‘బ్రాహ్మణుడు’ అంటే ఎవరు?


బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణఃఅని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు.

|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
       నిజముశూద్రుకంటె నీచతముడు
       సత్య శౌచధర్మశాలి శూద్రుండయ్యు
       నతడు సద్ద్విజుండ యనిరి మునులు – ‘శ్రీమహాభారతం

సీ|| ఎవ్వడు సత్యంబు నెప్పుడు బల్కు, హింసావిదూరుడు గురుజనహితార్థి
       యింద్రియంబులనోర్చి ఎల్లవారల దనయట్ల జూచు ధర్మాభిరతుడు
       కామంబు తగులండు కర్మంబులారును, సముచిత సంప్రయోజతనొనర్చు
       అట్టి పుణ్యాత్ముని అనఘబ్రాహ్మణుడని యనిశంబు గీర్తింతురమరవర్యు

|| లార్జవంబు శమము నధ్యయవంబును
       పరమధనముసువ్వె బ్రాహ్మణునకు
       ధర్మగతికి ననియు తగు సాధనంబులు
       వేదవిహితముఖ్యవిధులు నెనయె శ్రీమహాభారతం అరణ్యపర్వం

శ్లో|| జన్మవా బ్రాహ్మణోజ్ఞేయః, సంస్కారైః ద్విజ ఉచ్యతే!
       విద్వత్వాచ్చాపి విప్రత్వం త్రిభిశ్శోత్రియ ఉచ్యతే|| – ‘ధర్మశాస్త్రం

చాతుర్వర్ణం మయాసృష్టం గుణభేద విభాగశః” – భగవద్గీత

శూద్రునకు జన్మించినవారు శూద్రుడు కాగలడుగాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. వేదమూ, పురాణాలు, శ్రుతులు, స్మృతులు కూడా ఇదేమాట చెబుతున్నాయి. బ్రాహ్మణుని ద్విజుడుఅని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సారులు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగింది. రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది.

బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు. బ్రాహ్మణుడుగా జీవించటం గొప్ప! సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మమూ ఈవిషయాన్ని నొక్కిచెప్పాయి.

సమస్త బ్రాహ్మణకులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి చెప్పిన శ్రీ విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి శ్రీరాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య కూర్మ వరాహ నారసింహాది అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు.

వేదాలలో ఎక్కడా కులప్రసక్తి లేదు. జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం.

బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూచుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకొనకూడదు. బహుభార్యాత్వాన్ని కలిగి వుండరాదు. సుఖాభిలాష వుండకూడదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం సేవించకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశప్రయాణం చేయకూడదు. ఇతర ఆహారపదార్ధాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్ధం చెప్పకూడదు. ధనాన్ని, సుఖాలనూ అభిలషించకూడదు. స్త్రీలవంక నిశితంగా చూడకూడదు. ఆహారాలనూ, వస్తువులనూ, కాఫీ వంటి విదేశ పానీయాలను ముట్టకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించకూడదు. ప్రాణులను కర్రతోగాని, రాయితోగాని కొట్టకూడదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం (పిలక) లేకుండా వుండకూడదు. సినిమా నాటకాలు మున్నగునవి చూడకూడదు. ఏకపత్నీవ్రతాన్ని తప్పక పాటించాలి. సర్వజన శాంతి సుఖాల కోసం దేవుని ప్రార్థించాలి. దైవ ప్రార్ధనలో తన స్వార్ధం విడచి జనహితాన్ని కోరుకోవాలి. జనహితంకోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస్సు, మాట, శరీరం, పని లోకహితార్ధమై వుండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించి నమస్కరించాలి.

ధార్మిక లక్షణాలున్నవారెవరైనా బ్రాహ్మణులే! 
బ్రాహ్మణ్యంకులసంకేతపదం కాదు. గుణసంకేత పదం.

బ్రాహ్మణాయ నమోనమః

బ్రహ్మజ్ఞానాయ నమోనమః