గోవుమాలక్ష్మికి కోటి దండాలు -శ్రీ మహాభారతంలో కథలు



 
నృగ మహారాజు ఎన్నో పుణ్యకార్యాలు చేసాడు. ఆయన నిరంతరం గోదానం చేసేవాడు. నవనీతం వంటి హృదయం ఆయనది. ఎవరికీ ఏ కష్టం కలుగకుండా ప్రజలను పాలించేవాడు. ఓ సారి ఆయన వల్ల ఒక చిన్న పొరపాటు జరిగింది. ఒకరికి దానం చేసిన గోవునే మళ్ళీ ఇంకో బ్రాహ్మణుడికి దానమిచ్చాడు. గోవు నాదంటే నాదని ఆ విప్రులిద్దరూ తగువులాడుకున్నారు. చివరికి రాజుగార్నే అడుగుదామనుకుని ఆ యిద్దరు బ్రాహ్మణులూ నృగ మహారాజు దగ్గరకు వెళ్ళారు. వాళ్ళ తగాదా విని రాజుగారు విచారపడ్డాడు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాడు. " అయ్యా! దీన్ని ముందు మీకిచ్చిన మాట నిజమే. ఇది మా ఆవులలో కలిసి మేస్తుంటే మాదేననుకుని గోపాలకులు తీసుకువచ్చారు! తెలియక నేను దాన్ని మళ్ళీ ఈయనకు దానమిచ్చాను. పొరపాటుకు క్షమించండి. మీకు మంచి గోవులు నూరువేలిస్తాను. ఈ ఆవును ఆయనకు ఇచ్చేయండి" అన్నాడు మొదటి బ్రాహ్మణుడితో.

"మహారాజా! ఇది చాలా శ్రేష్ఠమైన ఆవు. నా కుమారుడు పాలకు ఎప్పుడు ఏడిస్తే అప్పుడు పాలు తీసుకోనిస్తుంది. అంత మంచి స్వభావం దీనిది! ఈ ఆవు నా ఇంట్లో లక్ష్మిలా ఉంటే నాకు సంతోషం కాని, నువ్వు కోటి గోవులిచ్చినా తీసుకోను నేను" అని వెళ్ళిపోయాడా బ్రహ్మణుడు.

"అయ్యా ! మీరు కోరినన్ని రత్నాలు, మణులూ, గోవులూ, ఇస్తాను. ఈ ఆవును ఆయన కివ్వండి" అని మహారాజు రెండవ బ్రాహ్మణుణ్ణి వేడుకున్నాడు.

" ఈ ఆవు తప్ప నాకు నీ రాజ్యమంతా ధారపోసినా అక్కర్లేదు" అంటూ మొండిగా ఆ ఆవును తీసుకుని వెళ్ళిపోయాడతను.

కొన్నాళ్ళు గడిచాకా నృగ మహారాజు కాలం చేసాడు. యమ భటులు యమధర్మరాజు దగ్గరకు తీసుకువెళ్లారు.

" మహారాజా! ఎన్నో పుణ్యకార్యాలు చేసావు. కాని ఒకరి కిచ్చిన గోవునే మరొకరికి దానమిచ్చి పొరపాటు చేసావు. విప్రుని మనసు కలత పెట్టావు. అందుచేత కొంచెం పాపం సంప్రాప్తించింది. ముందు పాపం అనుభవిస్తావా? పుణ్యం అనుభవిస్తావా?" అని యనుడు ప్రశ్నించాడు.

"పాపమే అనుభవిస్తాను" అన్నాడు. వెంటనే తలక్రిందులుగా భూమి మీద పడ్డాడు. పడుతూ పడుతూ ఉండగా-

" రాజా! విచారించకు. కొన్నాళ్ళయ్యాకా వాసుదేవుడు వచ్చి నిన్ను ఉద్ధరిస్తాడు. అప్పుడు నీకు శాశ్వత సౌఖ్యం కలుగుతుంది" అన్నాడు యమధర్మరాజు.

నృగుడు భూమి మీద తొండ రూపంలో తిరగసాగాడు. చాలా రోజులు గడిచాకా ఒకనాడు విధివశాత్తూ ఒక నూతిలో చేరాడు. ఆ నూతిలోకి వచ్చిన మరుక్షణంలోనే అతని శరీరం విపరీతంగా పెరిగిపోయింది. యమధర్మరాజు అనుగ్రహం వల్ల అతనికి పూర్వజన్మ స్మృతి ఉంది. తనను చూసుకుని తానే ఆశ్చర్యపడ్డాడు.

నూతి దగ్గరకు వచ్చిన ప్రజలు ఆ తొండను చూసి, ' ఇది ఇందులో ఉంటే నీళ్ళు పాడైపోతాయి ' అనుకుని పెద్ద పెద్ద తాళ్ళు తెచ్చి దానికి కట్టి పైకి లాగబోయారు.

కాని అది కదిల్తేగా! వాళ్ళకు భయం , ఆశ్చర్యం కూడా కలిగాయి. గబ గబ వెళ్ళి సంగతంతా కృష్ణభగవానుడితో చెప్పారు. ఆయన వెంటనే ఆ నూతి దగ్గరకు వెళ్ళి ఆ తొండను బయటకు తీసాడు. అప్పుడు నృగుడు దివ్యరూపం ధరించి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోయాడు.

" కృష్ణ స్పర్స వలన నృగుడికి ఉత్తమగతి కలిగినట్టే సజ్జనసాంగత్యం వల్ల సర్వసుఖాలూ కలుగుతాయి" అని మాంధాతృడికి బృహస్పతి చెప్పినట్టు మహాభారతంలో ఉంది.

దేవతలకు అమృతాన్ని ఆహారంగా ఇచ్చాడు బ్రహ్మ. ఆ అమృత పరిమళం లోంచి సురభి అనే ఆవు పుట్టింది. దాని సంతానం సౌరభేయులు. ఆ ఆవులన్నీ ఒకనాడు హిమవత్పర్వతం మీద సంచరిస్తూ ఉండగా ఒక దూడ తల్లి దగ్గరకు వెళ్ళి పాలు తాగటం మొదలుపెట్టిం ది. అప్పుడా పాలనురుగు గాలికి చెదిరి అక్కడే తపస్సు చేసుకుంటున్న ఈశ్వరుడి శిరస్సు మీద పడింది. ఆయన కోపగించుకుని మూడోకన్ను తెరిచాడు. ఆ కంటి మంటల వేడి సోకి ఆ ఆవుల శరీరాలకు కపిలవర్ణం వచ్చింది. దాంతో అవన్నీ భయపడి అక్కడినుంచి పారిపోయాయి.

అప్పుడు బ్రహ్మ వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ప్రసన్నుణ్ణి చేసాడు. ఒక మంచి ఎద్దును కానుకగా ఇచ్చాడు. అప్పటి నుంచీ ధూర్జటికి నంది వాహనమైంది. శివుడి ధ్వజం మీద కూడా వృషభచిహ్నం ఉంటుంది.

శివుడు ప్రసన్నుడు కావడంతో ఆవులన్నీ మళ్ళీ ఆ పర్వతం మీదకు వచ్చాయి. వాటిని చూచి అవి సర్వాత్రా సంచరించగలవి గానూ, మిగిలిన గోవులకంటే ఆ కపిల గోవులకు ఉత్తమత్వం కలిగేటట్టుగానూ వరమిచ్చాడు శివుడు.


ఈనాటికీ గోవుల్ని లక్ష్మీస్వరూపాలుగా ఆరాధించడం , గోపంచకాన్ని పవిత్రమయినదిగా భావించడం జరుగుతోంది. భోజనం చేసే ముందు గోవులకు గుప్పెడు పచ్చిక వేస్తే కొండంత పుణ్యమని మనవాళ్ళు భావిస్తారు.