి ఆతృతకు, తెలుసుకోవాలన్నా తపనకు చలించిపోయిన విశ్వామిత్ర మహర్షి గంగావతరణం గురించి చెప్పారు.

విశ్వమిత్ర మహర్షి దానిని రెండు భాగాలుగా రామాయణంలోని రెండు ప్రక్కప్రక్క సర్గలలో చెప్పారు. మొదటి భాగంలో స్కందోద్పత్తి(సుబ్రహ్మణ్య స్వామి జననం)లో కొంచం చెప్పారు. 

హిమవంతుడు(హిమాలయ పర్వతరాజు)కు మేరువు అనే పర్వతం యొక్క కూమార్తే అయిన 'మనోరమ ' భార్య. వారికి ఇద్దరు కూతుర్లు. పెద్ద కూమార్తె గంగా, రెండవ కూమార్తె ఉమ(పార్వతి). ఉమ పరమశివుడి గురించి ఘోరమైన తపస్సుచేసి ఆయన్ను వివాహం చేసుకుంది. దేవతకార్యముల కొరకు మాకు మీ పెద్ద కూతురు గంగా కావాలి అని దేవతలు అడుగగా, హిమవంతుడు అంగీకరించి పెద్ద కూమార్తె గంగను దేవతలతో దేవలోకానికి పంపించాడు. దేవతలే గంగను దేవలోకానికి తీసుకుని వేళ్ళారు. అందువల్ల దేవలోకంలో ప్రవహిస్తూండేది గంగ. ఆ సమయానికి భూమి మీద కాని, రసాతలంలో కాని గంగా ప్రవహించేది కాదు. అటువంటి సమయంలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది.

 ఆ సమయంలో ఆయోధ్య నగరాన్ని సగరుడనే ఒక మహారాజు పరిపాలిస్తూండేవాడు.ఆయన పేరు సగరుడు అంటే విషాన్ని తన శరీరంలో కలిగి ఉన్న వాడని అర్ధం. ఆయన తండ్రి అసితుడు. ఆయనకు ఇద్దరు భార్యలు. ఆయన తన భార్యలతో కలిసి హిమాలయ పర్వతాలలో భృగు ప్రశ్రమణము అనే పర్వతం వద్ద తపస్సు చేయడానికి వెళ్ళిన సమయంలో ఆయన భార్యలిద్దరూ గర్భవతులయ్యారు. రెండవ భార్యకు పిల్లలు కలుగకూడదనే ఆలోచనతో మొదటి భార్య విషాన్ని పెట్టింది. ఆ విషయం తెలుసుకున్న రెండవ భార్య భృగుమహర్షి వద్దకు వెళ్ళి తన కడుపులో పెరుగుతున్న పిండాన్ని కాపాడమని వేడుకుంది. భృగుమహర్షి మహ తపశ్శక్తి సంపన్నుడు, త్రికాలవేది కనుక ఆయన జరిగినది మొత్తం తన యోగ దృష్టితో గ్రహించాడు. పుట్టేవాడు గొప్పవాడవుతాడని ఆశీర్వదించి, తన శరీరంలో విషం కలిగి పుడతాడు కనుక సగరుడవుతాడని చెప్పాడు.   

అటువంటి సగరుడికి ఇద్దరు భార్యలు. మొడటి భార్య పేరు కేశిని. ఆమె ధర్మం తెలిసినది, ధర్మాన్నే ఆచరించేటువంటి లక్షణం కలిగినది, పతివ్రత, మహాసాద్వి. రెండవ భార్య పేరు సుమతి. మంచి సౌందర్య రాశి.ఈమె గరుత్మంతుడి చెల్లెలు. మొదటి భార్యది అంతః సౌందర్యం, రెండవ భార్యది బాహ్య సౌందర్యం.

ఇద్దరు భార్యలు ఉన్నప్పటికి సగర చక్రవర్తికి సంతానం కలుగలేదు. కొంతకాలం పాటు సగర చక్రవత్రి, ఆయన భార్యలు సంతోషంతో కాలం గడిపినా, కాలక్రమంలో వారికి సంతానం లేదన్న భాధ మొదలైంది. వంశం నిలబదన్న దుఖం కలిగింది. ఆ కాలంలో ఏదినా సమస్య వస్తే వెంటనే పెద్దలైనవారు, ఋషులు, గురువుల వద్దకు వెళ్ళేవారు. అందువల్ల సగర చక్రవర్తి బృగు ప్రశ్రమణానికి వెళ్ళి నూరు సంవత్సరముల పాటు కఠోరమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు ప్రీతి చెందిన భృగుమహర్షి సగర చక్రవర్తి వద్దకు వచ్చి, నీవు గొప్ప కీర్తిమంతుడవు అవుతావు, నీ ఇద్దరు భార్యలలో ఒకరికి వంశకరుడు ( వంశాన్ని నిలబెట్టేవాడు/వంశ వృద్ధిని చేసేవాడు ) అయిన కూమారుడు జన్మిస్తాడు. మరొక భార్యకు మహా ఉత్సాహవంతులైన 60,000 మంది కూమారులు జన్మిస్తారు అని ఆశీర్వదించాడు భృగు మహర్షి.

ఎవరికి వంశకరుడు జన్మిస్తాడు, ఎవరికి 60,000 మంది కూమారులి జన్మిస్తారో చెప్పలేదు.రాణూలిద్దరికి కుతూహలం పెరిపోయింది. అది తట్టుకోలేక, ఎవరికి వంశకరుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది జన్మిస్తారో తెలుసుకోవడానికి భృగు మహర్షి వద్దకు వెళ్ళారు.

భృగు మహర్షి వద్దకు వెళ్ళి ఎవరికి వశోద్ధారకుడు జన్మిస్తాడో, ఎవరికి 60,000 మంది మహోత్సాహవంతులు జన్మిస్తారో అడుగగా, వారికి ఎవరు జన్మించాలో వారినే కోరుకోమన్నారు భృగువు. 

కేశిని ధర్మం తెలిసినది. కన్నవారిని వదులుకుని, ఇంటి పేరును మార్చుకుని, భర్త వెంట నడిచి స్త్రీ ఎందుకు వస్తుంది అంటే భర్త వంశాన్ని నిలబెట్టాడానికే, తాను సంతానాన్ని కని, తన భర్త వంశాన్ని కొనసాగేలా చేయాడానికే అని ధర్మం చెప్తోంది. అంతేకాదు ఒక తండ్రి అదృష్టవంతుడని ఎప్పుడు అనిపించుకుంటాడంటే, తనకు మంచి సంతానం కలిగి, వారికి సంతానం కలిగి, ఆ సంతానానికి సంతానం కలిగి, వారందరిని తన కళ్ళతో చూసినప్పుడే. ధర్మం తెలిసినది కనుక తనకు వంశకరుడు జన్మించాలని కోరుకుంది.

సుమతి తనకు 60,000 మంది మహోత్సాహవంతులు కలగాలని కోరుకుంది. ఎంత మంది పుడితే ఏం లాభం. ఒక్కడు పుట్టినా వాడు వంశం పేరు నిలబెట్టేవారు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలి.

మహాతపశ్శాలి, సత్యమే మాట్లాడేవాడు, వేదం అర్ధం సహితంగా తెలిసినవాడూ, వేదాన్ని నిరంతరం పఠించేవాడైన భృగుమహర్షి మాటలు నిజమైనాయి.కొంతకాలనికి వారు గర్భం ధరించారు, ప్రసవించారు. కేశినికి వంశకరుడైన కూమారుడు జన్మించాడు, అతనికి అసమంజసుడు అని నామకరణం చేశారు. సుమతికి ఒక మాంసపిండం నుండి 60,000 వేల మంది చిన్న చిన్న పిల్లలు పుట్టారు. వారు మరి చిన్నగా ఉండడం చేత నేతిభాండములలో పెట్టి వారిని పెంచారు. ఈనాడు మన చెబుతున్న test tube babies, ఇటువంటి గొప్ప శాస్త్రపరిజ్ఞానం త్రేతాయుగంలో, దాదాపు 12 లక్షల సంవత్సరముల క్రితమే మన హిందువులకు ఉంది. వారిని దాదులు(ఆయలు) పెంచి పెద్ద చేశారు.

అసమంజసుడు, 60,000 మంది పిల్లలు పెరిగి పెద్దవారువుతున్నారు. 60,000 మంది బాగా ఉత్సాహవంతులయ్యారు. ప్రతి పనికి అత్యుత్సాహం చూపించేవారు. ఈ అసమంజసుడికి ఒక దురలవాటు ఉంది. రాజ్యంలో ఉన్న పిల్లలందరిని ఆడుకుందామన్న నెపంతో సరయు నది ఒడ్డుకు తీసుకువెళ్ళి, వారిని నదిలో ముంచి, వారి మీద నిలబడి తొక్కి, ఊపిరి ఆడకుండా చేసి, వారిని చంపి ఆనందించేవాడు. ప్రజలు చాలా కాలం పాటు సహనంతో ఉన్నా, కొంతకాలానికి వారికి సహనం నశించి, వెళ్ళి రాజైన సగరుడికి విన్నవించుకున్నారు. 
                                                                         ఇంకా ఉంది ....