జంధ్యాల పూర్ణిమ/శ్రావణ పౌర్ణమి

SRAVANA POORNIMA

 శ్రావణ పూర్ణిమ భారతావని మొత్తం శ్రావణ మాసంలో ఎంతో పవిత్రంగా భావించే రోజు. ఏడాదికి వచ్చే ద్వాదశ పూర్ణిమల్లోనూ శ్రావణ పూర్ణిమకు చాలా విశిష్టత వుంది. సాధారణంగా జంధ్యాన్ని ధరించే వారందరూ శ్రావణ పూర్ణిమనాడు పాత జంధ్యాన్ని వదిలి కొత్త జంధ్యాన్ని ధరిస్తారు. దీనినే 'ఉపాకర్మ' అని కూడా అంటారు. అందుకే ఈ పౌర్ణమిని జంధ్యాల పూర్ణిమ అనీ, జంధ్యాల పండుగగా జరుపుకోవడం ఆచారం. జంధ్యాన్నే 'యజ్ఞోపవీతం' అని అంటారు. అంటే యాగ కర్మ చేత పునీతమైన దారం అని అర్థం. పాల్కురికి సోమన ఈ పూర్ణిమని 'నూలి పున్నమి' అన్నాడు. నూలుతో తయారు చేసిన జంధ్యాలు ధరించడమే దీనికి కారణం. ఉపాకర్మ వేదాధ్యయనానికి ప్రతీక. వేదాధ్యయనం చేసేందుకు ముందు ఉపనయనం చేసి జంధ్యాన్ని వేయడం ఆచారం. యజ్ఞోపవీతధారణ ఉన్న వారిని ''ద్విజులు'' అని పిలుస్తారు. ద్విజులు అనగా రెండు జన్మలు కలవారు. తల్లి కడుపు నుంచి జన్మించడం మొదటిది కాగా, ఉపనయనం చేసిన అనంతరం 'జ్ఞానాధ్యయనం' గురువు నుంచి నేర్చుకోవడం రెండో జననంగా చెప్పబడు తుంది. ఉపనయనం చేసిన సందర్భంలో యజ్ఞోపవీతానికి జింక చర్మం కడతారు. దీనిని ఈ ఉపాకర్మ కార్యక్రమంలో శ్రావణ పౌర్ణమి నాడు తీసి వేస్తారు.
ఉపనయనం అయిన వారు ఈ రోజు గాయత్రీ పూజ చేసి కొత్త యజ్ఞోపవీతాన్ని ధరించి పాతదానిని విసర్జించాలి. పరిపక్వతకు, పరిశుద్ధతకు యజ్ఞోపవీతమే దివ్యౌషధం. ఈ'జంధ్యాల పూర్ణిమ' కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వారికే పరిమితమైనప్పటికీ మిగతా వారు కూడా ఈ రోజు అష్టోత్తరాలతో గాయత్రీ దేవిని పూజిస్తే సకల శుభాలు తథ్యం. పవిత్రతకు, దైవత్వానికి సంకేతం యజ్ఞోపవీతం. యజ్ఞోపవీత ధారణ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుగా కొత్త జంధ్యాన్ని తీసుకుని, వేసుకునే ముందు

''యజ్ఞోపవీతం, పరమం పవిత్రం
ప్రజా పతే: యత్‌ సహజం పురస్తాత్‌
ఆయుష్య మర్య్రం, ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:''

అనే శ్లోకాన్ని పఠించి ధరించవలెను. నూతన యజ్ఞోప వీతాన్ని ధరించిన అనంతరం పాత (జీర్ణ) యజ్ఞోపవీతాన్ని ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తూ విసర్జించవలెను.

యజ్ఞోపవీతం, యది జీర్ణవంతం
వేదాంతవేద్యం, పరబ్రహ్మమూర్తిం
ఆయుష్య మాగ్య్రం, ప్రతి ముంచ శుభ్రం
జీర్ణోపవీతం విసృజామి తేజ:||

ఆ తర్వాత యథాశక్తి గాయత్రి మంత్రాన్ని జపించవలెను. మనం వేసుకునే జంధ్యం 96 బెత్తా లుండాలి. మూడు పోగులుండాలి. వివాహం కాని వారికి మూడు పోగుల జంధ్యాన్ని ధరింప చేస్తారు. ఒంటి ముడి వుండాలి. ఈ మూడు పోగులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నంగా చెప్తారు. వివాహమైన వారు మూడు ముడులున్న అంటే తొమ్మిది పోగులున్న యజ్ఞోపవీతాన్ని ధరించాలి.
యజ్ఞోపవీతానికి ఉన్న ముడిని 'బ్రహ్మముడి' అంటారు. ఎందుకనగా ఈ యజ్ఞోపవీతాన్ని బ్రహ్మ దేవుడు తయారు చేయగా లోక సంరక్షకుడైన శ్రీమన్నారాయణుడు ముప్పిరి పెట్టగా, లయ కారకుడు ముడివేయ గా, సకల వేద వేదాంగ జ్ఞానానికి సంకేత రూపమైన సావిత్రీదేవి అభిమంత్రించారు. మనం ధరించే జంధ్యం నాభివరకే ఉండాలి. నాభి క్రిందకు ఉంటే కీర్తి క్షీణిస్తుంది. నాభిపైకి ఉంటే ఆయుష్షు నశిస్తుంది.

జంధ్యం ఆవగింజంత లావు మాత్రమే ఉండాలి. అంతకంటే ఎక్కువ లావు ఉంటే కీర్తి నశిస్తుంది. మరీ పలుచగా వుంటే ధనహాని కల్గుతుంది. నవ తంతువుల్లో ఓంకారం, నాగదేవతలు, సోముడు, పితరులు, ప్రజాపతి, వాయువు, సూర్యుడు ఇతర దేవతలు, ఉత్తమ దేవగణాలు కొలువై ఉంటారు. పురుషులకే కేటాయించబడిన ఈ పూజను పాటించే ఇంట సకల సిరిసంపదలు, ధన ధాన్యాదులు రెట్టింపవు తాయి. బ్రాహ్మణులు, పండితులకు జంధ్యాలు (యజ్ఞోప వీతం) ఇవ్వడం మంచిది. గాయత్రీ మాత ఉపాసన, హోమం విశేష ఫలితాన్నిస్తాయి. అందుకే 12 సం||లోపు పిల్లలకు ఉపనయనం చేసి వేదాధ్యయనం చేయిద్దాం. ఈ రోజు పాత జంధ్యాన్ని విసర్జించి గాయత్రీ మంత్రాన్ని జపిద్దాం. మన సంస్కృతిని కాపాడుకుందాం.