వాల్మీకి రామాయణం / కంబ రామాయణం

ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే కథలు…… అలాంటి కథలలో ఒక కథ వినండి.
ఒకరోజు రాముడు సింహాసనం అధిష్టించి ఉండగా, పొరపాటున అతడి ఉంగరం జారి కింద పడిపోయింది. ఈ ఉంగరం భూమిమీద పడడంతోనే, అది ఒక సన్నటి చిల్లు చేసి భూమి లోపలికి తొలుచుకుంటూ చొచ్చుకునిపోయి కనుమరుగైపోయింది. అది చూసి రాముడు తన నమ్మిన బంటు అయిన హనుమంతుడుతో హనుమా, నా ఉంగరం పడిపోయింది. వెతికి తీసుకురా,” అని పురమాయించాడు.
హనుమంతుడు ఎంత చిన్న చిల్లులోకైనా ప్రవేశించగలడు. అవసరమయితే నలుసంత చిన్నగా మారగలడు. లేదా, మేరు పర్వతమంత పెద్దగా ఎదగగలడు. రాముని ఆజ్ఞ విని, హనుమంతుడు వెంటనే నలుసంత చిన్నగా మారిపోయి ఆ చిన్న రంధ్రంలో నుంచి తనూ దూసుకుపోయాడు. పోయిపోయి తిన్నగా పాతాళలోకంలో పడ్డాడు. ఈ చిన్ని కోతిని చూసి ఆశ్చర్యపోయిన అక్కడి యువతులు, అతడ్ని వారి పాతాళరాజుకు పళ్ళెంలో ఆహారంగా సమర్పించారు.
ఇది ఇలా ఉండగా, అక్కడ భూలోకంలో సింహాసనం మీద కూర్చున్న రాముని వద్దకు వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు వచ్చారు. వచ్చి రామా, మేము కొన్ని విషయాలు నీతో రహస్యంగా మాట్లాడాలి. ఈ సంభాషణ ఎవ్వరూ వినకూడదు, భంగం కలిగించకూడదు. ఎవరైనా ఆటంకం కలిగిస్తే వారిని శిరచ్ఛేదన చేయాల్సి ఉంటుంది. సమ్మతమేనా?” అని అడిగారు.
సమ్మతమేఅన్నాడు రాముడు. ద్వారం కాపలా కాయడానికి హనుమంతుడు లేడాయె. అందుకని, రాముడు లక్ష్మణుని పిలిపించి, అతడిని గుమ్మం వద్ద కాపలాకు నిలబెట్టి ఎవరినీ లోనికి రానివ్వవద్దని ఆజ్ఞాపించాడు.
లక్ష్మణుడు ద్వారానికి కాపలా కాస్తుండగా, విశ్వామిత్ర మహర్షి వచ్చి నేను వెంటనే రాముణ్ణి చూడాలి. ఇది చాలా ముఖ్యం. రాముడెక్కడ?” అని గద్దించాడు.
రాముడు రహస్య సమావేశంలో ఉన్నాడు. ఇప్పుడు లోనికి పోవడానికి వీల్లేదు.జవాబు చెప్పాడు లక్ష్మణుడు.
రాముడు నాతో చెప్పలేని రహస్యాలేముంటాయి. నేను ఇప్పుడే వెళ్ళి తీరాలి.అన్నాడు విశ్వామిత్రుడు.
నేను అన్నగారిని అడిగి, ఆయన అనుజ్ఞ తీసికోనిదే ఎవ్వరినీ లోపలకి వెళ్ళనీయలేను,” అన్నాడు లక్ష్మణుడు.
అయితే తక్షణం లోపలికి పోయి నేను వచ్చానని రాముడికి చెప్పు,” అని విశ్వామిత్రుడు మళ్ళీ గద్దించాడు.
రాముల వారు బయటికి వచ్చేవరకూ నేనే కాదు, ఎవ్వరూ లోపలికి పోరాదని నాకు మరీ మరీ చెప్పారు. అందుచేత మీరు కాసేపు ఓపిక పట్టి వేచి ఉండండిఅని లక్ష్మణుడు అనగానే, విశ్వామిత్రుడు తోకతొక్కిన తాచులా బుసకొడుతూ నువ్వు వెంటనే రాముడికి నేను వచ్చినట్టు చెప్పకపోతే, నేను మీ రాజ్యాన్ని బూడిద పాలు చేస్తా!అంటూ బెదిరించాడు.
లోనికి వెళ్తే నేను చస్తాను. వెళ్ళకపోతే రాజ్యమే బూడిదౌతుంది. నాకన్న రాజ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం కాబట్టి నేను చావడమే మేలు.అని ఒక్క క్షణం ఆలోచించి లక్ష్మణుడు లోనికి వెళ్ళాడు.
ఏమిటి విషయంఅడిగాడు రాముడు.
విశ్వామిత్రులవారొచ్చారు
అయితే, లోనికి పంపించు
విశ్వామిత్రుడు లోనికి ప్రవేశించాడు. వశిష్ఠుడు, బ్రహ్మదేవులతో జరుపుతున్న రహస్య సమావేశం అప్పటికే అయిపోయింది. వాళ్ళు శ్రీరాముడితో చెప్పిన మాటల సారాశం ఇది: రామా! నీవు ఈ భూలోకంలో చెయ్యవలసిన పని అంతా పూర్తి అయ్యింది. నీవు ఇక ఈ మానవావతారం చాలించి మళ్ళీ దేవతల్లో చేరవలసిన సమయం వచ్చింది. ఈ విషయం చెప్పడానికే మేము సురలోకం నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక మేము సెలవు తీసుకుంటాము.
వాళ్ళిద్దరూ వెళ్ళగానే లక్ష్మణుడు, “అన్నా! రామా! నువ్వు ఇప్పుడు నా శిరస్సు ఖండించాలి,” అని అన్నాడు.
అందుకు శ్రీరాముడు,”లక్ష్మణా! నీ అపరాధం ఏమీ లేకుండా నీ శిరస్సు ఖండించడం దేనికి? బ్రహ్మ,వశిష్ఠులవారూ, వచ్చిన పని ఎప్పుడో పూర్తి అయ్యింది,” అని అన్నాడు.
లక్ష్మణుడు శ్రీరామా! నీవు ఆడిన మాట తప్పని వాడవని అందరికీ తెలుసు. నేను నీ తమ్ముడిని గనుక నీవు నన్ను వధించడానికి వెనుదీయడం ధర్మం కాదు. శ్రీరాముడు మాట తప్పినాడన్న మాట, ఆ కళంకం, నా మూలంగా నీకు రాకూడదు. నీవు నీ భార్యనే తిరిగి అడవులకు పంపినది మాట నిలబెట్టుకోవడం కోసమే కదా? నువ్వు ఇప్పుడు నన్ను శిక్షించక వదిలితే, నన్ను నేనే శిక్షించుకోవాలి. అనుజ్ఞ ఇవ్వు అన్నా! సెలవుఅని చెప్పి తను సరయూ నదికి వెళ్ళి మునిగి మరి తిరిగి కనిపించకుండా అంతర్థానం అయ్యాడు. లక్ష్మణుడు, ఆదిశేషుని అవతారం. తన దేహం చాలించవలసిన సమయం వచ్చిందని తనకి తెలుసు!
లక్ష్మణుడు అట్లా దేహత్యాగం చేసిన తరువాత, శ్రీరాములవారు లవకుశులకు పట్టాభిషేకం చెయ్యడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చెయ్యమని విభీషణుడికి, సుగ్రీవుడికి, మిగిలిన ముఖ్య అనుచరులందరికీ చెప్పి, తను కూడా సరయూ నదికి పోయి తన మానవావతారాన్ని చాలించాడు.
ఇదిలా జరుగుతుండగా, హనుమంతుడు ఇంకా పళ్ళెంలో రామ, రామఅని జపం చేస్తూ ఉన్నాడు. పాతాళరాజు ఎవరు నువ్వు?” అని అడిగాడు.
నా పేరు హనుమంతుడు. రాముని బంటును. నా రాముని ఉంగరం చిల్లులో పడిపోయింది. దాన్ని వెతుకుంటూ ఇక్కడికి వచ్చాను.

పాతాళరాజు చుట్టూ చూసి ఒక పేద్ద పళ్ళెం తీసుకువచ్చాడు. ఆ పళ్ళెం నిండా వేలకొలది ఉంగరాలున్నాయి. మీ రాముడి ఉంగరం వెతికి తీసుకొని నువ్వు పైకి పోవచ్చుఅన్నాడు!

ఆ బంగారు పళ్ళెం నిండా ఉన్న వేల ఉంగరాలను చూసి, హనుమంతుడు బేజారెత్తి పోయాడు. అన్నీ చూడటానికి ఒకే మాదిరిగా ఉన్నాయి. వీటిలో నా రాముడి ఉంగరం ఏదో నాకు తెలియటల్లేదు,” అంటూ బుర్ర గోక్కున్నాడు.

పాతాళరాజు నవ్వుతూ చూడు! ఈ పళ్ళెంలో ఎన్ని ఉంగరాలున్నాయో, అంతమంది రాముళ్ళు ఉన్నారు. నువ్వు భూలోకానికి వెళ్ళేటప్పటికీ, నీ రాముడు తన అవతారం చాలించేసి ఉంటాడు. ఒక్కొక్క రాముడూ తన మానవావతారం చాలించడానికి ముందుగా ఆ రాముడి ఉంగరం నా పాతాళ లోకానికి వస్తుంది. ఆ ఉంగరాలన్నీ జాగ్రత్తగా దాచి ఉంచడం నా పని. ఇక నువ్వు భూలోకానికి పోవచ్చు,” అని ముగించాడు.

అలా ఒక్కొక్క రామునికి ఒక్కొక్క రామాయణముందని చెప్పడానికి ఈ కథ చెబుతుంటారు. భారత ఉపఖండంలోనూ, ఆగ్నేయాసియాలోనూ ఎన్ని రకాల రామాయణాలున్నాయో, అవి కొన్ని శతాబ్దాలుగా ఆయా సమాజాలపై ఏ రకమైన ప్రభావాలను చూపాయో పరిశీలిస్తే మనకు ఆశ్చర్యం కలిగక మానదు.

ప్రాచీన కాలంలోనే, రామాయణం ఎన్ని భాషల్లో వెలువడిందో ఆ భాషలపేర్లు వరుసగా రాస్తే చాంతాడంత పొడుగౌతుంది: కొన్ని శతాబ్దాల కాలంలో, అస్సామీ, బాలినీస్, బెంగాలి, కంబోడియన్, చైనీస్, గుజరాతి, జావనీస్, కన్నడ, కాశ్మీరి, ఖోటనీస్, లావోషన్, మలేషియన్, మరాఠీ, ఒరియా, ప్రాకృతం, సంస్కృతం, సంతాలి, సింహళం, తమిళం, తెలుగు, థాయి, టిబెటన్ మొదలైన భాషల్లో పలు రకాల అనువాదాలు వచ్చాయి. ఉదాహరణకు సంస్కృతంలోనే, ఇతిహాస, కావ్య, పురాణ కాలాదులన్నింటిని కలిపి 25 కంటే ఎక్కువ రామాయణాలు కనిపిస్తాయి. ఇవి కాక నాటకాలు, శాస్త్రీయ, జానపద నృత్యరూపకాలన్నింటిని కలుపుకుంటే రామాయణాల సంఖ్య మరింతగా పెరుగుతుంది. వీటికి, శిల్ప ప్రదర్శనలు, మూకాభినయాలు, తోలుబొమ్మలాటలు వంటి రామాయణ రూపాలన్నింటిని కలుపుకుంటే రామాయణాల సంఖ్య వేనవేలుగా పెరుగుతుంది. కుమారవ్యాస అనే కన్నడ కవి తను రామాయణం కాకుండా మహాభారతం రాయడానికి ఎందుకు పూనుకున్నాడో చెబుతూ ఇలా అంటాడు: తిణికిదను ఫణిరాయ రామాయణద కవిగళ భారదలి (రామాయణం రాసిన కవుల భారంతో భూభారాన్ని మోస్తున్న ఫణిరాజు క్రుంగిపోయాడట).

కావ్య రూపంలోని వివిధ రామాయణాల్ని అధ్యయనం చేసిన కమీల్ బల్క (Camille Bulcke) మూడు వందల దాకా రామాయణాలను(1950) లెక్కించాడు. ఈ వ్యాసంలో వివిధ భాషల్లో, వివిధ సంస్కృతులలో, వివిధ సంప్రదాయాలలో రామాయణం ఎలా చెప్పుకున్నారు? వాటిమధ్య భేదాలేమిటి? సామ్యాలేమిటి? ఏది యథాతథంగా అనువాదం చేశారు? దేన్ని అనుసృజన చేశారు? ఎలాంటి విషయాలు మార్పులు పొందాయి? వంటి విషయాలను స్థూలంగా పరిశీలిద్దాం.

వాల్మీకి రామాయణం, కంబ రామాయణం: ఇద్దరు అహల్యలు
లెక్కగట్టిన మూడువందల రామాయణ కథనాల్లో ప్రతిదానికి మరో కథనానికి ఏవో కొన్ని తేడాలు కనిపిస్తాయి. ఇక్కడ నేను వైవిధ్యాలనో, పాఠాంతరాలనో అనకుండా కథనాలు అనడానికి కారణం ఉంది. వైవిధ్యం అన్నా, పాఠాంతరమన్నా ఒక మూలకథ ఉంది అన్న భావన కలుగుతుంది. అందులో ఆ మూలకథ అత్యంత ప్రాచీనమైన వాల్మీకి కథ అన్న సూచన కూడా వినిపిస్తుంది. అయితే, వివిధ అనువాదాలకు వాల్మీకి కథే మూలకథ కాదు అన్న విషయం మనం ఈ వ్యాసంలో ముందు, ముందు గమనిస్తాం. ఈ విషయంలో ముందుగా రాముని కథకు పలువురి కథనాలకు మధ్య తేడా గుర్తుపెట్టుకోవాలి. కంబ రాసినదైనా, తులసీదాసు, కృత్తివాసులు రాసినవైనా, తరువాతి కాలంలో రామాయణాలుగా పేరు వచ్చిన వీటికి తొలుత వేర్వేరు శీర్షికలున్నాయి: ఇరామావతారమ్, రామచరితమానస్, రామకిఎన్ మొదలైన శీర్షికలు వేరైనట్లే, వారు చెప్పిన కథకు వాల్మీకి చెప్పిన రామాయణానికి ఉన్న సంబంధంలో కూడా ఎన్నో వైరుధ్యాలున్నాయి. ఈ రకంగా కథకు, ఒక కవి ఆ కథను చెబుతూ రాసిన కావ్యానికి వ్యత్యాసాన్ని పాటించే సంప్రదాయం ఫ్రెంచి సాహిత్యంలో (స్థూలంగా Subject, Narrative) మధ్య పాటించే వ్యత్యాసం లాంటిది. మరోరకంగా చెప్పాలంటే, ఒకే వాక్యాన్ని వేర్వేరు వక్తలు వారి, వారి ఉపన్యాస ధోరణిలో చేసిన ఉచ్చరింపులలో ఉండే వ్యత్యాసం లాంటిది: చెప్పే కథ, నిర్మాణం, కథా సంఘటనలు ఒకటే అయినా వారి గొంతుక లోనూ, పలికే పద్ధతి లోను ఉన్న తేడాల వల్ల, కలిగే అనుభూతిలో ఎంతో వ్యత్యాసం ఉంటుంది కదా!

ఉదాహరణకు ఈ కింది రెండు కథనాలను పరిశీలించండి. మొదటిది సంస్కృతంలో వాల్మీకి రాసిన రామాయణం లోని బాలకాండ నుండి తీసుకుంటే, రెండవది తమిళంలో కంబ రాసిన ఇరామావతారమ్ లోనిది. రెండూ అహల్యా వృత్తాంతాన్నే చెబుతున్నాయి.

తాం దృష్ట్వా మునయః సర్వే జనకస్య పురీం శుభాం |
సాధు సాధు ఇతి శంసంతో మిథిలాం సమపూజయన్ |౧-౪౮-౧౧|
జనకుని పురమైన మిథిలా నగరాన్ని చూడగానే అద్భుతం, అద్భుతంఅని విశ్వామిత్రునితో పాటు ఉన్న మునులు ప్రశంసించారు.

మిథిల ఉపవనే తత్ర ఆశ్రమం దృశ్య రాఘవః |
పురాణం నిర్జనం రమ్యం పప్రచ్ఛ ముని పుంగవం |౧-౪౮-౧౨|
రాఘవుడు ఆ సమీపములో ఒక ఆశ్రమాన్ని చూశాడు. ఆ రమ్యమైన ఆశ్రమం పురాతనమై, నిర్జనమై ఉండడం చూసి మునిపుంగవుని ఇలా అడిగాడు:

ఇదం ఆశ్రమ సంకాశం కిం ను ఇదం ముని వర్జితం |
శ్రోతుం ఇచ్ఛామి భగవన్ కస్య అయం పూర్వ ఆశ్రమః |౧-౪౮-౧౩|
ఆశ్రమంలా కనిపిస్తున్న ఈ స్థలాన్ని మునులు ఎందుకు వర్జించారు? ఇంతకు పూర్వం ఇది ఎవరి ఆశ్రమమో వినగోరుతున్నాను

తత్ శ్రుతా రాఘవేణ ఉక్తం వాక్యం వాక్య విశారదః |
ప్రతి ఉవాచ మహాతేజా విశ్వమిత్రో మహామునిః |౧-౪౮-౧౪|
వాక్య విశారదుడైన రాఘవుడు అలా అడగగా విని, మహాతేజస్సు గల మహాముని విశ్వామిత్రుడు ఇలా సమాధానమిచ్చాడు.

హంత తే కథయిష్యామి శృణు తత్త్వేన రాఘవ |
యస్య ఏతత్ ఆశ్రమ పదం శప్తం కోపాన్ మహాత్మనా |౧-౪౮-౧౫|
ఈ ఆశ్రమం ఎవరిదో, ఏ మహాత్ముడు కోపంతో శాపమిచ్చాడో ఆ కథను సంతోషంగా చెబుతాను రాఘవా!

గౌతమస్య నరశ్రేష్ఠ పూర్వం ఆసీత్ మహాత్మనః |
ఆశ్రమో దివ్య సంకాశః సురైః అపి సుపూజితః |౧-౪౮-౧౬|
ఓ నరశ్రేష్ఠా, పూర్వం దివ్య సంకాశంతో, దేవతలచే పూజింపబడిన ఈ ఆశ్రమం గౌతముడనే మహాత్మునిది.

స చ అత్ర తప ఆతిష్ఠత్ అహల్యా సహితః పురా |
వర్ష పూగాని అనేకాని రాజపుత్ర మహాయశః |౧-౪౮-౧౭|
ఓ మహాయశముగల రాజపుత్రా, తన భార్య అహల్యా సహితుడై పూర్వం గౌతముడు అనేక వర్షాలు ఇక్కడ తపస్సు చేశాడు.

తస్య అంతరం విదిత్వా తు సహస్రాక్షః శచీ పతిః |
ముని వేష ధరో భూత్వా అహల్యాం ఇదం అబ్రవీత్ |౧-౪౮-౧౮|
గౌతముడు ఆశ్రమంలో లేని వేళ తెలుసుకొని, సహస్రాక్షుడైన శచీపతి మునివేషం ధరించి అహల్య చెంతకు చేరి ఇలా అన్నాడు.

ఋతు కాలం ప్రతీక్షంతే న అర్థినః సుసమాహితే |
సంగమం తు అహం ఇచ్ఛామి త్వయా సహ సుమధ్యమే |౧-౪౮-౧౯|
చక్కని అంగాలు గలదానా, అర్థించేవారు ఋతుకాలం కోసం ఎదురుచూడరు. నీతో సంగమాన్ని కోరుతున్నాను, ఓ చక్కని నడుము గలదానా!

ముని వేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన |
మతిం చకార దుర్మేధా దేవ రాజ కుతూహలాత్ |౧-౪౮-౨౦|
రఘునందనా, ముని వేషంలో ఉన్నవాడు సహస్రాక్షుడని తెలిసినా దుర్మేధస్సుతో దేవరాజు కుతూహలాన్ని తీర్చాలని నిర్ణయించుకుంది.

అథ అబ్రవీత్ సురశ్రేష్ఠం కృతార్థేన అంతరాత్మనా |
కృతార్థా అస్మి సురశ్రేష్ఠ గచ్ఛ శీఘ్రం ఇతః ప్రభో |౧-౪౮-౨౧|
ఆత్మానం మాం చ దేవేశ సర్వదా రక్ష గౌతమాత్ |
అప్పుడు సురశ్రేష్ఠుని కోర్కె దీర్చి ఇలా అన్నది: కృతార్థురాలను అయ్యాను, ఓ సురశ్రేష్ఠా, ఇప్పుడు శీఘ్రంగా వెళ్ళు. ఓ దేవేశా, నిన్ను, నన్ను గౌతముని నుండి రక్షించుకోవడానికి.

ఇంద్రః తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదం అబ్రవీత్ |౧-౪౮-౨౨|
సుశ్రోణి పరితుష్టో అస్మి గమిష్యామి యథా ఆగతం |
ఇంద్రుడు నవ్వుతూ అహల్యతో ఇలా అన్నాడు: ఓ సుశ్రోణి, నేనూ పరితుష్టుడనయ్యాను. ఎలా వచ్చానో, అలా వెళ్తాను.

ఏవం సంగమ్య తు తయా నిశ్చక్రామ ఉటజాత్ తతః |౧-౪౮-౨౩|
స సంభ్రమాత్ త్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి |
ఓ రామా, అలా సంగమించి ఇంద్రుడు గౌతముడు వస్తాడేమోనన్న శంకతో త్వరగా నిష్క్రమించుచుండగా

గౌతమం స దదర్శ అథ ప్రవిశంతం మహామునిం |౧-౪౮-౨౪|
దేవ దానవ దుర్ధర్షం తపో బల సమన్వితం |
తీర్థ ఉదక పరిక్లిన్నం దీప్యమానం ఇవ అనలం |౧-౪౮-౨౫|
గృహీత సమిధం తత్ర స కుశం ముని పుంగవం |
దేవదానవులకు దుర్దర్షుడు, తపోబలసమన్వితుడు, నదీస్నానం చేసి తడిగా ఉన్నా యజ్ఞాగ్నివలే వెలిగిపోతున్నవాడు అయిన గౌతముడిని చూశాడు, సమిధలు, దర్భకర్రలు ఆ మునిపుంగవుని చేతిలో ఉండగా

దృష్ట్వా సుర పతిః త్రస్తో విషణ్ణ వదనో అభవత్ |౧-౪౮-౨౬|
అథ దృష్ట్వా సహస్రాక్షం ముని వేష ధరం మునిః |
దుర్వృత్తం వృత్త సంపన్నో రోషాత్ వచనం అబ్రవీత్ |౧-౪౮-౨౭|
చూడగానే సురపతి భయంతో విషణ్ణ వదనుడయ్యాడు. అప్పుడు మునివేషంలో దుర్వృత్తిలో ఉన్న సహస్రాక్షుణ్ణి చూసి వృత్త సంపన్నుడైన ఆ ముని రోషవచనాలు పలికాడు:

మమ రూపం సమాస్థాయ కృతవాన్ అసి దుర్మతే |
అకర్తవ్యం ఇదం యస్మాత్ విఫలః త్వం భవిష్యతి |౧-౪౮-౨౮|
ఓ దుర్మతి, నా రూపం స్వీకరించి చెయ్యకూడని కార్యాన్ని నిర్వహించావు. ఇక నీవు వృషణాలు లేని వాడవగుగాక!

గౌతమేన ఏవం ఉక్తస్య స రోషేణ మహాత్మనా |
పేతతుః వృషణౌ భూమౌ సహస్రాక్షస్య తత్ క్షణాత్ |౧-౪౮-౨౯|
మహాత్ముడైన గౌతముడు రోషంతో ఆ విధంగా పలకగానే ఇంద్రుని వృషణాలు ఆ క్షణమే భూమిమీద రాలిపడ్డాయి.

తథా శప్త్వా చ వై శక్రం భార్యాం అపి చ శప్తవాన్ |
ఇహ వర్ష సహస్రాణి బహూని నివషిస్యసి |౧-౪౮-౩౦|
వాయు భక్షా నిరాహారా తప్యంతీ భస్మ శాయినీ |
అదృశ్యా సర్వ భూతానాం ఆశ్రమే అస్మిన్ వషిస్యసి |౧-౪౮-౩౧|
ఇంద్రుని అలా శపించి, పిదప, తన భార్యను కూడా నీవు వేల సంవత్సరాలు వాయువు భక్షణ చేస్తూ, నిరాహారివై, ధూళి, భస్మాలపై శయనిస్తూ, సర్వభూతాలకు అదృశ్యంగా ఈ ఆశ్రమంలో పడి ఉండుగాకఅని శపించాడు.

యదా తు ఏతత్ వనం ఘోరం రామో దశరథ ఆత్మజః |
ఆగమిష్యతి దుర్ధర్షః తదా పూతా భవిష్యసి |౧-౪౮-౩౨|
ఎప్పుడైతే ఈ ఘోర వనానికి దుర్ధర్షుడైన దశరథాత్మజుడు, రాముడు వస్తాడో అప్పుడు పవిత్రురాలవౌతావు.

తస్య ఆతిథ్యేన దుర్వృత్తే లోభ మోహ వివర్జితా |
మత్ సకాశే ముదా యుక్తా స్వం వపుః ధారయిష్యసి |౧-౪౮-౩౩|
ఓ దుర్వృత్తి గావించినదానా, అతనికి ఇచ్చే ఆతిథ్యంతో నీ లోభ మోహాలు తొలగిపోయి నీవు స్వయం రూపం ధరించి నావద్దకు చేరుకుంటావు.

ఏవం ఉక్త్వా మహాతేజా గౌతమో దుష్ట చారిణీం |
ఇమం ఆశ్రమం ఉత్సృజ్య సిద్ధ చారణ సేవితే |
హిమవత్ శిఖరే రమ్యే తపః తేపే మహాతపాః |౧-౪౮-౩౪|
దుష్టచారిణిని అయిన అహల్యతో అలా అని మహాతేజుడైన గౌతముడు ఈ ఆశ్రమాన్ని వదిలివేసి సిద్ధ చారణులు సేవించుచుండగా రమ్యమైన హిమవత్ శిఖరాల వద్ద తపస్సు కొనసాగించాడు.

ఇక కంబరామాయణంలో అహల్యాపటలము ఇలా సాగుతుంది. (కంబరామాయణంలో అహల్యా వృత్తాంతానికి తెలుగుసేత పూతలపట్టు శ్రీరాములురెడ్డి చేసిన తెలుగు అనువాదం నుండి తీసుకున్నాను సు.కొ.)


హర్షమొందుచు విదేహారామములఁ జూచి, వెలలి ప్రాకార సంవేష్టితమగు
మిథిలా నగరికొక్క మేటి యలంకార మైపొడవైన ధ్వజాలి వెలయు
బయటి ప్రహరికి వెల్పల వచ్చి నిల్వగా ర్హస్థ్యోచితము పతివ్రత గుణంబు
పదరి పాడోనరించి భర్తృ శాపంబున రాయియై పడియున్న రామ యపుడు
రామపదధూలి సోక పూర్వంబు మనసు
నలము నజ్ఞాన మత్తత దొలఁగ నెఱుక
తేఱ రూపాంతరం బొంది దేవునెదుటఁ
బొలుచు జని పోల్కిఁ దొలిరూపు దొలఁక నిలిచె
క్రిందికి గంగఁ దెచ్చిన భగీరథు వంశమునం జనించు నో
సుందర! తృప్తిమై మెఱుపు చొప్పునఁ గ్రేవ నొదింగి నిల్చు నీ
చెందొవకంటి యిష్టపడి చెడ్డ యొనర్చిన పాకవైరికిన్
గ్రందుగ వేయి కన్నులిడు ఘౌతమ పత్ని యహల్య నాఁ జనున్
కెంజడ లుల్లసిల్లు ముని కేసరి యట్టులు పల్క విన్న శ్రీ
కంజనివాసినీపతి వికస్వర పద్మదళాక్షుడిట్లనున్
నెంజలి యిట్టులౌట తన నెక్కొను పూర్వ కృతాపరాధమా?
యంజక యప్పుడొప్పిన స్వయంకృతమా? యెఱుఁగంగఁ బల్కవే?
అనవిని భూరి విజ్ఞుడగు నమ్ముని యిట్లను సద్గుణాలయ
విను మును వజ్రియూర్ధ్వగత వీర్యుడు గౌతముఁడింట లేని వే
ళను హరిణాక్షి చంద్రముఖి లాలిత లక్షణ లక్షితాంగి యౌ
వనిత యహల్యతోఁ గలయ వాంఛ వహించె మనంబు లోపలన్
తొలఁగ కహల్య చూపులను తూపులు మార నిశాత సాయకం
బులు మది గాఁడ విజ్ఞతయు బోవ మదిం గల యూరటంబుచే
నలయుచునున్న యింద్రుఁడొక యప్పుడు సాహసవృత్తి నాగృహ
స్థులకు వియోగముంగొలిపి చొచ్చెను గౌతమవేషియై యటన్
ఇరువురు చేరి కామమను నింపగు నాసవమానుచుండు నా
తరి నితఁ డింద్రుఁడంచెఱిగి ధర్మమధర్మము మానసంబునం
తరయక సమ్మతించి చెలి యంగజ సౌఖ్యములందు దేలె న
త్తరుణమునన్ మునీశ్వరుఁడు తత్తఱ వచ్చె గృహంబు చేరఁగన్
విలుపని లే కమోఘముగఁ బెంపఱఁ దిట్ట వరంబులిచ్చి వే
ల్పుల యెకినీనిఁ జేయఁగల ప్రోడఁడు గౌతమమౌని డాయ రాఁ
దలఁగక లోక మొల్లెడ సదా చెడకుండెడు నిందఁగొన్న య
వ్వెలఁది వడంకి నిల్చె బల భేది చనందోడఁగెన్ బిడాలమై.
అనుపమ నీలిశాలియగు నమ్ముని కన్నుల నిప్పులుర్లఁగాఁ
గని కథ యంతయుం దెలిసి కార్ముకవీర! భవత్కరచ్యుతో
గ్ర నిశిత కాండముం జెనయు ఖండిత వాక్కులతో శపించె వ
జ్రిని పది నూర్ల యోనుల శరీరము నొందుము యంచు నత్తఱిన్
క్షణములో శాపఫలమొంది జంభభేది
యెల్లిదంబగు లజ్జతో నేగుపిదపఁ
జెలువఁ గని వెలవెలఁది చేష్టలను పొంది
నట్టి నీవును శిలవగుమని శపించె
మౌనికాళ్ళం బడి మడఁతి యో మునినాథ మన్నిపు మీ తప్పు నన్ను గావు
పిన్నల తప్పులఁ బెద్దలు సైఁచుట తగునని నీతివేత్తలు వచింత్రు
రని వేఁడ జ్వాలల నార్చు రుద్రుని పోలెఁ గ్రుద్ధుడై కను మునీంద్రుడు నంత
సతియెడ దయతో బ్రసన్నుఁడై వనమాలి రాముని శ్రీపాద రజము సోఁక
నీ యథారూపమెందుదో నెలఁతయనియె
నింద్రుఁకొని నిలింపులు ముని యెడకు వచ్చి
వేఁడ నతని యోనుల మాన్చి వేయి కనుల
నిచ్చి పంపె నహల్య రాయిగను పడియె.

ఈ రెండు కథనాల మధ్య తేడాలు కొన్ని: వాల్మీకి కథలో ఇంద్రుని విషయం అహల్యకు ముందుగానే తెలుసు. కంబరామాయణంలో వచ్చింది భర్త కాదని అహల్య మధ్యలో గ్రహించినా, ఆ నిషిద్ధ సుఖాన్ని వదలలేకపోతుంది. అదికాక కంబరామాయణంలో అహల్య భర్త పూర్తిగా జపతపాదులలో మునిగినట్లు మనకు ముందుగా సూచించడం కూడా కథకు సంక్లిష్టతను జోడిస్తుంది. తమిళకథలో ఇంద్రుడు పిల్లి రూపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. జానపదంలో లోకప్రియమైన ప్రసక్తి ఇది. కథా సరిత్సాగరంలో కూడా ఉంది. గౌతముడు ఇంద్రునికి ఒళ్ళంతా సహస్రయోనులు కలగాలని శాపమిచ్చి, తరువాత దాన్ని సహస్రనయనాలుగా మారుస్తాడు; అహల్యను సుఖస్పందనలేని రాయిలా మారుస్తాడు. వాల్మీకి కథలో కనిపించని ఈ వివరాలు, దక్షిణ భారతంలో జానపదుల కథల్లో, తమిళ శాసనాల్లోనూ, ఇతర దక్షిణ భారత భాషల రామాయణాల్లోనూ కనిపిస్తాయి. అంటే, వాల్మికి కథను ఉపయోగించుకోవడమే కాక, కంబకవి తన నివసిస్తున్న ప్రాంతంలోని జానపద సంప్రదాయాలను తనలో కథలో గుప్పించాడన్నమాట. ఈ కథలు ఇతర రామాయణాల్లో కనిపించడానికి కూడా కంబ రామాయణమే ఆధారం కావచ్చు.

కథాశిల్పం విషయంలో కూడా కంబ రామాయణంలో నాటకీయత ఎక్కువ. కంబరామాయణంలో ముందుగా రాముని పాదధూళి తాకి నల్లరాయి అహల్యగా మారుతుంది. ఆ తరువాతే ఆమె కథ మనకు తెలుస్తుంది. నల్లరాయి, ఎత్తైన ప్రదేశంపై రాముని రాకకు ఎదురుచూస్తూ ఉండటమే అద్భుత దృశ్యావిష్కారానికి ప్రతీక. అహల్య శాపవిమోచనం, జడమైన రాయి రక్తమాంసాలున్న మనిషిగా మారడం, పరమాత్మ స్వరూపానికి భక్తిభావం చూపే ఆత్మ ప్రతిస్పందనలా అనిపిస్తుంది. అంతేకాక, కంబరామాయణంలో అహల్య వృత్తాంతానికి అంతకు ముందే చెప్పిన తాటకి వృత్తాంతానికి కూడా సంబంధం చూపుతుంది. తాటక కథలో రాముడు పాపభంజనుడు. శత్రువులకు జడత్వాన్ని, మృతిని కూర్చేవాడు. అహల్య కథలో జడత్వానికి ప్రాణం పోసేవాడు; వరాల ధార కురిపించే ఘన నీల మేఘం. కంబని కథలో రాముడు అచ్చమైన తమిళ కథానాయకుడు. అరిభంజనుడు, భక్తప్రియరంజనుడు. అహల్య శాపవిమోచనం, లోకంలోని సకల జనులకు వారి పాపాలనుండి విముక్తి కలిగించడమే రాముని అవతార లక్షణంగా చూపిస్తుంది.

వాల్మీకి రామాయణంలోని రాముడు సంపూర్ణ మానవుడు. మానవరూపంలో కష్టసుఖాలనుభవిస్తూ, ఎలా ధర్మబద్ధమైన జీవితం గడపాలో రాముడి ద్వారా లోకానికి చెప్పబడింది. బాలకాండలోనూ, రావణుని సంహరించే సమయంలో రాముడిని పరమాత్మ స్వరూపంగా, అవతారపురుషుడిగా వర్ణించే సంఘటనలు, తరువాత జత చేసిన ప్రక్షిప్తాలని పండితుల వాదన. కంబరామాయణంలో మాత్రం రాముడు కథలో ఆసాంతం భగవత్ స్వరూపమే. కాబట్టి అహల్య కథ వంటి సంఘటనలలో భక్తి, ఆరాధనా ప్రకటనలు గాఢంగా కనిపిస్తాయి. కంబరామాయణం పన్నెండవ శతాబ్దంలో భక్తి ఉద్యమ ప్రభావంలో రాసినది. కంబ కథనంలో రాముడు చెడుని తొలగించి, మంచిని సంరక్షించే క్రమంలో అహల్యతో మొదలుకొని, రావణుడి వధించే వరకూ తన ధర్మాన్ని నిర్వర్తించినవాడు. వైష్ణవ భక్తి సంప్రదాయపు నమ్మాళ్వార్ ప్రతీకలు ఇందులో కనపడుతాయి. 
నమ్మాళ్వార్ రాసిన ఈ పాశురాన్ని చూడండి:

కఱ్పార్ ఇరామ పిరానై అల్లాల్ మట్ఱుం కఱ్పరో?
పుఱ్పా ముదలా పుల్లెఱుంబాది ఒన్ఱ్ ఇండ్రియే
నఱ్పాల్ అయోద్దియిల్ వాళుం చరాచరం ముట్రవుం
నఱ్పాలుక్కు ఉయ్‌త్తనన్ నాన్ముగనార్ పెట్ఱ నాట్టుళే. నమ్మాళ్వార్ 7.5.1
ఎఱిగి రామ ప్రభువును వేరొకరినెఱుగనేల?
గడ్డి మొదలు పాకే చీమవరకు ఎవరినొల్లక
శుభ అయోధ్యలో వసించు చరాచరమెల్లరికి
శుభమును కూర్చె బ్రహ్మసృష్టికిలలోన్

నమ్మాళ్వారు చూపిన ఇటువంటి భక్తిభావనలే కంబ రామాయణపు కావ్యమంతటా మనకు ప్రత్యక్షమవుతాయి.
పైన చూపిన విధంగా అహల్య కథ ఒకటే అయినా, భిన్నమైన కథనాలతో, రంగులతో ఎలా వేర్వేరుగా అల్లబడిందో, అలాగే వివిధ రామాయణాల్లో తరువాతి కవులు పూర్వకవుల కథకు తమవైన మెరుగులు దిద్దడం ద్వారా తమ సృజనాత్మకతను చాటుకోవడం కనిపిస్తుంది. ఒక రకంగా తరువాతి రామాయణాల కథనాలు, పూర్వ రామాయణ కథనాలకు అధి-చిత్రీకరణలు. ఉదాహరణకు, 16వ శతాబ్దానికి చెందిన ఆధ్యాత్మ రామాయణం వంటి కథల్లో రాముడు వనవాసం వెళ్ళేటప్పుడు సీత తనతో రాకూడదంటాడు. సీత రామునితో వాదిస్తుంది. ముందుగా మామూలు జవాబులే చెబుతుంది: ధర్మపత్నిగా అతని కష్టసుఖాలలో పాలు పంచుకోవాలి. అతడు వనవాసం చేస్తే తాను కూడా వనవాసిగా మారాలని చెబుతుంది. రాముడు కూడదంటాదు. సీత అప్పుడు రోషంతో, “ఇంతవరకూ లెక్కలేనన్ని రామాయణాలు వచ్చాయి. ఏ ఒక్క రామాయణంలోనైనా రామునితో అడవికి వెళ్ళని సీతను ఎక్కడైనా చూశామా?” అని ప్రశ్నిస్తుంది. దాంతో రాముడు ఒప్పుకుంటాడు; సీత రామునితో అడవికి వెళ్తుంది. ఇటువంటి కథనం వేరే రామాయణాల్లో కూడా కనిపిస్తుంది.


కంబ రామాయణం కూడా తరువాత వచ్చిన రామాయణాలపై తన ప్రభావాన్ని చూపించింది. తెలుగుదేశంలో వచ్చిన తెలుగు రామాయణాలలో, మలయాళ దేశపు దేవాలయాల్లో వేసే రామాయణ రూపకాల్లోను ఈ ప్రభావం మనం చూడవచ్చు. ఆగ్నేయాసియాలో వచ్చిన రామాయణాలపై కూడా కంబ రామాయణ ప్రభావం కనిపిస్తుంది.