మట్టి వినాయకుడు-అసలు రహస్యం


వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. అలా చేయాలనే ఈ పనిని పెద్దలు పురమాయించారని చెబుతుంటారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు చెరువులు, వాగులు, కుంటలు నిండిపోతాయి. మరీ ఎక్కువగా వానలు పడితే పక్కనే ఊర్లు కూడా మునిగిపోతాయనే ఆలోచన చేసేవాళ్లు. అందుకే అలా జరుగకుండా ఉండాలంటే చెరువులు, కుంటల్లో పూడికలు తీయాలి. నీరు నిల్వ ఉండాలే కానీ అవి ఊర్ల మీద పడకూడదని భావించేవారు. వానల వల్ల మట్టి కొట్టుకెళ్లి చెరువుల్లో చేరిపోతుంటుంది. కాబట్టి ముందుగా పూడిక తీయాల్సిందే. ఆ పని పూర్వం రోజుల్లో గ్రామస్తులే చేసేవారు. అలా చేసేందుకు ఉత్సాహంగా ఆ పని పూర్తి చేసేందుకు మత పెద్దలు వినాయక ప్రతిమలను మట్టితోనే చేయాలన్న నిబంధన పెట్టారు. 

వినాయక చతుర్థి నాడు గరికతో పూజ చేస్తే సర్వ శుభములు చేకూరుతాయి. వినాయకునికి గరికపోచలంటే చాలా ఇష్టం. ఎన్నిరకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేని పూజ విఘ్నేశ్వరుని లోటుగానే ఉంటుంది. గరికెలు లేని వినాయక పూజ వ్యర్థమని, ప్రయోజన రహితం.

"చతుర్ధీ పూజన ప్రీత:" అంటే వినాయకుని చతుర్ధి పూజంటే ప్రీతి. ఈ తిథినాడు విఘ్నేశ్వరుడు ఉద్భవించినాడు. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయక చవితిగా మనం గణపతిని పూజిస్తాం. అయితే ప్రతి మాసంలో వచ్చే చవితీ గణపతికి ప్రీతికరమే. భాద్రపద శుక్ల చవితి రోజున పార్వతీ-పరమేశ్వరులకు కుమారునిగా వినాయకుడు అవతరించినాడు.

కానీ అంతకుముందే గణపతి ఉన్నాడు. ఆయన ఉపాసన కూడా ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి ఆది నిర్వహణకు కలిగే విఘ్నాలు చూసి భయపడి, పరబ్రహ్మను ప్రార్థించాడు. ప్రణవ స్వరూపుడైన ఆ పరమాత్మ విఘ్నాల్ని నశింపజేయడానికి గజవదన రూపంలో సాక్షాత్కరించి తన వక్రతుండ మంత్రాన్ని బ్రహ్మకు ఉపదేశించి, విఘ్నాల్ని హరింపజేస్తాడు. ఇది తొలి ఆవిర్భావమని పండితులు అంటున్నారు.

కాగా.. భయరోగాది కష్టాలు, సర్వ దారిద్ర్యాలు తొలగించే విఘ్నేశ్వరునికి ప్రీతికరమైనది చతుర్థీ వ్రతం. ముఖ్యంగా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి ముఖ్యమైనది. ప్రతినెలా ఆ చతుర్ధికి గణపతిని ఉద్దేశించి ఉపవాసమో లేక ఉండ్రాళ్ళు, మోదకాలు వంటివి నివేదిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి.


కృష్ణ చతుర్థినాడు దూర్వాలు, బిల్వాలతో, పువ్వులతో గణపతిని అర్చించి, 21 ఉండ్రాళ్లు నివేదన చేస్తే గ్రహదోషాలు, గృహదోషాలు తొలగిపోతాయంటారు. కృష్ణ చతుర్థి వ్రతానికి చంద్రోదయంతో చవితి తిథి ఉండాలి. ఆ రోజున ఉపవాసం చేసి పూజ తర్వాత 21సార్లు "ఓం శ్రీ గణేశాయ నమ:" అని జపించాలని పురాణాలు చెబుతున్నాయి.