అక్షయ తృతీయ

ఈ నాటి అక్షయ తృతీయ అందరికీ అక్షయమగు శుభఫలములిచ్చుగాక, లోకము శాంతి సౌభాగ్యములతో ఉండుగాక అని భగవంతుని ప్రార్థిస్తూ, ఈ తిథిని గూర్చి కొన్ని విషయములు పురాణోక్తమైనవి ఇక్కడ పొందు పరుస్తున్నాను. అక్షయ తృతీయ అంటేనే నేటికాలంలో బంగారం వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం అనేది ప్రచారంలో ఉంది. ఈ రోజు కొన్నది అక్షయం అవుతుందని చెప్పిన వ్యాపార ప్రచారాన్ని వాస్తవంగా నమ్మి వాటిని కొనుగోలు చేయడం ఆనవాయితీగా మారింది. అసలు అటువంటివి కొనాలని డబ్బులేకున్నా అప్పు చేసో తప్పు చేసో కొంటే, కొన్న బంగారం అక్షయం అవ్వడం అటుంచి చేసిన అప్పులు తప్పులు తత్సంబంధ పాపాలు అక్షయం అయ్యి కూర్చుంటాయి.  

మత్స్య పురాణం అరవై ఐదవ అధ్యాయం ప్రకారం.. 
ఈశ్వరుడు పార్వతీదేవికి సర్వకామ ప్రదమైన అక్షయ తృతీయ వ్రతం గూర్చి చెప్పారు. వైశాఖ శుద్ధ తదియ నాడు చేసే ఏ వ్రతమైనా, జపమైనా, హోమందానాదులేవైనా లేక పుణ్య కార్యాచరణమేదైనా దాని ఫలితము అక్షయమౌతుంది. (పుణ్య కార్యాచరణం వల్ల వచ్చే ఫలితం అక్షయమైనప్పుడు పాపకార్యాచరణం వల్ల వచ్చే పాపం కూడా అక్షయమే అవుతుందిగా... ). ఈ నాడు, తృతీయా తిథి బ్రహ్మగారితో కలిసి ఉంటుంది. అందుచే విశేష పూజనీయమైనది. ఈ నాటి ఉపవాస దీక్ష జరిపి ఏ పుణ్య కర్మమాచరించినా కూడా తత్సంబంధఫలము అక్షయముగానే లభిస్తుంది. ఈ తిథినాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. అందుకే దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ రోజు అక్షతోదకముతో స్నానం చేసి, అక్షతలను విష్ణు భగవానుని పాదములపై ఉంచి అర్చించి, తరవాత ఆ బియ్యమును చక్కగా మరోసారి ఏరి బ్రాహ్మణులకు దానమిచ్చి, మిగిలిన వాటిని
దైవోచ్ఛిష్ఠంగా, బ్రాహ్మణోఛ్ఛిష్ఠంగా తలచి వాటిని ప్రసాద బుద్ధితో స్వీకరించి భోజనం చేసిన వారికి ఈ ఫలం తప్పక కలుగుతుంది అని పురాణంలో ఈశ్వర వాక్కు.

ఇలా ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు పైన చెప్పిన విధంగా నియమంతో అక్షయ తృతీయా వ్రతాన్ని ఆచరించిన తరవాత వచ్చే 12 మాసాలలో శుక్ల తృతీయ నాడు ఉపవసించి విష్ణువును ప్రీతితో అర్చిస్తే రాజసూయ యాగము చేసిన ఫలితము కలిగి అంత్యమున ముక్తిని పొందగలడు. (అక్షతలు అంటే ఏ మాత్రము విరగని, పగుళ్ళు లేనిగట్టిగా ఉన్న బియ్యము, అవి వరి ధాన్యము నుండి కావచ్చు, గోధుమ ధాన్యమునుండి కావచ్చు, యవల నుండి కావచ్చు. ఇటువంటి వాటితో సిద్ధం చేసిన ఆహారముని అక్షతాన్నము లేదా అక్షతాహారము అంటారు). 

శ్రీ నారద పురాణం కూడా, ఈ నాడు చేయు దాన ధర్మాలు అత్యధిక ఫలాన్నిస్తాయని చెప్తోంది. ఈ నాడు దానం ధర్మం చేయటమే అక్షయ ఫలితాన్ని ఇస్తుంటే, ఇక గంగా తీరంలో ఈ నాడు దానాది ఫలములు నారదమహర్షి ఇలా చెప్పారు. అక్షయ తృతీయ నాడు గంగా తీరంలో నియమంతో ఘ్రుత ధేను దానం చేసినవాని ఫలితం ఇంతింత కాదుసహస్రాదిత్య సంకాశుడై సర్వకామ సమన్వితుడై బంగారము, రత్నములతో కూడి చిత్ర
హంసలతోకూడిన విమానములో తన పితృదేవతలతో కల్పకోటి కల్పములు, కల్పకోటి సహస్రముల కాలము బ్రహ్మ లోకమున విరాజిల్లును. తరవాత గంగా తీరంలో అత్యంత ధనవంతుడైన బ్రాహ్మణునిగా పుడతాడు. అంతమున బ్రహ్మ జ్ఙానియై ముక్తిని పొందుతాడు. అలాగే యధావిధిగా గోదానము చేసినవాడు గోలోమ సంఖ్యలు ఎన్ని ఉన్నాయో అన్ని సంవత్సరములు స్వర్గలోకములో విరాజిల్ల తరవాత భూమిమీద పుట్టి చక్కని విద్యను ఐశ్వర్యాన్ని అనుభవించి అంతమున ముక్తిని పొందుతాడు. గంగా నది ఒడ్డున వేదవిదుడైన బ్రాహ్మణునకు కపిల గోదానము చేసినచో నరకములోనున్న తన పితరులందరూ స్వర్గాన్ని చేరెదరు. అక్కడే భూమిని దానం చేస్తే, ఎంత భూమిని దానం చేసాడో అంతభూమిలోని రేణువుల ప్రమాణాబ్ది వరకు బ్రహ్మ విష్ణు 
శివలోకములలో నివసించి భూమిమీద పుట్టి సప్త ద్వీపాదిపతి అగును. అతడు నిద్రించినచో భేరీ శంఖాది నినాదములచే మేల్కొలపబడును. సర్వ ధర్మ పరాయణుడై సర్వ సౌఖ్యములను పొంది నరకవాసంలో ఉన్న పితరులనందరినీ స్వర్గమున చేర్చిస్వర్కమున నున్న పితరులనందరినీ మోక్షమున చేర్చి స్వయముగా జ్ఙానియై అవిద్యను జ్ఙాన ఖడ్గముచే ఖండించగల పరమ వైరాగ్యముని పొంది పరబ్రహ్మమును పొందెదడు. ఇటువంటి పుణ్య ఫలములెన్నో చెప్పబడినవి. ఈ తిథినాడు పదహారు మాస మితమగు (పదహారు మినప గుండ్ల ఎత్తు) స్వర్ణమును విప్రునకు దానమిచ్చిన, వాని ఫలము అక్షయము వాడు అన్ని లోకములందు పూజ్యుడై విరాజమానుడగును. 

ఈ అక్షయ తృతీయనాడు మనం ముఖ్యంగా చెయ్యవలసింది ఉదక భాండ దానం చెయ్యాలి.అంటే ఒక కుండలో నీరు నింపి,వాటిపై సుగంధ ద్రవ్యాలు కలగలిపి,ఒక సద్బ్రాహ్మణుడికి దానం చెయ్యాలిట.అలాగే ఈ రోజు విష్ణువునకు చందనం విశేషంగా సమర్పిస్తే విష్ణు సాలోక్యం కలుగుతుంది.అందుకే ఈ రోజున సింహాచల నృసింహ స్వామికి చందనోత్సవం మరియు కలశాభిషేకం జరుగుతుంది.అదే విషయాన్ని శాస్త్రం ఇలా సమర్ధిస్తోంది.
                          యహ:కరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం,
                            వైశాఖస్య సితే పక్షే,సయాత్యాచ్యుతమందిరం.
     అనగా వైశాఖ శుక్ల తృతీయ యందు శ్రీ కృష్ణ మూర్తికి చందనాను లేపన మిచ్చిన నరునకు విష్ణులోక సాయుజ్యం కలుగుతుంది.ఈ రోజున చేసే జప,దాన ,హోమ,తర్పణలు ఏ కొంచెమైన అక్షయ మగును.నిజానికి ఇది కృత యుగాది.ఈ రోజున చేసే గంగా స్నానం కూడా విశేష ఫలాన్ని అందజేస్తుందట.అంతే కాదు యవలతో హోమము,యవాశనము, చేసినట్లైన, చేసిన సర్వ పాపాలు కూడా నశిస్తాయిట!

       అలాగే ఈ రోజు దేవతలను,పితృ దేవతలనుద్దేసించి ఉదకుంభ దానం విధింపబడిది."శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం ఉదకుంభ దానోక్త ఫలావాప్యర్ధం,బ్రాహ్మణాయ ఉదకుంభ దానం కరిష్యే" తదంగ కలశ పూజానాదికం కరిష్యే!"అని సంకల్పించి గంధ ఫల యవాదులతో, కూడిన సూత్రం చుట్టిన కలశాన్ని,బ్రాహ్మణుని పంచోపచారములచే పూజించి,
                    ఏషద్బ్రహ్మ ఘటో దత్తో,బ్రహ్మ విష్ణు శివాత్మక:
                    అస్య ప్రదానాత్సకలా ,మమ సంతు మనోరధా:"
అని దానం చెయ్యాలి.అదే పితృ దేవతల తృప్తికైతే,"పితౄణాం అక్షయ త్రుప్త్యర్ధం ఉదకుంభ దానం కరిష్యే!"అని సంకల్పించి,దానం చెయ్యాలి. కనీసం చలివేంద్ర ద్వారా నీటిని దానం చెయ్యడం కూడా మహా పుణ్యమే గదా!అలాంటి పుణ్య తిధినాడు విశేష కార్యక్రమాలు నిర్వహించి అక్షయ పుణ్య ఫలాలను పొందాలని,ఈ అక్షయ తృతీయ నాడు మనసారా కోరుకుంటూ,మరొక ముఖ్య విషయం!బంగారం కొనవద్దని నా అభిప్రాయంకాదు సుమండీ!కేవలం అతి తక్కువ ఖర్చులోనే విశేష పుణ్యం దొరుకుతూ ఉంటే,విశేష ధనాన్ని వెచ్చించి చేసే పుణ్యం గొప్పదంటారా!ఆలోచించండి.ఎవరి శక్తి వారిది.నోచుకున్న వారికి నోచుకున్నంత ఫలం కదా!

అక్షయ తృతీయ తెల్లవారుజామున గోమాతను పూజ చేయడం విశేషం. గోమాతకు గోధుమలు, పొట్టు, బెల్లం, అరటిపండు కలిపిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.